చీకటి కోయిల (కథ)


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు బయల్దేరడానికి నాలుగైదు నిముషాల ముందు ఎక్కిందా అమ్మాయి. ఆమె చేతిలో ఒక పసివాడు, వెనుక నాలుగైదేళ్ళ పాప. వాళ్ళని దిగబెట్టడానికి వచ్చిన పెద్దమనిషి అన్ని జాగ్రత్తలు చెప్పాడు.
“పిల్లలతో వుంది కాస్త చూసుకోండమ్మా” అన్నాడు నా భార్య భారతితో. ఆమె మరేం ఫర్లేదన్నట్లు నవ్వుతూ తలాడించింది. దాదాపు ఆయన వయసు వాళ్ళం మేము ఇద్దరం అదే కూపేలో కనపడేసరికి ఆయనకి ధైర్యం కలిగినట్లుంది.
“నేనింక దిగుతానమ్మా” అన్నాడాయన లేస్తూ.
“సరే నాన్నా.. దిగగానే ఫోన్ చేస్తాలే” అంది ఆ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణే కాకుండా మౌన విషాదమేదో సాగినట్లు నాకనిపించింది.
“బాయ్.. తాతయ్యా.” చిన్నపిల్ల చెప్పింది. ఆయన వెళ్ళబోతున్నవాడల్లా ఆగి వెనక్కి వచ్చి పిల్లని ముద్దుపెట్టుకోని “బాయ్ బంగారం” అన్నాడు. ఆ వెంటనే వడివడిగా కంపార్ట్మెంట్ దిగి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆయన వైపు కూడా చూడకుండా తల దించుకోని వుంది. అర్థంకానిదేదో మిగిలిపోయినట్లు అనిపించింది నాకు.
మరో ఐదు నిమిషాలలో ఆడవాళ్ళు ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. మా ఆవిడ సేకరించిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి పేరు నిత్య. తల్లిదండ్రులు, అన్నయ్య హైదరాబాద్ లో వుంటున్నారు. పిల్లాడికి ఐదో నెల వచ్చిన తరువాత పురిటి మంచం ఒకసారి చూడాలని వచ్చి ఓ రెండు రోజులు వుండి వెళుతోంది. ఇవన్నీ మా ఆవిడ అడిగిన ప్రశ్నలకి జవాబులుగా వచ్చినవే తప్ప, ఆ పిల్ల తనంత తానుగా ఏ విషయమూ చెప్పలేదు.
“మరి నిన్ను అత్తగారింటిలో దిగబెట్టడానికి మీ వాళ్ళు ఎవరూ రావటం లేదా?” అనే ప్రశ్నకు మాతం ఏ జవాబూ రాలేదు.
“నీకెందుకే అనవసరపు విషయాలు?” అన్నాను నేను ఆమెకు మాత్రమే వినపడేలా. దాంతో మా ఆవిడ అప్పటిదాకా నిర్వహించిన పరిచయ కార్యక్రమం తాత్కాలికంగా ముగిసింది.
సాయంత్రం ఏడు దాటుతుండగా అనుకుంటాను ఆ పసిపిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా ఆపలేదు. పాలు ఇచ్చింది, ఆడించింది.. అయినా ఫలితం లేకపోయింది. ఆమె కూతురు మాత్రం ఏమీ ఎరగనట్లు మా పక్కనే వున్న కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది.
“ఏమిటమ్మా అలా ఏడుస్తున్నాడు?” అంది నా భార్య భారతి సాయం చేసే వుద్దేశ్యంతో.
