భలే మంచి చౌక బేరము..!!


మొన్నా మధ్య బిగ్ బజార్ కి వెళ్ళాను. ఎండాకాలం సందర్భంగా గొప్ప "కార్నివాల్" జరుగుతోందట. ఎటు చూసినా డిస్కౌంట్లే డిస్కౌంట్లు. ఆ డిస్కౌంట్లు కోసం ఎగబడుతున్న జనం. ఏమిటీ విధి లీలావిలాసం. ఈ బిగ్ బజార్ అనే సంస్థ గోప్ఫ ధార్మిక సంస్థ కాదే.. ప్రజలకు చౌక ధరకే సరుకులు అందుబాటులోకి తెచ్చే ప్రభుత్వ సంస్థ కాదే - ఇది లాభాలనే మూల మంత్రాధారమైన పెట్టుబడిదారీ సంస్థ కదా? మరి అట్లాంటి సంస్థలో లాభాలు మర్చిపోయి "మన" కోసం అత్యంత తక్కువ ధరకే అన్ని సరుకులు ఇస్తున్నారంటే ఎలా నమ్మేది? మరి వచ్చిన జనమంతా ఎందుకు నమ్మినట్లు?

ఒక్క  బిగ్ బజార్ అనే కాదు, ఏ చందనా, బొమ్మనా, అమ్మనా బ్రదర్స్ ముందు నిలబడినా ఇలాంటి డిస్కౌంట్లు కనిపిస్తూనే వుంటాయి. "ఇంత వరకూ కనీ వినీ ఎరుగని డిస్కౌంట్లు. నేడే ఆఖరు" అన్న పర్మెనెంట్ బోర్డు రోజు కనిపిస్తూనే వుంటుంది. అంతెందుకు చిన్నా చితకా బట్టల షాపు ముందు నిలబడినా అక్కడ అమ్మే నైటీలు, పైజామాల పైన ఒక చిన్న బోర్డు వుంటుంది. దానిమీద "Rs 150" అని వ్రాసి కొట్టేసి "Rs 100 ఓన్లీ" అని వ్రాసి వుంటుంది. అదేదో సినిమా టైటిల్లో సెన్సారు వారు వద్దన్న పదాలు కొట్టేసి పోస్టర్లో వేసినట్లు వుంటుంది.

డిస్కౌంట్లలో మరో పోకడ 50% + 50% డిస్కౌంట్ అని పెట్టడం. ఏభై ఏభై కలిపితే 100% డిస్కౌంట్ ఇస్తాడా అని లెక్కలు రాని ఓ రావుగారు సందేహించారు. నిజానికి వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ ఎంతో లెక్కగట్టమని పిల్లలకి లెక్కలు నేర్పుస్తున్నాడొక సంసారి. మరో చోట ఇలాంటి లెక్కల తికమకతో మరో డిస్కౌంట్ స్కీం- ఒకటి కొనండి పన్నెండు వుచితంగా పొందండి అంటూ. అంటే ఎంత శాతం తగ్గింపు ఇచ్చాడో అని లెక్కల పేపర్లో ఒక మూడు మార్కుల ప్రశ్న వేసుకోవచ్చు.

కొన్ని సంస్థలవాళ్ళు మరీ తెలివిమీరి ఇప్పుడే కొనండి రేపు రేటు పెరుగుతుంది అంటూ భయపెట్టెస్తుంటరు. మన "శ్రీ కృష్ణ తులాభారం"లో కూడా నారదుడు శ్రీ కృష్ణుణ్ణి అమ్మాకానికి పెట్టినప్పుడు - "భలే మంచి చౌక బేరము. ఇది సమయము మించినన్ దొరుకదు. త్వరన్ గొనుడు సుజనులారా" అంటూ తొందర పెట్టేశాడు. అప్పటి కంజ్యూమర్స్ కృష్ణుణ్ణి కొన్నా ఆయన పాలు పెరుగు వెన్న వంటివాటికి, అయనతో పాటు వచ్చే పన్నెండువేల ఎనిమిది మంది మైంటైనెన్స్ ఖర్చుకి తమ ఆస్థులు కరిగిపోతాయని కొనలేదనుకోండి. అదివేరే విషయం. మరో చిత్రమేమిటంటే డిస్కౌంట్లు ప్రకటించని చోట మనమే చొరవ తీసుకోని "పోనీ ఇంతకిస్తావా?" అంటూ బేరం పెట్టేస్తాం. లేదంటే "కొసరు" అడగడం మన సాంప్రదాయంలోనే వుంది - "అసలు కన్నా కొసరు" ముద్దని - "కొసరి కొసరి వడ్డించడమనీ" సామెతలే పెట్టుకున్నాం.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే మనకి డిస్కౌంట్ కనపడిందంటే వంటి మీద గుడ్డ వున్నది లేనిది కూడా గుర్తుండదు. లగెత్తుకెళ్ళి అవసరం వున్నా లేకపోయినా కొనేసుకుంటాం. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు దానిని చక్కగా వుపయోగించుకుంటున్నారు. బిహేవియరల్ ఎకనామిక్స్ (Behavioural Economics) లో "లాస్ ఎవర్షన్ (Loss Aversion)" అని ఒక సబ్జెక్ట్ వుంది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి రూ.100 సంపాదిస్తే కలిగి ఆనందం కన్నా రూ. 100 కోల్పోతే కలిగే బాధ రెండు రెట్లు ఎక్కువగా వుంటుంది. వచ్చింది, పోయింది ఒకటే అయినా బాధ సంతోషాలు సమానంగా వుండవని చెప్తుందీ సిద్ధాంతం. అందుకే మనం రూపాయి డిస్కౌంట్ అనగానే తొమ్మిది రూపాయలైనా సంతోషంగా ఖర్చుపెట్టేస్తాం. పైగా "లిమిటెడ్ పిరియడ్ ఆఫర్" అని చెప్పగానే ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే నష్టం తప్పించడానికి ఇప్పుడు ఖర్చు పెంచేసుకుంటాం.

