ధర్మరాజు స్వర్గారోహణం

యుధిష్టరుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా వైభోవోపేతంగా నిర్మించిన ద్వారమొకటి కనపడింది. తానెక్కడున్నాడో అర్థంకాలేదు. తన తమ్ముళ్ళతో ద్రౌపదితో కలిసి స్వర్గారోహణ చెయ్యటం ఒక్కొక్కళ్ళుగా అందరూ రాలి పోవటం అంతా అతని కళ్ళముందు కనపడింది.

అంటే తాను మరణించాడా..? ఈ కనపడేవి స్వర్గ ద్వారాలేనా..??

"యుధిష్టిరునికి స్వాగతం" అన్నారు ద్వారానికి ఇరువైపులా వున్న భటులు. మహారాజా అన్న పిలుపుకి అలవాటు పడ్డందుకేమో యుధిష్టరుడనే పిలుపు కొత్తగా వినపడింది.

"నన్ను అందరూ ధర్మరాజంటారు.." చెప్పాడు

"మాకున్న ధర్మరాజు ఒకడే.. మా ప్రభువు యమధర్మరాజు.."

"అంటే ఇది స్వర్గం కాదా..?"

"ఇక్కడ స్వర్గమూ వుంది నరకమూ వుంది.." అంటుండగానే ఆ ద్వారాలు తెరుచుకున్నాయి.

యుధిష్టరుడు లోపలికి ప్రవేశించాడు. కొంత ముందుకెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడ -

శొభాయమానమైన సింహాసనంపై ఆసీనుడై వున్నాడు ధుర్యోధనుడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతూ, సుర్యతేజంతో ప్రభాసిస్తూ..

ఇది నిజమా.. లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా..? అనుకుంటూ తల తిప్పేసుకున్నాడు. తనతో వస్తున్న భటులతో అన్నాడు -

"ఈ ముందుచూపులేని మూర్ఖుడు దుర్యోధనుడితో నేను ఈ లోకాన్ని పంచుకోలేను. కురుక్షేత్ర సంగ్రామానికి, కురు వంశ నాశనానికి కారణం అతడే. భటులారా నేను ఆతడి ముఖం కూడా చూడలేను. నన్ను దయచేసి నా తమ్ముల దగ్గరకు తోసుకెళ్ళండి.." అంటూ అడిగాడు. అంతలో ఒక మహాపురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

"యుధిష్టిరా.. ఇది సమవర్తి లోకం.. ఇక్కడ ద్వేషానికి, శత్రుత్వానికి ఆస్కారంలేదు. దుర్యోధనుడి గురించి నీవటుల పలకరాదు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధంలో పోరాడి మరణించి అంతను ఇక్కడ స్వర్గ సౌఖ్యాలనుభవిస్తున్నాడు. ఇక్కడ దేవతలు సైతం అతనిని పూజిస్తారు. కాబట్టి ఇక ద్వేషాన్ని మరచి అతనితో కలువు.." అంటు హితబోధ చేసాడు.

"సరే దురోధనుడు క్షత్రియ ధర్మాన్ని పాటించినవాడైతే అతన్ని ఇక్కడే వుండనీ... నేను మాత్రం ఇక్కడుండలేను. యుద్ధంలో మరణించినవారికే స్వర్గమైతే నా అభిమన్యుడెక్కడ, దుష్టద్యుమ్నుడు అతని కుమారులెక్కడ, గురు ద్రోణులు, పితామహుడెక్కడ... నా అగ్రజుడు కర్ణుడుడెక్కడ... నా తమ్ముళ్ళెక్కడ..?? నన్ను అక్కడికి తీసుకెళ్ళండి.."

"అవశ్యం. మీరు ఏది కోరితే అది నెరవేర్చమని మా ప్రభువు ఆజ్ఞ.. మా భటులతో వెళ్ళండి మీరు కోరిన చోటికి తీసుకెళ్తారు.." అంటూ ఆ దేవతాపురుషుడు అదృశ్యమయ్యాడు. భటులు ముందుకు కదిలారు. యుధిష్టరుడు వెనకే నడవసాగాడు.


ఆ దారంతా ఎంతో దుర్భరంగా వుంది. పాపాలు చేసిన మానవులంతటా పరుచుకొని వున్నారు. ఇనప ముళ్ళున్న కందిరీగలు కుడుతున్నాయి, కాకులు గద్దల ఇనుప ముక్కులతో రక్తమోడుతున్నాయి. కుళ్ళిపోయిన శవాలున్నాయి... వాటి నిండా దుర్గంధభరితమైన కీటకాలు. కొంత దూరం వెళ్ళాక మరుగుతున్న నీటితో నిండిన నది కనపడింది. అది దాటిన పిమ్మట ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అక్కడి చెట్లకు కత్తులాంటి ఆకులున్నాయి.. అవన్ని యుధిష్టరుడికి గీసుకొని రక్తం కారసాగింది. కాగుతున్న నూనెలో మరుగుతూ, రాళ్ళతో, ఇనుముతో చేసిన ఆయుధాల దెబ్బలు తింటూ యమలోకపు శిక్షలనుభవిస్తున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు భయంకరంగా వున్నాయి.