“నిద్ర వచ్చినట్లుంది ఆంటీ” చెప్పిందామె.
“కాస్త కాళ్ళ మీదేసుకోని ఊపమ్మా..” మరో సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి అలాగేనంటూ కాళ్ళు చాపుకోని పిల్లాణ్ణి కాళ్ళమీద వేసుకోని ఊపింది. కానీ అదీ ఫలింఛలేదు. పిల్లాడి నస ఇంకా తగ్గలేదు.
“ఊరికే ఊపితే ఎట్లా? చక్కగా ఓ లాలి పాట పాడు..” మళ్ళీ మా ఆవిడ. “అసలు నీకెందుకే” అన్నాను నేను మళ్ళీ.
ఆ అమ్మాయి తటపటాయించింది.
“ఏమిటి? రైల్లో జనం ఉన్నారనా? మరేం ఫర్లేదు.. పిల్లవాడికి పాడితే ఎవ్వరూ ఏమీ అనుకోరు.. పైగా పాటలు పాడి పిల్లల్ని నిద్రపుచ్చడం అలవాటు చేస్తే వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తారు.. ఈ మధ్య టీవీలో కూడా చెప్పారు..”
“ఊరుకోవే.. పాపం ఆ పిల్లకి పాటలు వచ్చో రావో..” అన్నాను ఈ సారి గట్టిగానే. ఆ పిల్ల చప్పున తలెత్తి నా వైపు చూసింది. ఆ కళ్ళలో మళ్ళీ ఏదో కథ కనపడింది కానీ అది తెలిసే లోపే తలదించుకుంది.
“ఆ?? మీరు మరీనూ.. మాకంతా వచ్చి పాడామా? పాట ఎట్లా వున్న తల్లిపాటే జోలపాట పిల్లాడికి.. దానివల్ల వాళ్ళకి సంగీతం సాహిత్యం లాంటి అభిరుచులు వస్తాయి. మా అమ్మ చెప్పేది” అంటూ మళ్ళీ ఆ అమ్మాయి వైపు చూసింది. ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. పిల్లాడు ఇంకా అలాగే ఏడుస్తున్నాడు.
“ఏమిటోనమ్మా మీ జనరేషనే అంత.!! ఒక లాలిపాట రాదు, ఓ ముగ్గెయ్యడం రాదు, ఉగ్గు అంటే ఏంటో తెలియదు..” ఎదురుగా వున్న పిల్ల నొచ్చుకుంటుందేమో అన్న ధ్యాస కూడా లేకుండా అంటోంది నా శ్రీమతి.
అటు వైపునుంచి విశాలమైన చిరునవ్వుతో మాత్రమే సమాధానం వస్తోంది. చాలా చిత్రంగా వుందా నవ్వు. అంతకు ముందు వాళ్ళ నాన్న కూడా అంతే. చూస్తుంటే ఈ కుంటుంబంలో అందరూ ఏదో తెలుసుకోవలసిన ప్రత్యేకమైన వ్యక్తుల్లా పరిచయం అవుతున్నారు. ఆఖరుకు మా పక్కన కూర్చోని వున్న ఆ అమ్మాయి కూతురు కూడా అంతే. చడీ చప్పుడు లేకుండా కిటికీలోంచి చూస్తూనే వుంది తప్ప మాతో ఎవ్వరితో మాట్లాడలేదు. ఆ వయసు పిల్లల్లా ఒకటి కావాలని కానీ వద్దనికానీ పేచీలేదు. వీళ్ళంతా గుండె నిండా ఏదో బరువు మోస్తున్నారని నాకనిపించసాగింది.
“అమ్మాయి... నాకు మీ అమ్మ వయసుంటుంది.. చాదస్తం అనుకోకుండా నా మాట విను.. మీ అమ్మని అడిగి రెండు లాలిపాటలు, ఓ రెండు మంగళహారతి పాటలు నేర్చుకో... అంతమాత్రం కూడా రావంటే నిన్ను కాదు... అందరూ మీ అమ్మనాన్న గురించి అనుకుంటారు” కాస్త ఘాటుగానైనా మరో సలహా వదిలింది ఈవిడ.