"ఈ మిక్సీ బాగుంది - ఎంతకి కొన్నారేమిటి పిన్నిగారు?" అంటూ ఇరుగుపొరుగు అడిగేది ఈ "లాస్ ఎవర్షన్" కోసమే. పైగా - "ఓహో అంత పెట్టి కొన్నారా? మా వేలువిడిచిన చిన్న మామగారి పెద్దల్లుడు డిల్లీ నుంచి ఇలాంటిదే సగం రేటుకే తెచ్చాడమ్మా" అంటూ సన్నాయి నొక్కులు నొక్కేది అందుకే. మీరు నష్టపోయారు అని చెప్పడం ద్వారా - "పోస్ట్ పర్చేజ్ డిసోనెన్స్" కల్పించడానికి.

మరో చిత్రమేమిటంటే, ఇదే లాస్ అవర్షన్ కారణంగా మనం ఒక సారి కొన్న వస్తువు తక్కువ ధరకే దొరుకుతుంది అని తెలియగానే - "పోనిస్తురూ అది తక్కువ రకం అయ్యుంటుంది" అంటూ తిప్పికొడతాం. ఏదైనా ఒక పనిమీద కొంత డబ్బు, శ్రమ, సమయం వెచ్చించాక ఆ పని నష్టం వస్తుందని తెలిసినా ఆపం. "ఎట్లాగు ఇంత దాకా వచ్చాం.. పోనీ పూర్తి అయ్యేదాకా కానిద్దాం" అంటాం. ముఖ్యంగా ఈ మధ్య తెలుగు సినిమా హాలులో ఇలాంటి మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి.

అలా మధ్యలో వదిలేస్తే డబ్బు, శ్రమ నష్టపోవటమే కాక మనం తప్పు చేశాం అని ఒప్పుకున్నట్లైతుంది. అది చెయ్యడానికి మనకి మనసొప్పదు. అందుకే మనం తప్పుగా ఎన్నుకున్న నాయకుణ్ణి మధ్యలో దింపాలని కూడా ఆలోచించం.. మన సంగతి ఏలా ఒక సారి మొదలు పెట్టిన యుద్ధాల్ని, తీవ్రవాదాన్ని ఆపలేక అల్లాడుతున్న దేశాలు మనకి తెలియదూ..?? అవును మరి దేశమంటే మట్టి కాదు, మనుషులే కదా - ఆ మనుషుల్లో వున్న సిద్ధాంతాలు, సైకాలజీలు అన్నీ కలిపి సగటు చేస్తేనే కదా దేశం సిద్ధాంతం, సైకాలజీ తయారయ్యేది..!!

సర్వే జనా సుఖినోభవంతు..!!

వద్దంటే వినడే.. పోకిరి..!!



కొంతకాలం క్రితం వచ్చిన ఒకానొక సినిమాలో పాట ఇది. ఆ కవిగారు తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కాని వద్దంటే వినకపోవడం మన జీవ లక్షణం. తమాషా ఏమిటంటే తర్వాతర్వాత వచ్చిన పోకిరి మహేష్ బాబు కూడా "నా మాట నేనే విన" నని ప్రకటించేసుకున్నాడు. ఎందుకు చెప్తున్నానటే ఈ మధ్య మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ పిల్లావాణ్ణి దగ్గరకి తీస్తూ ఒక చాక్లెట్ ఇచ్చాను. చనువుగా "నాక్కూడా పెడతావా?" అని అడిగితే

"పెట్టనంటే పెట్టను పోరా" అన్నాడు వాడు.

