మొపాస కథలు: దారప్పోగు

సంత జరిగే రోజు. గోడేర్విల్లా పట్టణానికి చుట్టుపక్కల వుండే రైతులంతా తమతమ భార్యలతో సహా అక్కడికి చేరుకుంటున్నారు. మగవాళ్ళు నెమ్మదిగా నడుస్తున్నారు. పొడుగ్గా వంకరగా వున్న తమ కాళ్ళతో ఒక్కో అడుగు వేసినప్పుడల్లా వాళ్ళ శరీరాలు భారంగా కదులుతున్నాయి. వాళ్ళ శరీరం వంకరలన్నీ పొలం పనులు చేయడం వల్ల వచ్చినవే. నాగలిని బలంగా తోస్తూ నడవటం వల్ల వాళ్ళ ఎడమభుజాలు కుడు భుజం కన్నా ఎత్తుగా వుంటాయి. కోతలు కోయడానికి వంగడం వల్ల శరీరం ఒక పక్కకి ఒరిగి వుంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు జారకుండా వుండేందుకు కాళ్ళు ఎడంగా పెట్టడం వల్ల అవి అలాగే వంకరగా మిగిలిపోతుంటాయి. కాస్త గాడిగా వుండే వాళ్ళ నీలం రంగు జుబ్బాల చేతులమీద, మెడ చుట్టూ చక్కని అల్లికలు వున్నాయి. గంజి పెట్టి పెట్టి అవి కాస్త చీకిపోయినట్లు వున్నాయి. అయితే బక్కపల్చటి వాళ్ళ శరీరాల మీద వదులుగా వుండే ఆ జుబ్బాలు పగలడానికి సిద్ధంగా వున్న గాలిబుడగలులా ఊగుతున్నాయి. ఆ బుడగల నుంచి పొడుచుకొచ్చినట్లుగా ఎముకల్లాంటి కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి.
వాళ్ళలో కొంతమంది చేతుల్లో వుండే తాళ్ళ రెండో కొసకు ఒక ఆవో, దూడో కట్టి వుంది. వాటి వెనుకే ఆడవాళ్ళు నాలుగైదు ఆకులున్న చిన్న కొమ్మలు పట్టుకోని వాటిని అదిలిస్తూ నడుస్తున్నారు. వాళ్ళ రెండో చేతిలో వుండే గంపల్లో నుంచి కోడి పిల్లలో, బాతు పిల్లలో తలలు బయటికి పెట్టి చూస్తున్నాయి. ఆడవాళ్ళు చురుగ్గా, త్వరగా నడుస్తున్నారు. ఎండిపోయినట్లుండే వాళ్ళ శరీరాలు నిటారుగా వుండి వాళ్ళ వేగానికి దోహదపడుతున్నాయి. కండలేనట్లుండే వాళ్ళ శరీరం పైన ఎక్కువగా దుస్తులేమీ లేవు. నడుముకి ఓ గుడ్డ, ఎదపై ఓ గుడ్డ. జుట్టు కనపడకుండే చుట్టుకున్న తెల్లటి గుడ్డ మరికటి. అంతే!
అప్పుడప్పుడు అటుగా వెళ్ళే ఎడ్లబండ్లు గుంతల్లో పడ్డప్పుడల్లా విచిత్రంగా ఊగిపోతూ ముందు కూర్చున్న మగవాడినీ, చివర్లో కూర్చున్న ఆడవాళ్ళని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే వాళ్ళు బండి కొసల్ని బలంగా పట్టుకోని కుర్చున్నారు.
సంతలో ఎక్కడ చూసినా తొక్కిసలాటలే. నిండా జనం, జంతువులు. అదో మహా సముద్రంలా వుంది. సముద్రం పైన అలల్లా జంతువుల కొనదేరిన కొమ్ములు, ఎత్తైన మగవారి టోపీలు, ఆడవారి జడలు కనపడతున్నాయి. గొంతు చించుకోని కీచుమంటూ అరిచే అరిపులన్నీ కలిసి చెవులు దిమ్మెక్కించేలా వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి ఏ రైతో సంతోషం పట్టలేక గట్టిగా నవ్విన నవ్వులో, గోడవారగా కట్టేసిన ఆవు దీర్ఘంతీస్తూ అరిచే అరుపులో వినిపిస్తోంది.