“నాకు పాటలు నేర్పించారండీ మా వాళ్ళు” ఆ పిల్ల అంది.
“మరింకేం! పాడటానికి సిగ్గా? పాడటానికీ, పాలివ్వడానికీ సిగ్గుపడితే ఎట్లా? ఎవరున్నారు? ఇక్కడ మేమిద్దరం, అదిగో ఆ అబ్బాయి అంతేగా... ఫర్వాలేదులే పాడు..” హుకుం జారీ చేసింది.
ఇక తప్పదని అర్థమయ్యి ఆ అమ్మాయి పాడటానికి సిద్ధం అయ్యింది. రెండుకాళ్ళు పద్మాసనంలా వేసుకోని, పిల్లాణ్ణి ఒడిలో పెట్టుకోని, గొంతు సవరించుకుంది. పెదాలను తడుపుకోని, ఒకసారి మా వైపు చూసి కళ్ళు మూసుకుంది.
“డోలాయాంచల డోలాయాం హరే డోలాయాం.. హరే డోలాయాం..”
మేమిద్దరం ముఖముఖాలు చూసుకున్నాం. లాలిపాట అంటే ఎవరినా “జో అచ్యుతానంద” పాడుతారు. లేకపోతే “రామాలాలీ” అని పాడుతారు. ఈ అమ్మాయేంటి ఈ పాట పాడుతోంది అన్న ఆశ్చర్యం స్పష్టంగా మా అవిడ కళ్ళలో కనపడుతోంది.
“మీన కూర్మ వరాహా... మృగపతి అవతారా..”
పాట మత్తుగా సాగుతోంది. పిల్లాడు క్షణాల్లో కిక్కురుమనడం ఆపేశాడు. మా పక్కన కూర్చున్న పాప దిగి వెళ్ళి తల్లి పక్కన కూర్చోని ఆమెనే చూస్తూ వుండిపోయింది.
“దానవారే.. గుణశౌరే.. ధరణీధర మరుజనక”
అప్పటిదాకా ఐ-ఫోన్ లో పాటలు వింటున్న సైడు బెర్త్ కుర్రాడు ఇయర్ ఫోన్స్ తీసేసి పాట విన్నాడు. ఆ అమ్మాయి గొంతు బాగున్న విషయం ఇంతకు ముందు మాట్లాడినప్పుడే అర్థం అయ్యింది. కానీ ఇంత శాస్త్రీయంగా పాడుతుందని నేను ఊహించలేదు. వరాళి రాగం రైలు శబ్దాల మధ్యలో నుంచి మత్తు మందులా పరుచుకుంది. ఆ మత్తులో అందరం జోగుతుండగానే పాట అయిపోయింది. సైడు బర్త్ అబ్బాయి చప్పట్లు కొట్టాడు.
“చక్కగా పాడావ్ అమ్మాయి.. ఇంత బాగా పాడగలిగినదానివి ఇందాక నేను పాడమంటే బెట్టు చేశావే? సర్లే.. ఇంకోక పాట పాడరాదు.. నాకోసం..” అడిగింది నా భార్య. ఆ పిల్ల తలూపి మొదలుపెట్టింది.
“లాలనుచు నూచేరు లలన లిరుగడలా.. బాలగండవీర బాలగోపాల”
ఆ పాట పాడే విధానం చూస్తే ఆ అమ్మాయికి ఖచ్చితంగా సంగీత జ్ఞానం వుందని అర్థమౌతోంది. లాలి పాడుతూ పిల్లాణ్ణి జోకొడుతోంది అనుకున్నాను కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ అమ్మాయి చెయ్యి పిల్లాణ్ణి తడుతున్నా నిజానికి తాళం వేసుకుంటోందని అర్థం అయ్యింది. ఈసారి పాటలో సంగతులు కూడా ఎక్కువయ్యాయి.