వాళ్ళ నాన్న మందలించి "తప్పు కదా అలా అనకూడదు" అన్నాడు.

"అనచ్చు. నువ్వు వొద్దన్నావు కదా ఇంక నేను అంటూనే వుంటా" అన్నాడు ఆ సుపుత్రుడు.

ఇలా వద్దు అని చెప్పగానే ఆ పని చేసెయ్యడం చిన్నతనం నించే అబ్బుతుందని నా అనుమానం. సృష్టి మొదలైన దగ్గర్నుంచి మనిషి లక్షణమే అంత అని బైబిల్ కూడా చెప్తుంది. దేవుడు ప్రపంచాన్ని అంతటినీ సృష్టించిన తరువాత ఏడం ఈవ్ అనే జంటను సృష్టించి,

"ఈడెన్ వుద్యాన వనం మొత్తం తిరగండి.. కానీ ఫలానా ఆపిల్ చెట్టు కాయలు మాత్రం ముట్టుకోవద్దు" అంటూ చెప్పాడుట.

వద్దంటే వినని లక్షణం మొదట్నించి వుండటం వల్లే సదరు ఏడం ఈవ్లు ఆ చెట్టు కాయలు కోసుకోని తిన్నారని బైబిల్ మొదటి అధ్యాయంలోనే వుంది. ఆ తరువాత అదే పరంపర కొనసాగిస్తూ మానవ కోటి మొత్తం "వద్దంటె వినం" అంటూ యధా విధి వారసత్వం నిలబెడుతున్నారు.

మన పురాణాల్లో కూడా "చండి" అనే మహా ఇల్లాలు కథ వుంది. ఆవిడ భర్తగారు ఏదంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేదట. "సంధ్యా వందనం చేసుకోవాలి కమండలంలో గంగ నీరు పొయ్యవే" అంటే ఆ కమండలం నిండా బురద నీరు చేర్చేదట. అలాంటి భార్యతో ఎలా వేగాలో ఆలోచించి ఒక ఆలోచన చేశాడా మునిగారు. ఏదైనా పని జరపాల్సి వచ్చినప్పుడు రివర్స్లో చెప్పేవాడు. "ఈ రోజు మా నాన్న ఆబ్దికం. బ్రాహ్మల్ని పిలిచావో నీ చెండాలు తీస్తాను" అనేవాడట. "నువ్వు వద్దంతే నేను వింటానా.. ఇప్పుడే బ్రాహ్మల్ని పిలిపిస్తానని" అన్నంత పని చేసేదట ఆ మహా ఇల్లాలు.

మన చందమామ కథల్లో కూడా యువరాజు కొత్త వూరికి వెళ్ళి పేదరాసి పెద్దమ్మ ఇంట్లో భోజనాదులు కానిచ్చి ఆ వూరి విశేషాలు అడిగి చెప్పించుకునేవాడు. పెద్దమ్మ అంతా చెప్పి "ఫలానా తూర్పు దిక్కుకు మాత్రం వెళ్ళకు నాయనా.. ప్రమాదం" అని చెప్తుందా, వెంటనే యువరాజుగారు గుర్రం ఎక్కి ఠంచనుగా తూర్పు దిక్కుకేసి వెళ్ళేవాడు. అలాగే ప్రతి జానపద కథలోనూ ఇలా చెయ్యకూడని పని ఏదో ఒకటి వుండటం, హీరో గారు తప్పకుండ ఆ పని చెయ్యడం మనం వినే వుంటాం. ఇలా వద్దంటే వినని వాళ్ళ గురించి జానపదులు "ఎడ్డెమంటె తెడ్డెమంటావ్ ఏమన్నంటే ఎగిసి తంతావు.. వేగెదెట్టా యాద్గిరి మామా" అంటూ పాట కట్టి పాడారు.

ఈ రకంగా వద్దు అంటే అది ఖచ్చితంగా చెయ్యడం మన నర నరాల్లో వుండిపోయింది. ఆ లక్షణాలన్నీ ప్రతి రోజూ, ప్రతి క్షణం మనం ప్రదర్శిస్తూ వుంటాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూడండి - ఎర్ర లైటు వున్నప్పుడు ముందుకు వెళ్ళకూడదు అని రూల్. మనం ఎర్ర లైటు వున్నప్పుడే ముందుకెళ్తాం. కనీసం "స్టాప్" అని వ్రాసి వున్న చోటు దాటి ఒక్క టైర్ అన్నా ముందుకు పెట్టపోతే మనకి తృప్తి వుండదు. ఎడమ చేతి వైపే వెళ్ళాలి అని చెప్తే అడ్డదిడ్డంగా బండిని సర్కస్లో లాగా పల్టీలు కొట్టిస్తే కాని మన కుర్రకారుకి బండి నడిపినట్లు వుండదు. హెల్మెట్ లేకుండ ప్రయాణం చెయ్యకూడదు అన్నారని హెల్మెట్ వుంచుకోని పెట్టుకోము. నో పార్కింగ్ అని ఎక్కడ వుందో చూసి మరీ బండి పార్క్ చేస్తాం. ఇక కార్లో సీటు బెల్టు పెట్టుకోవడం మర్చిపోయి చాలాకాలం అయ్యింది. ఇక సెల్ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా?

