గాంధీగిరి - గాంధీ సిద్ధాంతాలు

ఆఫీసులో నా క్యూబికల్ సాఫ్ట్‌బోర్డ్ పైన ధ్యాన ముద్రలో వున్న గాంధీ బొమ్మ ఒకటి వుంది.

నిన్న ఒక అమ్మాయి ఏదో పని గురించి నా దగ్గరకు వచ్చి ఆ బొమ్మ చూసి "మీకు గాంధి అంటే ఇష్టమా?" అని అడిగింది.

"గాంధీ మొత్తం కాదు.. గాంధీలో కొన్ని విషయాలు మాత్రమే ఇష్టం" అన్నాను.

ఆ అమ్మాయి చిత్రంగా చూసి "ఏమిటవి" అంది.

"చాలా వున్నాయి ముఖ్యంగా మొండితనం" అన్నాను. ఏమనుకుందో ఇంకా ఆ విషయం పై చర్చ కొనసాగించలేదు.

***

లగే రహో మున్నా భాయి (తెలుగులో శంకర్ దాదా జిందాబాద్) చూశారుగా. అందులో గాంధీగిరి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం ఎదుటివాడు ఒక చెంపమీద కొడితే మరొ చెంప చూపించాలి, ఎదుటివాడు ఉమ్మేస్తే అతని ఎదురుగానే అది తుడవాలి, లంచం కోసం వేధించే వుద్యోగి ముందు నిలబడి నిలువు దొపిడీ ఇవ్వాలి..!! ఇలాగే ఇంకా ఎన్నో. చిత్రం గమనించారో లేదో ఇక్కడ గాంధిగిరి పాటించేవాడు నిస్సహాయుడు. ఎదుటివాడి కన్నా మనం బలవంతులమైతే (లేదా బలవంతులం అని అనుకున్నా సరే) వెంటనే తిరగబడతాం. ఎదుటివాడు మనకన్నా బలవంతుడైతే మనం ఏం చెయ్యలేం. అప్పుడే గాంధీగిరి పనిచేస్తుంది.

సినిమాలో గుర్తుందా - కిళ్ళీ నములుతూ వుమ్మేసే అతను చాలా బలవంతుడుగా వుంటాడు.. ఆ కిళ్ళీ మరకలు తుడిచేవాడు సన్నగా బలహీనంగా వుంటాడు. అలా కాకుండా వుమ్మేసేవాడు సన్నగా వుండి ఆ ఇంటి ఓనరు కండలు తిరిగివుంటే..?? వెంటనే చొక్కా పట్టుకుంటాడు. కాబట్టి గాంధిగిరి అసహాయులకి, బలహీనులకి బాగా వుపయోగపడే ఆయుధం. బలహీనులు బలవంతులను ఎదిరించే ఆయుధం తయారు చెయ్యడం గొప్ప విషయం. ఇది ఒక కారణం గాంధి ఫోటో నా సాఫ్ట్ బోర్డ్ పైన పెట్టుకోడానికి.

***

ఏదో తప్పు చేశాడని తండ్రి కొడుకుని కొడతాడు. ఇక్కడ తండ్రి బలవంతుడు కొడుకు నిస్సహాయుడు. వెంటనే కొడుకు నేను అన్నం తినను ఫో అని అలిగి కూర్చుంటాడు. చాలా సహజమైన దైనందిన విషయం ఇది. ఇదే విషయం గాంధీ చేతిలో సత్యాగ్రహమైంది. "నేను చెప్పినది జరిగే దాకా నేను అన్నం తినను" అని మొండికెయ్యడమే కదా సత్యాగ్రహం.
అలాంటప్పుడు సామాన్యంగా ఏ తండ్రి అయినా మూడు రకాలుగా వ్యవహరిస్తాడు -

మొదటిది: "తినకు నాకేం నష్టం? ఎంతసేపు అలా వుంటావో నేనూ చూస్తాను." అనడం. ఇది ఎక్కువ సేపు నిలవదు. మిగిలిన రెండు మార్గాలలో ఎదో ఒకటి చెయ్యక తప్పదు.