“లాలీ... లాలి.. లాలీ... లాలి..” అంటూ ఆ పాట కూడ ముగిసింది.  ఈ రెండో పాట సగానికి వచ్చేసరికే పసిపిల్లాడు గాఢంగా నిద్రపోయాడు. పక్క కూపేలో వున్న మరో ఇద్దరు కూడా వచ్చి కూర్చున్నారు. కంపార్ట్మెంట్ లో చిన్న కచేరియే జరిగింది. ఈసారి ఇంకో పాట పాడమని ఎవరూ అడగలేదు. ఆ అమ్మాయి తనంతటా తానే మొదలుపెట్టింది.
ఈ సారి తిల్లాన..!!
“నాదిర్దిత్తోం.. నాదిర్దిత్తోం...” ఒక ప్రవాహం లాగ దూకుతూ, ఉరుకుతూ. ఆ అమ్మాయి కళ్ళు మూసుకోని ఏదో అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ పాడింది. మా శ్రీమతి చాలా ఇబ్బంది పడిపోయింది. సాక్షాత్తు మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ముందు నిలబడితే, మంగళహారతి పాడమని పాపం చేసినంత బాధపడిపోయింది. సంగీతంలో తెలియని లోతులేవో స్పృశించినంత ఆనందంగా ఆ అమ్మాయి కన్నీళ్ళు కార్చేసి పాట పూర్తి చేసింది. అక్కడే నిలబడిపోయిన టీసీ, హాకర్స్ తో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి కూతురైతే మా అందరి చప్పట్లు చూసి ఇంక ఆనందంగా కేరింతలు కొట్టింది.
ఆ అమ్మాయి ఏదో ట్రాన్స్ నుండి మేలుకున్నట్లు కళ్ళు తెరిచి, తడబడి – “బాబు నిద్రపోయాడు.. ఇంక నేను కూడా పడుకుంటానండీ..” అంది. మా సమాధానం వినకుండా చకచక లేచి బెర్తు మీద గుడ్డ పరిచి సర్దటం మొదలుపెట్టింది.
ఆ అమ్మాయి పాటలు ఇంకా వినాలని వున్నా నేను అడగలేదు. ఆ అమ్మాయి పిల్లలిద్దర్నీ బెర్త్ మీద పడుకోబెట్టి తాను మాత్రం కిటికీకి ఆనుకోని కళ్ళు మూసుకుంది. మాతో తెచ్చుకున్నవి తిని మేము కూడా నిద్రకి ఉపక్రమించాం. లైట్లు ఆర్పేశాం.
ఎప్పుడో ఒక రాత్రిపూట ఆ అమ్మాయి, కూతురు మాట్లాడుకుంటుంటే వినపడి మెలకువ వచ్చింది.
“నువ్వు బాగా పాడావు మమ్మీ..”
“ఊ”
“మరి నువ్వు ఎప్పుడూ పాడవెందుకు?”
“ఎందుకంటే నేను ఇలా ఎవరి ముందూ పాడనని డాడీకి ప్రామిస్ చేశాను కాబట్టి”
“ఎందుకు?”
“డాడీకి పాటలంటే ఇష్టంలేదు..”
“ఎందుకు ఇష్టం లేదు?”
“ఎందుకంటే... లేదు అంతే.. నీకు వంకాయ కూర ఇష్టం లేదంటావు కదా.. అలాగే డాడీకి పాటలంటే ఇష్టం లేదు.. నేను ఈ రోజు పాటలు పాడానని డాడీకి చెప్పకూడదు. సరేనా?”
“ఎందుకు చెప్పకూడదూ?”
చెప్తే ప్రామిస్ బ్రేక్ చేశానని డాడీకి కోపం వస్తుంది. కోపం వస్తే డాడీ ఏం చేస్తాడో తెలుసు కదా?”
“ఊ”
“అందుకని చెప్పకూడదు.. సరేనా?”
“సరే మమ్మీ”
“ప్రామిస్?”
“ప్రామిస్”
అంతే. ఆ తరువాత ఆ అమ్మాయి ఎప్పుడు దిగిపోయిందో, ఏ స్టేషన్ లో దిగిపోయిందో నేను చూడలేదు.