ఫుట్ బోర్డ్ ప్రయాణం మీకు ప్రమాదకరం అని చెప్పినా అది మనకి ప్రమోదకరమనే వినిపిస్తుంది. ఇక లేడిస్ సీట్లో కూర్చోని నిద్రపొతున్నట్లు నటించే పురుష పుంగవుల సంగతి చెప్పేదేముంది. దయచేసి క్యూలో రండి అంటే వరసలో ముందు వున్న వాళ్ళ దగ్గరకి వెళ్ళి ఒక్క టికెట్ కొని పెడతారా అంటూ దేబరించడం మనకి అలవాటైపోయింది. క్యూలో వున్న మిగతావారు పురుగు చూసినట్లు చూసి తల తిప్పుకుంటారే కాని "వరసలో రమ్మని" అననే అనరు.

ఎందుకంటే రేప్పొదున వాళ్ళు అలా రావాల్సిన వాళ్ళే కదా..! ఎందుకంటే అలా వద్దన్న పని చెయ్యడం మన జన్మ హక్కు కదా..!!

మన కోసం ఒక దినం..!!






లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అంటూ ప్రతీ విషయానికి, సంబంధబాధవ్యాలకి ఒక దినం (డే) ఏర్పాటు చేసుకున్నాం మనం. మొన్నామధ్య కర్నూలు వెళ్తే అక్కడ టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ పెద్ద బ్యానర్ కనపడింది. ఇదెక్కడి చోద్యమా అని ఆశ్చర్యపోతుంటే ఆ పక్కనే ప్రింటర్స్ డే సందర్భంగా మరో శుభాకాంక్షల బ్యానర్ కనిపించింది. ఇంకనే.. ఇక ముందు ముందు ఇంటర్నేషనల్ సినిమా కర్టన్ పుల్లర్స్ డే అనో చెవిలో గుబిలి తీసే వాళ్ళ డే అనో పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొన్ని కొన్ని దినాలు ఆ రోజు చేయ్యాల్సిన పని మీద ఆధారపడి వుంటాయి. వుదాహరణకి నో స్మోకింగ్ డే అంటే ఆ రోజు పొగ తాగ రాదు. అలాగే ముందు ముందు సెల్ఫ్ బాత్రూం క్లీనింగ్ డే అనో చిరుగు బట్టలు కుట్టుకునే డే అనో క్యాలండర్లో వచ్చినా మీరు ఖంగారు పడకూడదు. అంతెందుకు ఎవరైనా తెలుగు వాడు అఖిలాంద్ర మాగాయ్ ఈటింగ్ డే అని ప్రకటిస్తే ఆనందంగా మజ్జిగలో మాగాయ నంజుకోవాలేకాని ఇదేమిటి అనకూడదు.

ఇంటర్నేషల్ లెఫ్టీస్ డే అని ప్రకటించారనుకోండి ఇక ఆ రోజంతా లెఫ్ట్ మహిమే. "వామాంక స్థిత జానకీ కాంత" ఆ రోజు పండగ చేసుకోవచ్చు. మన వామపక్షాలు కూడా ఆ రోజు ఎర్ర చొక్కాలేసుకోని సంబరాలు చేసుకోవచ్చు. ఇక కుడి చేతి వాటంగాళ్ళంతా తమది పుర్ర చెయ్యి వాటం కాదని బాధపడుతూ ఎన్టీఆర్ కృష్ణుడుగా ఎడంచేత్తో దీవించే ఫొటోలకి దణ్ణం పెట్టుకోవాల్సిందే. అలాగే నేషనల్ బ్లాక్ స్పెక్టకిల్స్ వేరింగ్ డే అని ప్రకటిస్తే ఎలా వుంటుంది. ఆ రోజు అందరూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే. కరుణానిధి పుట్టినరోజే రోజే ఈ డే జరపాలని అరవ సోదరులు అరిచి గోల చేస్తారేమో. ఆ రోజంతా ప్రతివొక్కరు అమావాస్య చంద్రుళ్ళు అయిపోయి తిరగచ్చు. ఎంచక్కా అమ్మాయిల్ని చూసి కన్నుకొట్టినా, కను సైగ చేసినా ఏమాత్రం తెలియదు. సేఫ్టీకి సేఫ్టీ.. మనకీ ఏదో ఒక ఆనందం.