రెండొవది: అన్నం పళ్ళెంలో పెట్టి వాడి ముందు పడేసి "తిను.. ఎందుకు తినవో నేనూ చూస్తా.. ఈ కర్ర ఇరిగిపోతుందివేళ.." అంటూ చావబాదటం. ఇలాంటి ప్రయత్నమే బ్రిటీషు చెయ్యబోయి (లాఠీలతో సత్యగ్రహులను కొట్టడం) అది పని చెయ్యదని నిరూపించారు.

ఇక మూడొవది: "మా నాయన కదూ.. మా తండ్రివి కదూ. పోనీ నువ్వడిగిన సైకిల్ కాదుగాని కొంచెం చిన్నది కొనిస్తాలే" అంటూ బేరానికి దిగడం. ఈ బేర సారాల్లో ఆ పిల్లాడు తనకు కావల్సినవి సాధించుకోవచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ సాధించుకోవచ్చు.. లేదా కావల్సినదానికన్నా తక్కువ సంపాదించుకోవచ్చు

(అసలిదంతా మానేసి "నువ్వు అన్నం తినే వరకు నేను తినను" అని రివర్స్ సత్యాగ్రహం చెయ్యడం ఇంకో పద్ధతి. అంటే - "నాయనా నీ సత్యాగ్రహం పైన నేను ప్రయోగించే సామ దాన భేద దండోపాయలు పని చెయ్యవు. కాబట్టి ఇప్పుడు నేను నిస్సహాయుణ్ణి. అందుకే సత్యాగ్రహం" అని అంగీకరించడమే)

మొత్తం మీద చెప్పేదేమిటంటే బలహీనుల మరో ఆయుధం సత్యాగ్రహం..!

***

ఇక మూడొవది - అహింస.

ఇందాక చెప్పినట్లు బలహినులకి, నిస్సహాయులకి బాగా పనికి వచ్చే సాధనం నిరసన, సత్యాగ్రహం, గాంధిగిరి..!! మరి ఈ బలముండటం, బలంలేకపోవటం అనేవి గిరిగీసినట్లుగా వుండవు. స్థాన, సమయాదుల బట్టి బలవంతులు బలహీనులు కావచ్చు, బలహీనులు బలవంతులు కావచ్చు. శంకర్‌దాదా సినిమాలో నిజానికి చిరంజీవి శత్రువు కన్నా బలవంతుడే కదా..!! అయినా ఒక సంధర్భంలో తను నిస్సహాయుడై గాంధీమార్గం పడతాడు..!! అలా గాంధీగిరిలో పడ్డా కథానాయుకుడికి (తన బలం గురించి తెలిసీ) శత్రువుని కొట్టకుండా వుండటం గొప్ప పరీక్ష. అందునా ఎదుటివాడు కొట్టినా మనం కొట్టకుండా వుండాలంటే అందుకు ఎంతో మనఃశక్తి కావాలి. ఎవరు కొట్టినా తిట్టినా నేను తిరగబడను అని అనుకోవడమే అహింస.

బలవంతుడైనా, బలహీనుడైనా ఇలా తిరగబడకుండా, శత్రువు పెట్టే కష్టాల్ని భరించి వుండాలంటే చాలా కష్టం. దానికి కావాల్సింది మనసిక బలం, స్థిత ప్రజ్ఞత లాంటివాటికన్నా ముఖ్యమైనది మొండితనం. అవును మొండితనం..!!

అ మొండితనమే శక్తినిస్తుంది. బలాన్నిస్తుంది. ఏమి జరిగినా నేను ఇలాగే వుంటాను అని చెప్పడం (చిరంజీవి చేతులుకట్టుకోని ప్రతినాయకుడి ఇంటి ముందు నిలబడటం) మొండితనం కాక ఇంకేమిటి..!!