ఆ గాలిలో పేడకళ్ళ వాసన వుంది. పాల వాసన వుంది. ఎండుగడ్డి వాసన వుంది. చెమట వాసన వుంది. సగం మనుషులకు సంబంధించిన వాసన, సగం గొడ్లకు సంబంధించిన వాసన కలగలిసి, పల్లెటూర్లో వున్నవాళ్ళకే పరిచితమైన వాసనలు గాలిలో తేలుతున్నాయి.
సరిగ్గా అలాంటప్పుడే బ్రేట్ గ్రామానికి చెందిన మాస్టర్ ఉష్కార్న్ అక్కడికి వచ్చాడు. సంత మధ్యలోకి వెళ్ళబోతున్న అతనికి నేలమీద ఓ సన్నటి దారపు ముక్క కనిపించింది. అందరు రైతుల్లానే ఉష్కార్న్ కాస్త పొదుపరి. పనికొచ్చే వస్తువు ఏదైనా కనపడితే దాన్ని తీసుకోడానికి ఏ మాత్రం వెనుకాడక్కర్లేదని అతని సిద్ధాతం. అందువల్ల అక్కడే ఆగి, కీళ్ళ నొప్పుల వల్ల కాస్త ఇబ్బందిపడుతూనే ముందుకు వంగి ఆ సన్నటి దారప్పోగును అందుకున్నాడు. దాన్ని జాగ్రత్తగా చుట్టచుట్టి సరిగ్గా దాచుకోడానికి సిద్ధపడుతున్నప్పుడే అతనికి మాస్టర్ మాలోందా అతని షాపు గుమ్మంలో నిలబడి అతన్నే చూస్తూ కనిపించాడు. అతను గుర్రాలకి జీనులు తయారుచేసి అమ్ముతుంటాడు. ఒకసారి పలుపుతాడు కొనే విషయంలో ఆ ఇద్దరి మధ్య కాస్త వాదులాట జరిగింది. ఇద్దరిలోనూ ఆ కడుపుమంట వుంది. తన శత్రువులాంటి వాడు తనని ఓ దారం ముక్క ఏరుకుంటుండగా చూశాడని అర్థం అవగానే ఉష్కార్న్ కి సిగ్గుగా అనిపించింది. చటుక్కున దారం ముక్కని జుబ్బా చేతుల కింద దాచి, కనపడకుండా నెమ్మదిగా దాన్ని జేబులోకి తోసి ఏమీ తెలియనట్లు నిలబడ్డాడు. నేల మీద ఏదో వస్తువు పోగొట్టుకున్నట్లు అక్కడక్కడే వెతికి చివరికి అది దొరకనట్టుగా నటించి, సంతలోకి వడివడిగా వెళ్ళిపోయాడు. ఆ నడక వల్ల అతని కీళ్ళ నొప్పులు రెండింతలయ్యాయి.
కదిలిపోతున్న జనంలో అతను కలిసిపోయాడు. సంతకొచ్చిన జనం సహజంగానే అవీ ఇవీ చూస్తే బేరాలాడుతూ నెమ్మదిగా కదులుతుంటారు. రైతులు వచ్చి ఆవుల్ని పరిశీలించి వెళ్ళిపోతారు. మోసపోతున్నామేమో అన్న అనుమానం వెంటాడుతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తుంటారు. కొనాలో వద్దో తేల్చుకోరు. అమ్మేవాడు తప్పకుండా ఏదో మోసం చేస్తుంటాడని అది ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
ఆడవాళ్ళు గంపల్నికాళ్ళ దగ్గర దించుకోని, అందులో వున్న కోళ్ళనో, బాతుల్ని బయట వదిలిపెడుంటారు. వాటి కాళ్ళు కట్టేసి వుంటాయి కాబట్టి అవి కదల్లేక భయం భయంగా చూస్తుంటాయి. ఎవరో ఒకరు బేరమాడతారు. తగ్గించి అడుగుతారు. వీళ్ళ ధరలో ఏ మాత్రం మార్పూ రాదు. ముఖంలో ఏ భావం కనపడకుండా స్థిరంగా నిలబడతారు. అయినా ఒక్కోసారి దిగి వచ్చి, వెళ్ళిపోతున్న వాళ్ళని కేకేసి పిలుస్తారు.