***
(సాక్షి ఫన్ డే 8 సెప్టెంబర్ , 2013)
బొమ్మ శ్రీవాసుగారు

మొపాస కథలు: ఆమె చెప్పని రహస్యం

బాధా లేకుండా చనిపోయిందామె. మచ్చ లేని జీవితం గడిపిని స్త్రీగా లోకాన్ని విడిచిపెట్టింది. పరుపు మీద భావం లేని ముఖంతో, మూత బడ్డ కళ్ళతో స్థిరంగా పడుకోని వుందామే. ఆమె జుట్టు చనిపోయే ముందే దువ్వి అలంకరించినంతగా కుదురుగా వుంది. ఆమె ప్రశాంతమైన ముఖాన్ని చూసిన ఎవరికైనా ఒక గొప్ప జీవి శరీరంలో వుందన్న భావన రాక మానదు. తల్లి ఏంతో స్వచ్చమైన మరణాన్ని పొందిందని అర్థం అవుతోంది.

ఆమె శవం పక్కనే ఆమె పెద్ద కొడుకు మోకరించి కూర్చున్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న మెజిస్ట్రేట్గా అతను అండరికీ తెలుసు. మరో పక్క దేవుడి సేవకి అంకితమై నన్ జీవితాన్ని గడుపుతున్న కూతురు గుండెలు పగిలేలా రోదిస్తోంది. చిన్నప్పటి ఇద్దరిలో దైవభక్తి పెంపొందేలా పెంచిందా ఇల్లాలు. మతం గురించి నేర్పింది కానీ మూఢత్వాన్ని నేర్పలేదు. బాధ్యతలు నేర్పింది కానీ బాఢ్యతా రాహిత్యాన్ని నేర్పలేదు. కొడుకు లా చదివి న్యాయాన్ని ఆయిధంగా చేఉసుకోని ఎందరో నేరస్థులకు సిక్ష విధించే జడ్జిగా ఎదిగాడు. కూతురు శోత్రీయమైన పెంపకంలో పెరిగి భగవంటుడికి చేరువవ్వాలని, వివాహాన్ని కాదని సేవకే జీవితాన్ని అంకితం చేసింది.

ఇద్దరికీ తండ్రి ఎవరో తెలియదు. తల్లి దుఖానికి కారణం తండ్రే అని మాత్రం తెలుసు. అంతకన్నా వివరాలు వాళ్ళు తెలుసుకోలేదు. వారికి తల్లి చెప్పలేదు.

నన్ దుస్తుల్లో వున్న కూతురు ఆమె తెల్లటి చేతిని పదే పదే ముద్దులు పెడుతోంది. పక్కనే వున్న ఏనుగు దంతంతో చేఇసిన శిలువ గుర్తు అంట తెల్లగా వున్నదా చెయ్యి. మరో పక్క వున్న రెండో చేయి మంచం మీద పరిచివున్న గుడ్డని గట్టిగా పిడికిట్లొ బంఢించి వుంది. ఆమే దైవలోకానికి చేయబోతున్న యాత్రకి ఆఖరి గుర్తులా గుడ్డ ఇంకా నలిగే వుంది.

ఎవరో గది తలుపులను రెండు సార్లు కొట్టి లోపలికి ప్రవేసించారు. వాళ్ళిద్దరూ తలెత్తి చూస్తే చర్చి నుంచి వచ్చిన ప్రీస్ట్ కనిపింఛాడు. చూడాబోతే ఆయన రాత్రి భోజనం కానిచ్చుకోని వచ్చినట్లున్నాడు. తిన్నది అరగక ఆయాసపడుతుండాటం వల్లేమో ముఖం ఎర్రగా వుంది. గత రెండు రాత్రులుగా ఇలాంటి కార్యక్రమాలే నిర్వహించి అతనికి నిద్ర లేక అలిసిపోయి వున్నాడు. మళ్ళీ శావజాగారం తప్పదని మంఛి స్ట్రాంగ్ కాఫీ తాగి మరీ వచ్చినట్లున్నాడు.

అతని ముఖంలో కూడా విషదం వుండి. అయితే అతని వృత్తి పరంగా అలవాటైన ముఖాన్నే పెట్టాడు. చావు బాధకరమైతే కావచ్చు కానీ అతనికి అదే జీవినాధారం కదా. చేతిని గుడె మీద శిలువ గుర్తులో తిప్పుతూ, నెమ్మదిగా ముందుకు నడిచాడు.
"
బిడ్డలారా... ఆమె ఆఖరి యాత్రకి సంబంధించిన విషాదంలో మీతోపాటు పాలుపంచుకోడానికే వచ్చాను.." అన్నాడు. సిస్టర్గా వున్న కూతురు వెంటానే సమాధానం చెప్పింది.