అక్కడి పరిస్థితి ముందుకెళ్తున్నకొద్దీ మరింత దుర్భరమవసాగింది. యుధిష్టరుడు అసహనంగా అడుగులు వెయ్యసాగాడు. చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. భయంకరమైన దుర్గంధం తప్పించి తను ఎటు వెళ్తున్నది అర్థం కావటంలేదు. పాదాలలో సూదికొనయైన ముళ్ళు దిగబడి రక్తం ధారగా ప్రవహించసాగింది. ఇక ముందుకు అడుగులెయ్యలేక అక్కడే ఆగిపోయాడు.

"భటులారా.. ఇంకా ఎంత దూరం ఈ హేయమైనా ప్రదేశంలో నడిపిస్తారు... నా తమ్ముళ్ళను చూపించండి.. ఇక వారిని చూడటానికి నేను ఒక్క క్షణం కూడా వేచి వుండలేను.." అన్నాడు బాధగా.

"అయ్యా.. మనం చేరవలసిన చోటికి చేరుకున్నాము. మిమ్మల్ని ఇక్కడిదాకా మాత్రమే తీసుకురమ్మని మా ప్రభువుల ఆజ్ఞ. మీరు సమ్మతిస్తే ఇక్కడే వదిలేసి మేము తిరిగి వెళ్ళిపోతాము. లేదా మాతో తిరిగి రాదలుచుకుంటే తీసుకు వెళ్తాము. తమ ఆజ్ఞ ఏమిటో తెలియజేయండి."

యుధిష్టరుడు ఆశ్చర్యపోయాడు. కన్ను కానని ఈ చీకటిలో, భయంకరమైన ఆడవిలో ఎక్కడని తమ్ముళ్ళను గాలించగలడు. ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఒక్క క్షణం కూడా జీవించి వుండలేడు. ఇలా అనుకుంటూ యుధిష్టరుడు వెనుతిరిగాడు. అంతలో నలువైపుల నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి..

"ధర్మనందనా.. మమ్మల్ని విడిచి వెళ్ళద్దు.."

"మమ్మల్ని కాపాడు అన్నయ్యా..."

"నీ రాకతో ఇక్కడికి పరిమళ భరితమైన సువాసనలు ప్రవేశించాయి.. మాకు ఈ దుర్గంధాన్ని తప్పించే ఆ ఒక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నావా.."

యుధిష్టరుడు అదిరిపడ్డాడు. "ఎవరది.. ఎవరు మాట్లాడుతున్నారు..??" అడిగాడు

"అన్నయ్యా మేము నీ తమ్ముళ్ళం.. పాండు కుమారులం.."

"పెదనాన్నా మేము మీ పుత్రులం.. వుప పాండవులం"

"నేను ద్రౌపదిని"

"అభిమన్యుడను.."

యుధిష్టరుడి కంట అప్రయత్నంగా కన్నీరు వుబికింది.

"హతవిధీ.. ఏమిటీ ఘోరం..? మహావీరులైన తమ్ముళ్ళు, సాధ్వి ద్రౌపది, నా పుత్రులు వీరంతా వుండవలసిన చోటేనా ఇది. దుర్యోధనుడు చేసిన పుణ్యమేమిటి వీరంతా చేసిన పాపమేమిటి?? ఎందుకు వీరికీ శిక్ష విధించారు..? నా చిత్తమేమైనా చెలించినదా.. అస్వస్థుడనై నిద్రావస్థలో ఈ భయంకరమైన కలగంటున్నానా.." అనుకుంటూ అక్కడే కొంతసేపు నిలబడిపోయాడు.