“ఓమ్మో... నువ్వు చెప్పిన ధరకే ఇస్తాలే.. రా...రా..” అంటారు.
బేరాలన్నీ అయిపోతుంటే క్రమక్రమంగా ఆ ప్రాంతం పల్చబడుతుంది. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి అక్కడి హోటళ్లు దూరం నుంచి వచ్చినవారితో కిక్కిరిసిపోతాయి.
జ్యోదా హోటల్ సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. తినడానికి వచ్చినవాళ్ళతో నిండిపోయేది. బయట రకరకాల బండ్లు ఒకదాని ఒకటి ఒరుసుకుంటూ నిలబెట్టేవాళ్ళు. ఒంటెద్దు బండ్లు, గుర్రపు బగ్గీలు, జోడెడ్ల బండ్లు ఇంకా ఏమిటేమిటో పేరులేని బండ్లు. వాటి నిండా మట్టి, దుమ్మ వుంటుంది. ఆకాశంలోకి చేతులు చాచినట్లు కొన్ని బండ్ల కాడెలు పైకి లేపి వుంటాయి. కొన్ని తమ ముక్కుని నేలకి రాస్తున్నట్లు ముందుభాగం భూమి మీద పడినట్లు వుంటాయి. చాలావరకు వంకర్లు తిరిగిపోయి, అక్కడక్కడ విరిగి అతుకులు వేసినట్లు వుంటాయవి.
లోపల సరిగ్గా భోజనాలు చేసే చోట ఒక పెద్ద నిప్పుగూడు వుంది. భగభగా కాలుతూ వెలుతురు చిమ్ముతూ వుంటుంది. అక్కడ కూర్చుని తినేవాళ్ళ వీపులు ఆ మంటకు వేడెక్కుతుంటాయి. మూడు ఇనుప చువ్వలకు రకరకాల మాంసాలు గుచ్చి వాటిని మంటల్లో తిప్పుతుంటారు. వాటి నుంచి వచ్చే వాసన చూస్తే చాలు అందరికీ నోట్లో నీరు వచ్చేస్తుంటుంది.
ఆ రోజు కూడా నాగలిపట్టే రారాజులంతా అక్కడే చేరారు. ఆ హోటల్ యజమాని మాస్టర్ జ్యోదా ఒకప్పుడు గుర్రాలను అమ్మేవాడు. తెలివైన వాడు, మాటకారి. ఆ రోజుల్లో బాగానే సంపాదించాడని చెప్పుకుంటుంటారు.
ఓ పక్క నుంచి పసుపు రంగులో వున్న వైను, మరో వైపు రకరకాల మాంసాహారం వస్తున్నాయు. వచ్చినవి వచ్చినట్లే అయిపోతున్నాయి. వాటి మధ్యలో ఆ రోజు ఏం కొన్నారో, ఏం అమ్మారో అన్నీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. పంటల గురించి తమ దృష్టికి వచ్చిన విషయాలను పంచుకుంటున్నారు. “ఈసారి వాతావరణం కాయగూరలకు బాగుంటుందంట. తేమ ఎక్కువగా వుంది కదా, ధాన్యం జోలికి వెళ్ళకపోతేనే మంచిది” అని చెప్పుకుంటున్నారు.
ఉన్నటుండి బయట నుంచి దండోరా మోత వినిపించింది. నిరాసక్తంగా వున్న కొద్దిమంది తప్ప మిగిలిన అందరూ బయటికి పరిగెత్తారు. కొంత మంది గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంటే, మరి కొంతమంది కిటికీలో నుంచి చూస్తున్నారు. నోటి నిండా కుక్కోని, చేతిలో నేపకిన్లతో నిలబడ్డారు.
తన డప్పు మోత అందరూ విన్నారని నిర్థారించుకున్న తరువాత అతను డప్పు కొట్టడం ఆపి తన గొంతు సవరించుకోని, వాక్యంలో ఎక్కడ విరామమివ్వాలో తెలియని వాడిలా చెప్పడం మొదలుపెట్టాడు.