"
మీకు ధన్యవాదాలు ఫాదర్... కానీ మేము ఆమెతో ఒంటరిగా గడపాలని అనుకుంటున్నాము. ఆమెను చూసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం కదా.. మేము కలిసి వుండేందుకూ కూడా ఇదే ఆఖరిసారి కదా... మేము ముగ్గురం మళ్ళీ మా చిన్నతనంలోలా, పేదవాళ్ళగా వున్నప్ప్టిలా మళ్ళీ అమ్మతో కలిసి... వుండాలనుకుంటున్నాము. అమ్మతో... మా అమ్మతో..." బాధ కన్నీళ్ళు ఆమె మాటలకు అడ్డుకట్టా వేశాయి. పైన మాట్లడాలేకపోయింది.

ఫాదర్ తలాడించి ముందుకు వంగి అభివాదం చేశాడు. "మీరు ఎలా చెప్తే అలాగే నాయనా.." అన్నాడు. తరువాత మోకరిల్లి, శిలువ గుర్తును సూచిస్తూ భుజాలను తాకి, ప్రార్థించి బయటికి కదిలాడు. "దేవతలాంటి తల్లి వెళ్ళిపోయింది" అనుకున్నాడు తనలో తానే బాఢగా. గదిలో వాళ్ళు ముగ్గురే మిగిలారు. చనిపోయిన తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు. ఎక్కడో చీకట్లో వున్న గోడాగడియారం చప్పుడు మాత్రమే స్పష్టంగా వునపడుతూ వుండి. గాలికి తెరుచుకున్న కిటికోలోనుంచి మెత్తటి వెన్నల, దానితో పాటే పచ్చి చెట్ల పరిమళం గదిలోకి ప్రవేసించింది. అడపదడపా ఎక్కడో కప్పలు చేస్తున్న చప్పుడు, కీచురాళ్ళు ఉండుంది అరుస్తున్న శాబ్దము తప్ప ఇంకేమీ వినపడటం లేదు. నిశబ్దంలోనే అంతులేని శాంతి, అనిర్వచనీయమైన విషాదం, ప్రశాంటమైన వాతావరణం ఆమె చుట్టూ పరుచుకున్నాయి. ఆమె తుదు శ్వాసని కలుపుకున్న ప్రకౄతిలోకే కలిసిపోయినట్లుగా వుందామె.

జడ్జిగారైన కొడుకు ఇంకా మోకాళ్ళామీదే వున్నాడు. అతని తలని తల్లి పడుకోని వున్న పరుపులోకి ముఖం పెట్టి, బాధతో అలసటతో బొంగురుపోయిన గొంతుతో "అమ్మా అమ్మా" అంటూ ఏడుస్తున్నాదు. ఆమె కూతురు అంతులేని విషాదం ముప్పిరిగొనగా ఏం చేస్తోందో తెలియని ఆవేశంతో తలని మంచం పట్టీకి కొట్టుకుంటూ, అరుస్తూ "ప్రభువా... అమ్మని తీసుకెళ్ళిపోయావా? ఇప్పుడేం చేసిది భగవంతుడా..." అంటూ ఏడుస్టోంది. విషాదానికి ఇద్దరూ కదిలిపోయి, కరిగిపోయి ఏడ్చి ఏడ్చి పెద్ద పెద్దగా శ్వాస తీసుకుంటూ, ఇక ఏడవలేక గొంతుకు ఏదో అడ్డాం పడినట్లు ఆగిపోయారు.

కొంట సేపటికి సేదతీరారు. బాధ మత్రం తగ్గలేదు. నిశబ్దంగానే విలపిస్తూ, తుఫాను తరువట సముద్రంలా వుండిపొయారు. మరికొంట సమయం గడిచిన తరువాత ఇద్దరూ లేచి తల్లి శవం వైపు చూశారు. ఒక్కసారిగా ఆమె జ్ఞాపకాలు ఇద్దరినీ వుట్టుముట్టాయి. నిన్నటిదాకా ఎంతో ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు ఇప్పుడు విషాదాలుగా పరిణమించాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా కళ్ళాముందు జరిగుతున్నంత స్పష్టంగా జ్ఞప్తికి వచ్చాయి. విధంగా చనిపోయిన తల్లి వాళ్ళాకి ఊహల్లో సజీవంగా కంపించింది. ఆమె సంతోషంగా ఉల్లాసంగా కనిపించింది. ఆమె చిన్న చిన్న కదలికలు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఏదైనా గట్టిగా చెప్పాల్సి వస్తే ఆమె బల్ల గుద్ది మరీ చెప్పడం కళ్ళ ముందు జరిగినట్లే కనపడింది.