అంతలోనే తేరుకొని భటులతో -

"మీరు వెళ్ళిపోండి.. మీ ప్రభువుతో నేను ఇక్కడే వుండటానికి నిశ్చయించుకున్నానని నివేదించండి. నా వునికి నా సోదరులకు ఇతర పాపులకి సాంత్వన కలగజేస్తుంటే వారి సుఖం కోసం నేను ఈ బాధలను భరించడానికి సిద్ధమే అని తెలుపండి.. వెళ్ళండి"

ఆ మాట వింటూనే వారు తిరిగివెళ్ళిపోయారు. యుధిష్టరుడు నిస్సహాయంగా నాలుగువైపుల చూసాడు.
"ఏమిటి విచిత్రం? నా తమ్ముళ్ళు నరకంలో వుండటమేమిటి? సరే, విధిరాతను తప్పించడం ఎవరికి సాధ్యం. నా పరివారానికి ఇదే రాసిపెట్టివుంటే అలాగే జరగునుగాక. సుయోధనుడు వీరమరణంతో అమరుడై వుంటే వుండుగాక. నేను మాత్రం ఇక్కడే వుంటాను. భూలోకంలో మహరాజుగా వీరందరి సేవలను అందుకున్నాను. ఇప్పుడు వీరందరికీ సేవ చేస్తాను. వారి సుఖంలోనే నాకు సుఖం వుంది, వారి సంతోషంలోనే నాకు సంతోషం వుంది, వారెక్కడ వుంటే అదే నాకు స్వర్గమౌతుంది" అనుకుంటూ ముందుకు కదలబోయాడు.

సరిగ్గా అప్పుడే దూరం నుంచి సుర్య తేజాన్ని మించిన వెలుగును చూసాడు. అది క్రమంగా దగ్గరకు రాసాగింది. ఆ వెలుగు ప్రసరించడంతో ఆ ప్రాంతమే మారిపోయింది. నరకలోక శిక్షలన్నీ మాయమై ఆ స్థానే దేవతా వృక్షాలు వాటికింద తపస్సు చేసుకుంటున్న మునులు కనిపించారు. అమోఘమైన పూల పరిమళాలు పరచుకున్నాయి. ఆ పరిసరాలన్నీ అద్భుతమైన దృశ్య కావ్యంగా మారిపోయాయి. ఆ వెలుగుతోబాటే ఇంద్రుడు, యమకుబేరాది అష్టదిక్పాలకులు వచ్చి యుధిష్టరుడి ముందు నిలబడ్డారు.

"ధర్మరాజా.." అన్నాడు ఇంద్రుడు.

"లేదు ప్రభూ నేను యుధిష్టరుడిగానే సంతుష్టుడిని. నా పరివారమంతా నరకంలోవుంటే నన్ను ధర్మరాజని పిలవడాం హాస్యాస్పదంగా వుంటుంది." అన్నాడు యుధిష్టరుడు చేతులు జోడించి.

"నీ పరివారమెవ్వరూ నరకంలో లేరు ధర్మనందనా.. అది కేవలం నీ భ్రమ మాత్రమే. రాజుగా పుట్టినవాడు నరకాన్ని చూసితీరాలని ప్రతీతి. అందునా ద్రోణుణ్ణి వధించడానికి నీవు మోసానికి పాల్పడ్డావు. మరణిచినా ఈర్షాద్వేషాలు నీలో చావలేదని దుర్యోధనుణ్ణి చూసి చెప్పకనే చెప్పావు. వీటన్నిటి పర్యవసానమే ఈ నరకలోక అనుభవం.." చెప్పాడు ఇంద్రుడు.

యమధర్మరాజు పుత్రవాత్సల్యంతో -"నాయనా.. నేను నీకు పెట్టిన మూడొవ పరిక్ష ఇది. పూర్వం ద్వైత వనంలో నీవు సమిధలకై వచ్చినప్పుడు ఒక తటాకం వద్ద నిన్ను ప్రశ్నించాను, మహాప్రస్థానంలో కుక్కగా నీ వెంట వచ్చి పరీక్షించాను, ఈ నరకానుభవం కూడా అలాంటిదే. అసూయ ద్వేషాన్ని విడనాడి నీ పరివారానికి తోడుగా నిలవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావో అప్పుడే నీ శిక్ష ముగిసింది. నరకము స్వర్గము అని రెండు వేరు వేరు ప్రదేశాలు లేవు. నీ మనసులో ఈర్ష వున్నప్పుడు ఇదే నరకం, సంతోషమున్నప్పుడు ఇదే స్వర్గం" అన్నాడు నవ్వుతూ.

"ధర్మరాజు" నమస్కరించాడు.


03.10.2008

3 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

"నరకము స్వర్గము అని రెండు వేరు వేరు ప్రదేశాలు లేవు. నీ మనసులో ఈర్ష వున్నప్పుడు ఇదే నరకం, సంతోషమున్నప్పుడు ఇదే స్వర్గం" - బాగుందండి. మీరు హాస్యం ఒక్కటే చక్కగా రాస్తారనుకున్నా, అన్ని రకాల కథలు చాలా బాగా రాస్తున్నారు. నెనర్లు

వెంకట్

Unknown చెప్పారు...

message is very gud

ఆ.సౌమ్య చెప్పారు...

ఆ నలుగురు సినిమా గుర్తొచ్చింది.
బావుంది కథ!