“గోడర్విల్లా ప్రజలారా, మరీ ముఖ్యంగా ఒక్కడికి వచ్చిన పొరుగు ప్రజలారా. ఈ రోజు ఉదయం తొమ్మిది, పది గంటల మధ్య బూజ్విల్లా రోడ్ దగ్గర నల్లటి లెదర్ తో చేసిన పాకెట్ బుక్ పోయింది. అందులో ఐదు వందల ఫ్రాంకులు, ముఖ్యమైన బిజినెస్ కాగితాలు వున్నాయి. అది ఎవరికైనా దొరికినట్లైతే దానిని మేయర్ ఆఫీస్ కి చేర్చవలసిందిగా వారి తరఫున ప్రకటిస్తున్నాను. అలా తెచ్చిచ్చిన వారికి ఇరవై ఫ్రాంకుల బహుమానం కూడా వుందహో...” అంటూ అరిచాడు.
దండోరా వేసినతను వెళ్ళిపోయాడు. మరోసారి దూరం నుంచి అతను కొట్టే డప్పు చప్పుడుని, వినపడీ వినపడని అతని మాటల్ని శ్రద్ధగా విన్నారు. ఆ తరువాత ఆ సంఘటన గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. పోగొట్టుకున్న వ్యక్తికి పాకెట్ బుక్ దొరుకుతుందా దొరకదా అని పందాలు వేసుకున్నారు.
అంతా భోజనాలు పూర్తి చేసి కాఫీలు తాగుతున్నారు. సరిగ్గా అప్పుడే సైన్యాధికారి ఒకతను వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు.
“బ్రూటూ నుంచి వచ్చిన మాస్టర్ ఉష్కార్న్ ఇక్కడ వున్నాడా?” అని అడిగాడతను.
”నేనే, నేనే. ఇక్కడే వున్నాను” అంటూ టేబుల్ చివర కూర్చోని వున్న ఉష్కార్న్ లేచి నిలబడ్డాడు. ఆ తరువాత ఆ అధికారి వెనుకే నడుచుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు..
అతను అక్కడికి వెళ్ళేసరికి మేయరుగారు తమ సింహాసనం లాంటి కుర్చీ మీద కూచోని ఎదురుచూస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తానికి ఆయనే నోటరీ. బాగా ఎత్తుగా, ధృఢంగా వుంటాడు. మాట గంభీరంగా వుంటుంది.
“మాస్టర్ ఉష్కార్న్ ఈ రోజు ఉదయం బూజ్విల్లా రోడ్ లో మన్నెవైల్ నుంచి వచ్చిన మాస్టర్ ఉల్బ్రైక్ పాకెట్ బుక్ నువ్వు తీశావని నీ మీద ఫిర్యాదు అందింది” అన్నాడాయన.
ఏ పాపం ఎరుగని ఆ పల్లెటూరి మనిషి ఆశ్చర్యంగానూ, భయంగానూ మేయర్ వైపు చూశాడు. ఎందుకో తెలియదు కానీ అప్పటికే ఏదో అనుమానం అతన్ని వెంటాడుతోంది,
“నేనా? నేను ఆ పాకెట్ బుక్ తీశానా?” అన్నాడు.
“అవును, నువ్వే”
“ప్రమాణపూర్తిగా నాకేమీ తెలియదు”
“నువ్వు తీసుకుంటుండగా చూసినవాళ్ళు వున్నారు”
“చూశారా? నన్నా? ఎవరా చూసినవాళ్ళు?”
“గుర్రాలకు జీనులు తయారు చేసే మాలోందా”
అతనికి జరిగింది గుర్తుకొచ్చింది. విషయం అర్థం అయ్యింది. కోపంతో ముఖం ఎర్రబడింది.
“చూశాడట చూశాడు. వాడో పెద్ద వెధవ. నేను ఇదుగో, ఈ దారపు ముక్క తీసుకుంటుంటే చూశాడు దొరా” అంటూ తన జేబుల్లో చేతిని పెట్టి వెతికి చివరకు దారాన్ని తీసి చూపించాడు. మేయర్ అపనమ్మకంగా తల ఊపాడు
“నువ్వు ఎన్ని చెప్పినా నమ్మించలేవు ఉష్కార్న్. మాలోందా నమ్మదగ్గ వ్యక్తి. అలాంటి మనిషి ఒక దారప్పోగుని చూసి పాకెట్ బుక్ అనుకున్నాడు అంటే నమ్మమంటావా?”
ఉష్కార్న్ కోపం కట్టలు తెంచుకుంది. చేతిని ఒక్క ఊపుతో పైకెత్తి బలంగా భూమి మీద ఒట్టు పెట్టినట్లు కొట్టాడు.