అసలు ఇన్ని రకాల డేస్ వున్నప్పుడు మన లాంటి సామాన్యుడి కోసం ఒక డే ఎందుకు వుండకూడదు అని నాకు ఆలోచన వచ్చింది. ప్రభుత్వాలు మారినా బతుకులు బాగుపడని సామాన్య జనం కోసం ఒక రోజు చాలా అవసరం అనిపించింది. అసలు అలాంటి రోజు ఒకటి వుందేమో అని విచారించి, లేనందుకు మరింత విచారించి ఎలాగైన మన కోసం ఒక దినం ఏర్పాటు చెయ్యాలని తీర్మానించుకున్నాను. ఈ విషయమై అసంబ్లీ స్థాయిలో పైరవీలు చేస్తే మంచిదని మా వూరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను.

ఆయన నా డిమాండు హోలు మొత్తంగా విని గట్టిగా నవ్వి - "అదేమిటయ్యా మీలాంటోళ్ళకోసం ఆల్రెడీ ఒక డే వుందిగా" అన్నాడు.
నేనెంత రీసర్చి చేసినా తెలియనిది మా ఎమ్మెల్యే గారికి తెలిసినందుకు ఎంతో సంతోషించి, చేతులు కట్టుకోని "అదేమిటో" అని అడిగా.
"ఏప్రియల్ ఒకటి.. ఫూల్స్ డే వుండనే వుందిగా" అంటూ పంచ సర్దుకోని చక్కాపోయాడాయన.
బుద్ధుడికి అదేదో చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టు ఎమ్మెల్యే గారి ఇంట్లో యూరోపియన్ చాండిలీరు కింద నాకు జ్ఞానోదయం అయ్యింది. ఏప్రియల్ ఒకటో తారీఖు. ఆర్థిక సంవత్సరం మొదలయ్యే రోజు. ఇంటర్నేషనల్ ఫూల్స్ డే.. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అయితే ఒకటే బాధ పది రోజుల క్రితమే అయిపోయింది. ముందే తెలిసి వుంటే ఎంచక్కా పండగ చేసుకునే వాళ్ళం కదా?

అయితే ఆ విషయానికీ సాంత్వన కలిగించే సంగతి ఒకటుంది. ఎవరో ఇంగ్లీషు రచయిత చెప్పినట్లు - ఫూల్స్ డే అంటే మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు మనం ఏమిటో గుర్తు చేసే రోజట. నిజమే కద.. మనం 364 రోజులు ఎన్నిసార్లు ఫూల్స్ అవుతున్నామో మనకి తెలియదూ..!? అలా అంటే మొదట ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు మనకి ఇచ్చే వాగ్దానాలు, ఆ తరువాత గట్టున పెట్టే వొట్లు గుర్తుకు రావచ్చు. అంతకన్నా ఎక్కువే వున్నాయి - రాష్ట్రంలో ప్రభుత్వం నిజంగానే వుందని భ్రమింపజేస్తున్నది నిజం కాదా. అంతెందుకు మీ పర్సులో వున్న వెయ్యి రూపాయల నోటు నిజమైనదే అని మీరు నమ్ముతున్నారా? మీ వూర్లో మీ పొలం ఇంకా ఏ గనులకో లీజుకి వెళ్ళకుండా ఇంకా మీ పేరు మీదే వుందని నమ్ముతున్నారా? మీరు కొనే సరుకుల్లో ఇటికరాయి పొడి, మట్టిబెడ్డలు లేవని నమ్మి కొంటున్నారా? సెక్స్ స్కాము వీడియోల్లో కనిపించే నాయకులు, నటీమణులు అంతా గ్రాఫిక్స్ మహిమే అని చెప్తే వింటున్నాం కదా? ఏదో ప్రైవేటుగా చదువుకోనీ ర్యాంకు తెచ్చుకున్న పిల్లాణ్ణి కొనుక్కోని మా స్టూడెంటే అని చెప్పే విద్యా సంస్థల మాటలు నమ్ముతున్నామా లేదా? నెల రోజుల్లో మీరిచ్చిన డబ్బు రెట్టింపు చేస్తాం అనే “చీట్” ఫండ్ కంపెనీలను మీరెప్పుడు నమ్మలేదా? ఇంత ఏల - ఆఖరికి బస్సులో టికెట్ కొనుకున్న తరువాత కండెక్టర్ చిల్లర లేదు అంటే గుడ్డిగా నమ్మేసి కిటికీసీట్లో కూర్చోవట్లేదు...