అంటవరకూ తల్లి మీద వున్న మమకారం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. వారి విషాదాన్ని వారే కొలుచుకోవటంతో, ఆమె లొటు వాళ్ళని ఎంత ఒంటరివాళ్ళాను చేశ్తుందో అర్థం అయ్యి కుమిలిపోయారు. వాళ్ళా ఆట బొమ్మ, వాళ్ళ గురువు, వాళ్ళ మార్గదర్శి అన్నీ ఒక్కసారిగా మాయమైపోయిన సంగతి అర్థం అయిపోయింది. వాళ్ళ బాల్య కౌమారాల జ్ఞాపకాలలో ఆనందం ఇగిరిపోయినట్లు అనిపించింది.
వాళ్ళా తల్లి... వాళ్ళా అమ్మ... వాళ్ళాకి వాళ్ళ జీవితానికి అనుబంధాల వారధి. వారథి ఇప్పుడు కూలిపోయింది. తమ తండ్రితోటి, తాత ముత్తాతలతోటీ, తమ వంశానికి సంబధం కలిపే గొలుసులో లంకె తెగిపోయింది. తండ్రి ఎవరో చెప్పకుండానే తల్లి వెళ్ళిపోయింది కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అనాథలైపోయారు.

ఇద్దరిలో ఆడపిల్లకి ఏదో స్ఫురించింది.-

"అన్నయ్యా నీకు గుర్తుందా? అమ్మ ఎప్పుడూ ఏవో పాత ఉత్తరాలు చదువుతూ ఉండేది. బల్ల సొరుగులో వున్నాయవి. మనం అవి తీశి చదువుదామా? ఆమె కోసం చదువుదాం. ఆమె జీవితాన్ని మన మాటలద్వారా మళ్ళీ జీవించే అవకాశం ఆఖరుసారిగా అమ్మకి ఇద్దాం. ప్రభువుని కలిసే దారిలో వున్న అమ్మకి ఆమె నడిచి వచ్చిన దారిని మళ్ళీ గుర్తు చేద్దాం. మనకి కూడా ఆమెను గురించి, మన తాతలు తండ్రుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. అమ్మ చెప్పేది కదా వాళ్ళా ఉత్తరాలు ఆమె దగ్గర వున్నాయని.." అంది ఆమె.

బల్ల సొరుగులో నుంచి పసుపు పచ్చని రంగులో వున్న పది కాగితాల కట్టలను బయటికి తీశారు ఇద్దరూ. ఎంతో అందంగా పేర్చి, దారంతో కట్టి వున్నాయవి. వాటన్నింటినీ తెచ్చి తల్లి పడుకోని వున్న మంచం మీదే వేశి - "మీ నాన్న" అని వ్రాసి వున్న కట్టను తెరిచి ఒక్కొక్క వుత్తరం చదవటం ప్రారంభించారు.

పాతకాలం నాతి ఉత్తరాలు ఎలా వుంటాయో అలాగే వుందది. వేరే శతాబ్దం తాలూకు సువాసనలేవో కాగితం నుంచీ వస్తున్నాయి. మొదటి ఉత్తరం తెరిచింది.
"ప్రియా" అంటూ మొదలైందది. మరో దాంట్లొ "నా అందమైన పిల్లకి" అని వుంది. "నా ముద్దుల అమ్మాయికి" అని మరోదాంట్లో, ఇంకో దాంట్లో "నా చిరునవ్వుల దేవికి" అనీ వుంది. అవన్నీ చూసిన కూతురు బిగ్గరగా చదవటం మొదలుపెట్టింది. పువ్వుల్లాంటి జ్ఞాపకాల్ని చనిపోయిన తల్లిపై కురిపించాలని అమ్మాయి ఆశ.

కొడుకు మాత్రం మోచేతిని మంచం మీదే వుంచి, తల్లినే స్థిరంగా చూస్తూ వింటున్నాడు. కదలకుండా వున్న తల్లి శరీరంలో సంతోషం కనపడుతోంది.