“నిజం ఏమిటో దేవుడికి తెలుసు. దొరవారూ... నేను నా ప్రాణం మీద ఒట్టుపెడుతున్నాను. నాకేం తెలియదు” అన్నాడు. మేయర్ తన ధోరణిలోనే వున్నాడు.
“నువ్వు ఆ పుస్తకం తీసుకున్న తరువాత దానిలో నుంచి డబ్బులు ఏమైనా అక్కడ పడ్డాయేమోనని చుట్టుపక్కల మొత్తం వెతికావట కదా?” అన్నాడు.
ఇతని కడుపులో భయం మొదలై అది అక్కడ అరగకపోగా గొంతు దాకా వచ్చి మాటలు రానివ్వకుండా చేస్తోంది.
“ఎవరు మీతో చెప్పినవాళ్ళు? అసలు ఎలా చెప్పారండీ ఆ అబద్ధాలు... ఏ పాపం తెలియని వాణ్ణి! నా గురించి అలా ఎలా చెప్పారు?”
అతని వాదన బూడిదలో పోసిన పన్నీరైంది. ఎవరూ అతన్ని నమ్మలేదు. మాలోందాతో వాదన చాలా సేపు సాగింది. అతను తన వాగ్మూలం విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు గంట సేపు వాదించుకున్నారు. ఉష్కార్నే స్వయంగా కోరడంతో అతన్ని తనిఖీ కూడా చేశారు. ఏమీ దొరకలేదు.
చివరికి ఏం చేయాలో తోచక, మేయరుగారు ఉష్కార్న్ ని అక్కడ్నుంచి పంపించేశారు. ఈ విషయాన్ని పై అధికారులకి విన్నవిస్తాననీ, వారి ఆజ్ఞ ఎలా అయితే అలా జరుగుతుందని మాత్రం చెప్పాడు.
ఈ వార్త గుప్పుమంది. మేయరు ఆఫీసు నుంచి ఉష్కార్న్ బయటికి వచ్చేసరికి చాలా మంది అతని చుట్టూ మూగారు. నిజంగా సానుభూతో లేక వెటకారమో తెలియదు కానీ అందరూ ఎంతో ఉత్సుకతతో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రశ్నల్లో అతనికి మాత్రం ఏ వ్యంగ్యమూ కనిపించలేదు. అందువల్ల తన దారం కథ మొత్తం వివరంగా చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. పడీ పడీ నవ్వారు.
అతను ముందుకు సాగిపోయాడు. దారి పొడుగునా ఎవరో ఒకరు అతని సంగతి గుచ్చి గుచ్చి అడిగారు. అతను కూడా కొంతమంది పరిచయస్థులకి వాళ్ళు అడగకపోయినా తన కథ మొత్తం చెప్పాడు. తన వాదన మొత్తం వినిపించుకున్నాడు. జేబులు తిరగేసి చూపించి, తనకే పాపం తెలియదని నిరూపించుకోవాలని చూశాడు.
“అమ్మ ముసలోడా! గట్టోడివే” అన్నారు కొంతమంది.
తన మాట నమ్మడంలేదన్న కోపంతో, కసితో మళ్ళీ మళ్ళీ తన కథని రోజంతా చెప్తూనే వున్నాడు.
సంధ్య గూట్లో పడింది. ఇంక అంతా ఇళ్ళకు వెళ్ళిపోయే సమయం. తన ఊరివాళ్ళు ముగ్గురు మిగిలారు. వారితో కలిసి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి దారం దొరికిన ప్రదేశం చూపించాడు. దారి పొడుగునా తన కథని మళ్ళీ మళ్ళీ వినిపించాడు.
బ్రూటూ చేరిన తరువాత ప్రతి ఇల్లూ తిరిగి అందరికీ తన కథ చెప్పాడు కానీ ఎవరూ అతన్ని నమ్మలేదు. రాత్రంతా ఆలోచిస్తూ గడిపాడు.