ఇన్ని రకాలుగా అందరినీ నమ్మి అందరికీ మనల్ని ఫూల్స్ చేసే అవకాశం ఇచ్చాక ఏప్రియల్ ఒకటి మన దినం కాకుండా ఎలా పోతుంది? చెప్పండి.

మోసే వారెవరురా..!!



మోసెయ్యడమంటే రక రకాల అర్థాలు వాడకంలో వున్నాయి. గుర్రం గాడిద లాంటి కొన్ని జంతువులు మొయ్యడానికే పుట్టాయని కొందరి అభిమతం.. కాదు అది రెటమతం అని బ్లూక్రాస్ వాదన. ఏమైనా మన దేవతలనందరినీ మొయ్యడానికి రక రకాల జంతువులను ఏర్పాటు చెయ్యడం జరిగింది. పూర్వం రాజుల హయాంలో పల్లకీ మోసే బోయీలు వున్నారని మనకి తెలుసు. "అందరూ ఎక్కేవాళ్ళే అయితే మోసే వాళ్ళు ఎవరు" అని ఒక సామెత కూడా మనకి వుంది. దీనర్థం ఏమిటయ్యా అంటే - ప్రతి వొక్కరూ సుఖాల్ని కోరుకోవడమే కాదు కష్టాలను కూడా అదే విధంగా అనుభవించాలని చెప్పారు కొందరు తత్వవేత్తలు. అలాకాదు అందరూ ప్రమోషన్లు కొట్టేసి పైకి పైపైకి వెళ్ళిపోతే కింద పనిచేసేదెవ్వరు అంటూ కార్పొరేట్ బాసు శెలవిచ్చి ప్రమోషన్లు ఎగ్గొడుతున్నారు. ఏది ఏమైనా అన్నమయ్యని సాక్షాత్తూ వెంకటేశ్వరుడే మోసేసినట్లు కథ చెప్పారు మన దర్శకేందృడు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు అష్ట దిగ్గజాలను పల్లకీలో మోసారడనీ (ఒక్కసారి కాదు.. ఒక్కరినే..) అందుకు ప్రతిఫలంగా ఆ కవులంతా రాజుగారిని తెగ మోసేసారని చెప్పారు కొందరు విమర్శకేంద్రులు.



అవునండోయ్... ఈ మోసెయ్యడం ఇంకొకటి వుంది. దీన్ని పొగడ్తకి పై మెట్టుగా చెప్పవచ్చు. ప్రమోషన్ల కోసం బాసుల్ని మోసెయ్యడం, పట్టు చీరకోసం మొగుణ్ణి మోసెయ్యడం ఇలాటి వాడుక ప్రయోగాలు వున్నాయి. అయితే పదవులకోసం హైకమాండ్‌ని మోసేసే వాళ్ళు మరీ ఎక్కువగా కనిపిస్తున్నారు. మొన్నామధ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో మాయావతి చేత నోట్ల హారం భారం మోయించి తద్వారా మోసేసిన నాయకులు మనకి బాగా తెలుసు. ఇక మరో రకం మోయ్యటాని ఈ మధ్యనే ఒక నాయకుడు ప్రదర్శించాడు.. రాహుల్ గాంధి చెప్పుల్ని భరతుడిలా నెత్తిన పెట్టుకోని మోసేసేవారిలో తనని మించినవారు లేరని నిరూపించుకున్నాడు.



పదవులకోసం మోసే మోతలలో మరో రకం మోత కూడా వుంది. అది మాటల్ని మొయ్యడం. ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి మోసేసే మోతశిఖామణులు ప్రతి ఆఫీసుల్లోనూ మనకి కనిపిస్తారు. మోతకు తగ్గ ప్రతిఫలం కూడా వీళ్ళు తరచుగా పొందుతుంటారు.



ఇవే కాకుండా పేరు మొయ్యడాలు, కీర్తి ప్రతిష్టలు మొయ్యడాలు, బరువు బాధ్యతలు మొయ్యడాలు లాంటివి చాలా వున్నాయి. శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు మోసిన కథ, శిలువను మోసిన ఏసు కథ, తల్లిదండ్రుల్ని మోసిన శ్రవణ కుమారుడి కథ మనం చదువుకున్నాం. ఎవరెంత మోసినా చివరికి మోసేది "ఆ నలుగురే" అని తాత్విక చింతనలో పడేసాడు ఒక సినిర్మాత.



