ఉదయ్‌పూర్ అందాలు




పరాక్రమానికి మారు పేరుగా చెప్పబడే రాజ్‌పుట్‌ల రాష్ట్రం రాజస్థాన్. అందులోనూ ఎవ్వరికీ తలవంచని శౌర్యవంతులుగా పేరుగాంచిన మేవార్ రాజుల రజధాని నగరం ఉదయ్‌పూర్.
మహారాణా ఉదయ్ సింగ్ ద్వారా ప్రారంభించబడిన ఈ నగరం అందమైన సరస్సులకి, అధ్బుతమైన కోటలకి, ఎన్నో వీరగాధలకి, శైవవైష్ణవ భక్తి కథలకి, శిల్ప చిత్రకళా విశేషాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏ కోటకి వెళ్ళినా, ఏ వీధిలో తిరిగినా మొగలుల సైన్యాన్ని ఎదిరించిన మహారాణా ప్రతాప్ గురించో, కృష్ణ భక్తిలో ధన్యమైన మీరాబాయి గురించో, రాజ సేవలో ప్రాణాలను పణంగా పెట్టిన సేవకుల గురించో, అభిమానవతులైన రాణుల గురించో కథలు కథలుగా చెప్తారు.
శత్రు సైన్యం తమ పతులను వోడిస్తోందని తెలిసిన రాణులు కోటలోనే "జోహర్" పేరుతో అగ్నికి ఆహుతయ్యేవారట..! హల్దీ ఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ మాన్ సింగ్ చేతిలో వోడిపోవటం చూడలేక అతని గుర్రం చేతక్ రక్తమోడుతున్నా నెరవక నది దాటించి, ప్రతాప్ సురక్షితుడయ్యాక చనిపోయిందట.
బన్‌బీర్ అనే రాజు చిత్తోఢ్ ను ఆక్రమించి యువరాజు ఉదయ్ సింగ్‌ను చంపడానికి వస్తే, దాసి పన్నా దాయి తన కొడుకును ఉదయ్ సింగ్ స్థానంలో వుంచి ఉదయ్‌ని తప్పించిందట. ఆమె కొడుకు బన్‌బీర్ కత్తికి బలైన కథ నిజంగా కంటతడి పెట్టిస్తుంది..!!
స్వతహాగా ఏక్‌లింగ్‌జీ (శైవ) భక్తులైన ఈ రాజులు మ్లేచుల దండయాత్రల నుంచి ద్వారకాదీష్, శ్రీనాధ్‌జీ లని తమ రాజ్యానికి తెప్పించి సురక్షితంగా కపు కాశారు. ఆ ద్వారకాదీష్ మందిర శోభ ఇదుగో -
పక్కరాజ్యమైన అమేర్ (ఇప్పుడు జైపూర్) రాజులు తమ ఆడపడుచులను (జోధా) మొగలులకు ఇచ్చి పెళ్ళిచేసి రాజకీయ మైత్రి కలుపుకుంటే ఇక్కడి యువరాణి కృష్ణ కుమారి అలాంటి రాజకీయ లబ్దికోసం తనని పెడ్లాడ వచ్చిన జైపూర్, జోధ్‌పూర్ యువరాజులను కాదని విషం తాగి ఆత్మాహుతి చేసుకుంది. ఆమె జ్ఞాపకార్థం నిర్మించిన కృష్ణమహల్ అందాలు చూడండి-
కాలంతో పాటు ఈ కోట మార్పులకు లోనౌతూ ఒక్కొక విభాగం అనేక దేశ విదేశ శైలులను కలుపుకుంటూ మరింత మనోహరంగా తయారయ్యింది. ఈ కోటలో కనిపించే రకరకాల చిత్రాలు, శిల్పాలు చూడండి -
అప్పటి రాణివాసంలో పరదా పద్ధతికోసం కిటికీలకు పెట్టించిన జాలీలు, అప్పటి రాణులు వాడిన వంట సామానులూ, వాహనాలు ఇవిగో -


(ఉదయ్‌పూర్ రాజా వారి పురాతన కార్ల గురించి తరువాతి టపా)

7 వ్యాఖ్య(లు):

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఉదయపూర్ అందాలను నయనానందకరంగా అందించారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

AMAZING!!!

రవి చెప్పారు...

వావ్. ఆద్భుతంగా ఉన్నాయి శిల్పాలు, చిత్రాలూ.

కామేశ్వరరావు చెప్పారు...

ఆద్భుతం!

జ్యోతి చెప్పారు...

అద్భుతం.. పంచుకున్నందుకు ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

Next time when you post such a place, please give details of how to reach such a place by plane, train or otherwise. That would help people to know better. Also if you mention any entry fee for palaces/museaums, food facilities around etc., that would be great. What do you think? BTW the pictures and story are excellent
U-NO-ME ;-)

Unknown చెప్పారు...

అభినందించిన అందరికి ధన్యవాదాలు.

అజ్ఞాత మిత్రమా, మీ సూచన చాలా బాగుంది.. ఇదుగో ఉదయ్‌పూర్ వివరాలు:

చేరటం ఎలా: విమానం లో ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, జైపుర్‌ల నుండి రావచ్చు. రైలులో ముంబై, జైపూర్, ఢిల్లీల నుంచి రావచ్చు. ప్రఖ్యాత "పేలెస్ ఆన్ వీల్స్" ఇక్కడ ఆగుతుంది. రోడ్డు ప్రయాణం కూడా సౌకర్యవంతమైనదే - రాజస్థాన్‌లోని ఏ ప్రముఖ పట్టణం నుంచైనా ఇక్కడికి బస్సులు వున్నాయి.

ఇక్కడ ఏం చూడాలి: సిటీ పేలెస్ (పైన వ్యాసం దీని గురించే), భారతీయ లోక్ కళా మండల్, సహేలియోన్ కి బరి, పిచోల సరస్సు, ప్రతాప్ మెమొరియల్, వింటేజ్ కార్ మ్యూజియం.

సూచన: ప్రతి చోటా ఆ స్థలం ప్రాముఖ్యతను బట్టి టికెట్టు వుంది. సిటీ పేలెస్‌లో ఆడియో టూర్ టికెట్ తీసుకుంటే (Rs 250)వాళ్ళు మనకి ఇచ్చే వాక్‌మెన్ లాంటి పరికరం సాయంతో సూచనలు అందుకుంటూ, వివరములు తెలుసుకుంటూ చూడవచ్చు. సిటీ ప్యాలెస్‌లో రాత్రి ఎనిమిది గంటలకు జరిగే సౌండ్ ఎండ్ లైట్ షో చూడదగ్గది (Rs 100).