ఆ మర్నాడు మధ్యాన్నం సమయానికి ఇమోవిల్లాలో మాస్టర్ బ్రిటోన్ అనే భూస్వామి దగ్గర తోట పని చేసే మారీస్ పామేల్ అనే పాలేరు ఉల్ర్బైక్ పాకెట్ బుక్ తిరిగి ఇచ్చాడట. ఆ పుస్తకం తనకు ముందురోజు రోడ్డు మీద దొరికిందనీ, తనకి చదువు రాకపోవటం వల్ల ఆ పుస్తకాన్ని ఏం చెయ్యాలో తలియక ఇంటికి తీసుకెళ్ళి తన యజమానికి చూపించానని చెప్పాడు. ఆ వార్త సుడిగాలిగా తిరిగింది. మాస్టర్ ఉష్కార్న్ కి తెలియజేశారు. అతను తన కథ మళ్ళీ మళ్ళీ చెప్పసాగాడు. ఇప్పుడు ఆ కథలో ముగింపు అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పినట్లుగా అనిపించింది. తన మాటే నిజం అని తెలిసిపోయింది. తను గెలిచాడు!!
“నన్ను బాధపెట్టింది దొంగతనం కాదు! నేను అబద్ధాలాడానన్నారు చూడండి అది అన్నింటికన్నా అవమానకరం. అంత కన్నా దారుణం వుంటుందా” అన్నాడతను అందరితో.
రోజూ తన కథని సాహస గాధలా అందరికీ చెప్పుకున్నాడు. దారిన పోయేవారిని ఆపి మరీ చెప్పాడు. క్యాబరేలో తాగుబోతులకు చెప్పాడు. ఆదివారం చర్చి నుంచి బయటకు వచ్చే జనానికి బలవంతంగా చెప్పాడు. ఎవరో తెలియని అపరిచితులకు కూడా చెప్పడం మొదలుపెట్టాడు. అతనికేదో భారం దిగిపోయినట్లు వుంది. కానీ క్రమంగా ఏదో తేడా వున్నట్లుగా అనిపించసాగింది. అదేమిటో అర్థం కాలేదు. అతను చెప్పే విషయాన్ని అందరూ వింటున్నారు కానీ వాళ్ళకి అదేదో హాస్య కథలాగా అనిపిస్తున్నట్లుంది. అతను చెప్పే విషయాన్ని నమ్ముతున్నారని నమ్మకం లేదు. కథ చెప్పి అటు తిరగగానే అతని వెనుకే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ తరువాత వచ్చిన మంగళవారం గోడర్విల్లా సంతకి మళ్ళీ వెళ్ళాడు ఉష్కార్న్. ఈసారి కేవలం తన కథ చెప్పుకోడానికే వెళ్ళాడు.
మాలోందా తన షాపు గుమ్మం ముందు నిలబడి ఉష్కార్న్ కనపడగానే గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. కారణం? తెలియదు.
మరో గ్రామానికి చెందిన ఓ రైతు కనపడితే అతనికి తన కథ చెప్పబోయాడు. కానీ అతను అవకాశం ఇవ్వలేదు. ఉష్కార్న్ కడుపులో చిన్నగా గుద్ది – “మొత్తానికి నువ్వు జగత్కిలాడివి” అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
మాస్టర్ ఉష్కార్న్ నోట మాట రాక నిలబడిపోయాడు. అసహనం ఎక్కువైంది. అతను ఎందుకు తనని “కిలాడి” అన్నాడు?
జ్యోదా హోటల్లో కూచున్నాక మళ్ళీ తన కథ వివరించే ప్రయత్నం చేశాడు. గుర్రాల వ్యాపారం చేసే మోంటీవిల్లా గ్రామస్తుడు ఒకతను గట్టిగా అరిచాడు – “రేయ్ ముసలోడా... నీ సంగతి, నీ దారం సంగతి మాకు బాగా అర్థం అయ్యిందిలేరా” అన్నాడు.
ఉష్కార్న్ తడబడ్డాడు. “అదీ.. ఆ పాకెట్ బుక్ తరువాత దొరికింది కదా” అన్నాడు.
“చాల్లే ఆపరా నీ కతలు. దొరికేది ఒకడికి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంకొకళ్ళు. మీరు తప్ప ఇంక తెలివైనవాళ్ళే లేనట్టు..” అంటూ నవ్వాడతను.