మరో రకం మొయ్యడం గురించి నేను విన్న ఓ కథ చెప్పి ముగిస్తాను -



అనగనగా ఒక గురువుగారు, వారి శిష్య బృందం అడవుల గుండా ప్రయాణిస్తూ ఒక వాగు వొడ్డుకు చేరుకున్నారట. అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడి వుంది. వీరిని చూడగానే - "అయ్యా నాకు ఈత రాదు. దయచేసి నన్ను ఎత్తుకోని అవతలి వొడ్డుకు చేర్చగలరా" అంటూ ప్రాధేయపడిందట.


దానికి వాళ్ళు - "ససేమిరా వీల్లేదు.. మేం సన్యాసులం, బ్రహ్మచారులం.. ఆడ స్పర్శ నిషిద్ధం" అన్నారు. వెంటనే గురువుగారు ఆ అమ్మాయికి సాయం అందించి, తన వీపు పైన ఆ అమ్మాయిని మోస్తూ వాగు దాటించారు. ఆ తరువాత బృందమంతా ప్రయాణం కొనసాగించారు. దారి పొడవునా శిష్యులు ఎంతో మధనపడి, గురువును ప్రశ్నించలేక తటపటాయిస్తూ ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక అడిగారట -



"గురువుగారు.. మనవంటి బ్రహ్మచారులకు స్త్రీ స్పర్శ నిషిద్ధమని తమరే కదా శలవిచ్చారు, మరి ఆ అమ్మాయిని అలా వీపుమీద అంగాంగం తగిలేలా ఎందుకు మోసారూ?" అని. దానికి గురువుగారు నవ్వి -



"నాయనలారా ఆ అమ్మాయిని నేను వాగు దాటగానే దింపేశానే.. మీరింకా ఎందుకు మోస్తున్నారు?" అన్నాట...!


నమో (వి)నాయకా



వినాయకుడి వేష భాషలు చూసి అనుకున్నారో లేక ప్రాస కోసం వాడుకున్నారో కాని వినాయకుణ్ణి, రాజకీయ నాయకుణ్ణి కలిపి తల్చుకోవడం మనకి అలవాటైంది. అసలు వినాయకుడికి నాయకుడికి గల సంబంధం ఏమిటా అని ఈ మధ్యకాలంలో చాలా ఆలోచన చేశాను. నిజానికి వినాయకుడికి రాజకీయ నాయకుడికి కొంత సంబంధం లేక పోలేదు. చాలామంది రాజకీయనాయకులు తమ మొదటి సంపాదన గణేష్ పూజ చందాలతోనే మొదలు పెట్టి వుంటారని ఒక సర్వేలో తెలిసింది. అక్కడినుంచి పేట రౌడీలుగా ఆ పైన గూండాలుగా తరువాత ప్రజా ప్రతినిధులుగా రూపాంతరం చెందివుంటారని ఆంధ్ర డార్విన్ ఒకాయన శెలవిచ్చారుట.

అసలు వినాయకుడి తయారీలోనే ఏదో గడబిడ వుంది... మిగతా అందరిలా కాక పసుపు ముద్దతో మ్యానుఫాక్చరింగ్ జరిగింది. తయారు చేసింది అమ్మల గన్న అమ్మ. సరే బొమ్మ చేసి వూరుకోక ప్రాణం పోసింది. ఆయనగారేమో వెంటనే సెక్యూరిటీ డ్యూటీలో చేరిపోయి సాక్షాత్తూ పరమేశ్వరుణ్ణే ఆపేశాడు. అసలు ఇప్పుడు మాల్స్‌లోనూ, సినిమాహాళ్ళలోనూ వుండే సెక్యూరిటీని చూసి చిరాకు పడతాం కానీ సాక్షాత్తూ పరమేశ్వరుడికే ఆ కష్టం తప్పలేదని మనం మర్చిపోతుంటాం. సరే కథలోకి వస్తే పరమేశ్వరుడు అప్పుడే గజాసురుడి వుదరరచెర నుంచి వచ్చినవాడవటం చేత కొంచెం చిరాకు పడి, వినాయకుడి తల తెంచి ఆపైన గజాసురుడి తలతో సర్జరీ చేయించాడు. వినాయకుడిలాగానే రాజకీయనాయకుడి మానుఫాక్చరింగ్ గడబిడలేమైనా వున్నాయని అనుమానం నాకు. ఆయన భయం, భక్తి లేకుండా తండ్రి శివుణ్ణే ఎదిరిస్తే, వీళ్ళు సిగ్గు శరము లేకుండా వోట్లకోసం దేబరిస్తుంటారు.