మొండికెయ్యడం అనే విషయం ఒక సిద్ధాంతంగా మారటం ఆశ్చర్యమే కదా..!!

***

అయితే ఈ సిద్ధాంతాన్ని, ఈ ఆయుధాలని ఎప్పుడు వాడాలి అనేదానికి మార్గనిర్దేశ్యం చేసేది సత్యం. ఈ సత్యమే గాంధీ సిద్ధాంతాలకి ఆయువు పట్టు. ఇది లేకపోతే అన్యాయమైన కోరికలు తీర్చుకోడానికి ఈ ఆయుధాల వాడకం జరుగుతుంది. అలా జరకుండా ధర్మ మైన కోరికల కోసం వాడాలంటే అందులో సత్య వున్నది లేనిది బేరిజు వేసుకోవాలి. ఆ సత్యమే గాంధిగిరీ చెయ్యాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది.

***

ఆఖరుగా ఒక మాట - ఒకోసారి మనకి న్యాయమైనది, ధర్మమైనది మరొకరి న్యాయం కాకపోవచ్చు. కాబట్టి గాంధీ గాంధీగిరి ఆయుధాలు వాడిన సంధర్భాలన్నీ అందరికీ న్యాయమైనవి అనిపించక పోవచ్చు. గాడ్సేకి అనిపించలేదు. నాకు కూడా గాంధీ సత్యగ్రహం చేసిన కొన్ని సంధర్భాలు న్యాయమైనవి కావు అనిపించింది. అంతమాత్రాన ఆయన తయారు చేసిన సిద్ధాంతాల విలువ మాత్రం నా దృష్టిలో తగ్గలేదు.

అందుకే గాంధీ అంటే నాకు ఇష్టం అని చెప్పలేదు.. గాంధీలో కొన్ని విషయాలే ఇష్టం అని చెప్పాను. ఆ నచ్చిన విషయాలు నాకు గుర్తుచెయ్యడానికి ఆయన ఫొటో అక్కడ పెట్టాను.

***

ఇంత వివరంగా చెప్పాలి - నేను గాంధీ ఫొటో నా సాఫ్ట్ బోర్డ్ మీద ఎందుకు పెట్టుకున్నానో చెప్పాలంటే.. అంత తీరిక ఆ అమ్మాయికీ లేదు.. చెప్పే తిరిక నాకు లేకపోయింది. అందుకే ఇక్కడ రాసుకున్నాను

మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!

5 వ్యాఖ్య(లు):

Kathi Mahesh Kumar చెప్పారు...

బాగుంది. చాలా బాగుంది.

అజ్ఞాత చెప్పారు...

ఎవరు కాదన్నా మన జాతిపిత యుగపురుషుడే. సత్య శోధనలో ఆయన నూతన మార్గాన్ని నిర్వచించాడు. అయితే ఎంతయినా ఆయనా మనిషే కదా... అందుకనే కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టాయి. అంత మాత్రాన ఆయన్ని ద్వేషించటం తగదు. నావరకూ గాంధిలో అన్ని విషయాలూ నాకు ఇష్టమే.

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

మొండిగాంధీ అనుకోవచ్చా?

Unknown చెప్పారు...

మహేష్‌గారు,
నెనర్లు.

వికాసం గారు,
కరెక్ట్‌గా చెప్పారు. మనిషిని - అతని సిద్ధాంతాన్ని విడి విడిగ చూడలేకపోవటం వల్లే ఇలాంటి ఇబ్బందులు. నాకు తెలిసి గాంధియిజం ఒక సిద్ధాంతం, గాంధి ఆ సిధాంతాన్ని బహుశా మొదటగా వుపయోగించినవాడు అంతే-

చైతన్య,
నిశ్చయంగా గాంధీ మహా మొండివాడు..!! గాంధీ ఆటోబయోగ్రఫీ చదివినా, సినిమా చూసినా ఆ విషయం స్పష్టంగా అర్థమౌతుంది.

బ్లాగాగ్ని చెప్పారు...

Very good analysis.