మాయాబజార్ సినిమా క్విజ్ సమాధానాలు


నిన్న ప్రకటించిన మాయాబజార్ క్విజ్ అంటే ఆ చిత్ర అభిమానులు విరివిగా పాల్గొంటారని అనుకున్నాను కానీ, మరీ బొత్తిగా ఇద్దరే సమాధానాలు వ్రాసారు. సరే ఏమైనా మరోసారి ప్రశ్నలు చూసి మీకేమైనా సమాధానం తెలుసేమో చూడండి.




1. తానశర్మ తందానశాస్త్రి పెట్టిన ముహూర్తం "దగ్ధయోగం"లో వుందని, బలరాముడి ఆస్థాన పురోహితులు వారిస్తారు. (తరువాత శశిరేఖాభిమన్యుల పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుందనుకోండి అది వేరే విషయం). ఆ వారించిన పురోహితుడి పేరేమిటి?



2. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన నటుడెవ్వరు?



3. తానశర్మ, తందాన శాస్త్రి విడిదిలో కొన్ని రకాల భ్రాంతులకు లోనౌతారు. అవేమిటి?



4. శకునిమామను ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు పందెం వెయ్యమని అడుగుతారు. చిత్రంగా అందరూ రెండు వెయ్యమంటారు. ఒక్కరు తప్ప. పందెం అడిగేదెవ్వరు? రెండు కాకుండా వేరే పందెం అడిగేదెవ్వరు?



5. శాకంబరీదేవి ప్రసాదం ఏమిటి?



6. సుభద్రాభిమన్యులను రథంపై ద్వారక నుంచి ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చే సారథి ఎవరు?



7. శశిరేఖ ఇష్ట సఖి పేరేమిటి?



8. అడవిలో సుభద్రాభిమన్యులను గోడకట్టి అడ్డుకునే రాక్షసుడి పేరేమిటి?



9. సుభద్రాభిమన్యులను అడవిలో ఘటోత్కచుడి రాక్షసులు ఎదుర్కునేటప్పుడు నేపధ్య సంగీతం ఏమిటి?



10. ఘటోత్కచుడి ఆశ్రమంలో దీవించడానికి వాడే పదం ఏమిటి?



జవాబులు:



1. బలరాముడి ఆస్థాన జ్యోతిష్యులు శంకుతీర్థుల వారు.

2. హాస్యనటుడు బాలకృష్ణ (అంజిగాడు) ఇందులో రెండు పాత్రలలో కనిపిస్తారు. హస్తినాపురంలో లక్ష్మణకుమారుడి సారథిగా, ద్వారకలో ఘటోత్కచుడు తొలిసారి వచ్చినప్పుడు ద్వారపాలకుడిగా లల్లాయిపాట పాడుతూ కనిపిస్తాడు.

3. వివాహభోజనంబు మాయం అయ్యి మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు "మనఃభ్రాంతి", గింబళిపైన తొమలపాకుల పళ్ళెం జరిగినప్పుడు "లోభ్రాంతి", గింబళి ఇద్దరినీ కప్పేసినప్పుడు "సమాధి భ్రాంతి". ఈ విషయాన్ని అల్లురామలింగ-తానశర్మ వివరిస్తాడు.

4. దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు, మాయాశశిరేఖ పందెం చెప్తారు. ముక్కామలదుర్యోధనుడు ముందు "అదే రెండు" అని చెప్పినా, "అహ కాదు కాదు ఒకటి" అంటాడు. "తడబడుతూ అడిగితే అది కూడా తడబడుతూ ఒక్కటే పడింది" అంటాడు సీయస్ఆర్‌శకుని. మాయా శశిరేఖ అడిగినప్పుడు ముందు ఒకటి పడ్డట్టు కనిపించినా మళ్ళీ రెండుగా కనపడుతుంది. "శశిరేఖ కనికట్టు నేర్చినదా లేక నా కన్నేమైనా చెదిరినదా " అంటాడు సీయస్ఆర్‌.శకుని.

5. "ఏమిటా.. గోంగూర.. శాంకంబరీ దేవి ప్రసాదం..ఆంధ్రశాకం  అది లేకపోతే ప్రభువులు ముద్దైనా ముట్టరు తెలిసిందా?"

6. దారుకుడు - భళి భళి మాధవపెద్ది

7. మైనా - ఘటోత్కచుడు ద్వారక వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు "మైనా ఇకనుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి" అంటూ పురమాయిస్తాడు.

8. కుడ్యాసురుడు - కుడ్యం అంటే గోడ.

9. "కోర్ కోర్ శరణు కోర్..".. "ఫో ఫో వెనక్కి ఫో.." లాగా వినిపిస్తుంది కాని, "కోర్ కోర్.." వున్నట్టు గతంలో హాసంలో వివరించారు.

10. అలమలం.. అలమలం పుత్రా అలమలం..


మరోసారి ఈ చిత్ర సృష్టికర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ.. శలవు.

1 వ్యాఖ్య(లు):

subhadra vedula చెప్పారు...

kor kor sharanu kor ani nenu sari ayina samaadhanam ani raseloga meeru cheppesaru. Eight on 10 is pretty decent score for me. Thank you for posting this..