అయినా వినాయకుడికి వేరే ఏ తల దొరకనట్టు ఏనుగు తల ఎందుకు పెట్టారో అర్థం కాదు. తరువాత తరువాత వినాయకుడు తలకి మాచింగ్‌గా శరీరాన్ని మలచుకున్నాడా, లేక అప్పటికే భారీగా వున్న శరీరాన్ని చూసి పరమేశ్వరుడు ఏనుగు తల ఎన్నుకున్నాడా అని ఒక పురాణ సందేహం. సరే ఏమైతేనేం మొత్తానికి గణేషుడి రూపం అది - ఏనుగు తల, బాన కడుపు, అమిత భోజనం, భుక్తాయాసం.

ఈ శరీరాకృతి మన రాజకీయ నాయకుల శరీరాకృతితో సరిపోవటం మనం గమనించాల్సిన ముఖ్యమైన సామీప్యం. లంబోదర లక్షణం ప్రస్ఫుటంగా ఇద్దరిలోనూ కనిపిస్తుంది. రాజకీయనాయకుణ్ణి చూస్తే పదవి వచ్చిన తరువాత పొట్ట పెరిగిందా లేక పొట్ట పెరిగిన తరువాత పదవి వచ్చిందా అని అనుమానం రావటం సహజం. (మరి పోలీసులూ కూడా అదే కోవకి వస్తారని అనుమానం మీకు రావచ్చు అందుకే మరింత వివరం ఇస్తున్నాను).



సరే ఆ విషయాన్ని అక్కడే వదిలిపెట్టి తరువాత సంగతి చూద్దాం. తరువాత కథ, మనం ప్రతి వినాయకచవితికి చదువుకునేదే - విఘ్న నాయకత్వం ఎవరికివ్వాలనేది. అప్పట్లో ప్రజాస్వామ్యం అంతగా పట్టుబడక పోవటం చేత, శివుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. వినాయకుడు అంత కష్టపడకుండా తల్లి దండ్రుల చుట్టూ తిరిగి ప్రపంచమంతా తిరిగిన పుణ్యాన్ని పొందాడట. (కాదు తన లాప్‌టాప్‌లో గూగుల్ ఎర్త్ తీసి దాని చుట్టూ తిరిగాడని ఒక సాంకేతికుడి ఉవాచ - నమ్మకండి). ఇంతా చెప్పొచ్చేదేమిటంటే పదవికోసం ప్రదక్షణాలు చెయ్యటం అనే సాంప్రదాయాన్ని వినాయకుడే ప్రారంభించినట్లు, అదే సాంప్రదాయం నాయకులూ పాటిస్తున్నట్లు తెలియవస్తోంది.

విఘ్న నాయకత్వం వచ్చిన తరువాత అమితాహారం భుజించి, కుడుములు స్వాహా చేసి భుక్తాయాసంతో ఆయన పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదని మనం విని వున్నాం. సరిగ్గా అదే విధంగా పదవిలోకి రాగానే తెగ తినడం రాజకీయ నాయకులకు అలవాటైంది. మరో విశేషమేమంటే ఇలా తిన్న నాయకుణ్ణి వేలెత్తి చూపించినా, గట్టిగా నవ్వినా చంద్రుడికి పట్టిన గతే మనకీ తప్పదు. అంతే కాదండోయ్ వినాయకుడు తన శరీరాకృతిని మర్చిపోయి చిన్న ఎలుకనెక్కి తిరిగినట్టే మన నాయకులు కూడా అల్పప్రాణి అయిన సామాన్యుడి నెత్తినెక్కి తిరుగుతున్నారు. కాబట్టి నా బ్లాగులో మొదటి ప్రార్థనగా -

శుక్లాంభర ధరం విష్ణుం: తెల్లని బట్టలు ధరించేవాడు - ఖద్ధరు తెలుపు రాజకీయ నాయకుడి యూనీఫాం కదండి..!
శశి వర్ణం: మరే చంద్రుడి వర్ణమట - నిజమే..!! పగలంతా పూర్ణ చంద్రుడు పొద్దు గుంకితే అమావాస్య చంద్రుడు
చతుర్భుజం: నాలుగు చేతులు - అందుకే నాలుగు చేతులా దోచుకుంటున్నాడు
ప్రసన్న వదనం: ఇక చెప్పేదేముంది - అసంబ్లీలో ప్రతిపక్షం అరిచినా, స్కాముగుట్లు రట్టైనా, పదవి వున్నా వూడినా ప్రసన్న వదనానికి ఇంచుకైనా మచ్చ రాదు కదా?
ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే: అయ్యా అట్లాంటి మీకు దణ్ణం పెడతా - రింగురోడ్లని నా పొలం పనులకి విఘ్నం తీసుకురాకు, సెజ్‌లని నా ఇంటి ఆశలు ముంచవద్దు, బడ్జట్లని నా కోరికలను తుంచవద్దు.. నీకు దణ్ణం పెడతా..!! నీ కాల్మొక్కుతా..!!