చదువుతున్న అమ్మాయి మధ్యలో ఆపి అన్నది - "ఇవన్నీ అమ్మతో పాటే సమాధి చేద్దాం అన్నయ్యా... ఆమె కి ఇష్టమైనవి ఆమెతోనే వుండనిద్దాం." అంటూ మరో ఉత్తరాల కట్టా అండుకుంది. దాని మీద ఎవరిపేరు రాసిలేదు. ఒక్కొక్కటే తెరిచి చదవటం మొదలుపెట్టింది.

"
నా ప్రియతమా. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నిన్నటి నుంచి నీ జ్ఞాపకాలు బాణాల్లా గుచ్చి బాధపెడుతున్నాయి. నన్ను వెంటాడుతున్నాయి. నా పెదవులపైన నీ పెదవుల స్పర్శ, నా కళ్ళను తాకిన నీ చూపు స్పర్శ, నా గుండెలపైన వాలిన నీ మేని స్పర్శ ఇంకా అనుభవిస్తునట్లే వుంది. నేను ప్రేమలో మునిగిపోయాను. నీ ప్రేమలో మునిగిపోయాను. పిచ్చివాణ్ణి చేశేశావు నువ్వు. నిన్ను మళ్ళీ నా గుండెలకి హత్తుకోవాలన్ని కాక్షతో చేతులు చాచి నిలబడి వున్నాను. నా మనసు, శరీరం అన్నీ నువ్వు కావాలని కోరుకుంటున్నాయి. నువ్వు పెట్టిన ముద్దుల రుచి నా పెదవులపైన శాశ్వతంగా నిలుపుకోమని వేడుకుంటున్నాయి..."

జడ్జి కొడుకు లేచి నిలబడ్డాడు. నన్ కూతురు చదవటం ఆపేసింది. వుత్తరాన్ని కొడుకు లాక్కొని కింద సంతకం కోసం చూశాడు. సంతకం లేదు. "నీ ప్రేమలో పరితపించే" అని రాసుంది. కింద పేరు - "హెన్రీ" అని. వాళ్ళా తండ్రిపేరు అది కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళ తండ్రి పేరు "రేనే". అంటే ఉత్తరం..??

కొడుకు ముందుకు వంగి అక్కడ వున్న ఉత్తరాలలో నుంచి మరొకటి తీసి చూశాడు. "నీ అనురాగాం లేని జీవితం నాకు వద్దు". స్థిరంగా గడకర్రలా నిలబడ్డాడు కొడుకు. చనిపోయిన తల్లి వైపు చూశాడు. కూతురు కూడా శిలాప్రతిమా నిలబడ్డది. అన్నయ్యను తల్లినీ మార్చి మార్చి చూశ్తుంటే ఆమె కళ్ళాలో నుంచి కన్నీళ్ళు ఉబికి వస్తున్నాయి. ఆయినా సంభాళించుకుంది. అతను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి తెరిచి వున్న కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూశాడు.

చాలాసేపటి తరువాత వెనక్కి తిరిగి చూశాడతను. చెల్లెలి కళ్ళలో తడిలేదు. తల్లి శవం దగ్గరే నిలబడి తల దించుకోని నేల వైపు చూస్తూ వుంది. అతను ముందుకు నడిచి త్వరత్వరగా మంచం మీద వున్న కాగితాలన్నీ ఏరాడు. వాటిననంటిని బల్ల సొరుగులోకి కుక్కి మూశేశాడు. తరువాత వచ్చి మంచం చుట్టూ వున్న దోమతెరని దించేశాడు.

అప్పుడే తెలవారుతూ ఇంట్లోకి ప్రవేశించిన వెలుగు, వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగును వెక్కిరించింది. కొడుకు లేచి బయటికి అడుగులేశాడు. "ఇక వెళ్దామా చెల్లెమ్మా" అన్నాడు.

జడ్జిగారైన ఆ కొడుకు, తల్లి పిల్లల సంబంధానికి మరణశిక్ష వేసినట్లుగా వుందా మాట.

ఫ్రెంచ్ మూలం: గి ద మొపాస
మూల కథ: డెడ్ వుమెన్స్ సీక్రెట్ (Dead woman’s secret)