పాపం ఉష్కార్న్ కి ఏం చెప్పాలో తెలియలేదు. ఆలోచిస్తే అర్థం అయ్యింది. ఆ పాకెట్ బుక్ తనే తీసుకున్నాడని అంతా నమ్ముతున్నారు. తిరిగి ఇచ్చింది తన తోడుదొంగ అని వాళ్ళ నమ్మకం. కాదని శతవిధాల వాదించాడు. అంతా నవ్వారే తప్ప నమ్మలేదు. భోజనం చెయ్యబుద్ధి కాలేదు. అందరూ ఎగతాళి చేస్తుంటే భరించలేక అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
నిరుత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. మనసంతా చికాకుగా, గందరగోళంగా తయారంది. కోపం, అసహనం గొంతుకు అడ్డంపడ్డట్టుగా అనిపించసాగింది. ఆలోచిస్తే ఒక విషయం అతనికి అర్థం అయ్యింది. తాను దొంగతనం చెయ్యాలంటే నిముషం పట్టదు. వాళ్ళు తనని వేలెత్తి చూపడం అటుంచి, తనే ఎంత తెలివిగా దొంగతనం చేశాడో అందరికీ చెప్పుకునేవాడు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తను ఏ తప్పూ చేయలేదని నిరూపించడం దాదాపు అసాధ్యంలా కనపడుతోంది. అనుమానం అనే భూతం చేసిన అన్యాయానికి తాను బలి అయిన భావన అతని గుండెల్ని పట్టేసింది.
ఆ రోజు నుంచి ప్రతి మనిషికీ ఈ కథ చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పిన ప్రతిసారి వివరాలు పెంచసాగాడు. అదనంగా తన అమాయకత్వాన్ని నిరూపించే సాక్ష్యాలను జోడించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకి అతను చేసే ప్రమాణాల తీవ్రత వాటి పవిత్రత పెరగసాగింది. వాదనలో బలం పెంచుకుంటూ, అందరికీ చెప్పుకోసాగాడు. ఇంట్లో వంటరిగా వున్నప్పుడు కూడా ఇదే ఆలోచన. తాను నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలి? ఆ దారం ముక్క కథ అతని మనసులో చిక్కుపడి వుండిపోయింది. అతని వాదనలో తర్కం పెరిగేకొద్దీ, విన్నవారికి అది అబద్ధం అన్న నమ్మకం మరింత పెరగసాగింది.
“అబద్ధాలకి అరవైఆరు సాక్ష్యాలు” అతని వెనుక అనుకునేవారు. అయినా అతనికి అవి తగిలేవి. వాటిని తిప్పికొట్టాలని విశ్వప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నంలో అలసిపోయేవాడు. గంటలు, రోజులు గడిపేశాడు. అప్పుడప్పుడు కొంతమంది అతన్ని పిలిచి హాస్యానికి “దారప్పోగు కథ చెప్పు” అని చెప్పించుకుని నవ్వుకునేవాళ్ళు. ఇవన్నీ అనుభవించి, భరించి అతని మనస్సు వికలమైపోయింది.
డిసెంబరులో మంచానపడ్డాడు. జనవరి నెలాఖరులో చనిపోయాడు. చనిపోయే ముందు మాయ కప్పేసినా మాటలు మారలేదు.
“చిన్న దారప్పోగు... ఇదిగో.. చూడండి.. మీరే చూడండి... చాలా చిన్న దారం ముక్క...” అంటూనే పోయాడు.
<***>

అనువాదకుని మాట
ఈ కథతో “మొపాస కథలు” శీర్షిక ముగుస్తోంది.
మొపాస ఒక మాయాజాలం. అతని కథలు ఎన్ని చదివినా ఇంకా చదవాలనిపిస్తూనే వుంటుంది. వస్తు వైవిధ్యం, శిల్ప విన్యాసం నూట పాతికేళ్ళ క్రితమే సాధించిన కథలవి. శ్రీ ధనికొండ హనుమంతరావు, శ్రీ మహీధర జగన్మోహనరావు వంటివారు ఎంతో మంది మొపాసని అనువదించారు. మళ్ళీ అనువాదానికి పూనుకోవడం సాహసమే. అయినా అతని రచనలని పూర్తిగా అనుభవించాలన్న కోరికతో ఈ అనువాదాలకు పూనుకున్నాను. ఆ అనుభవాన్ని అభినందనలతో ద్విగుణం చేసిన కౌముది పాఠకులకు, నా బ్లాగ్ పాఠకులకు అభివందనాలు. రెండు సంవత్సరాలు మొపాసతో ప్రయాణించే అవకాశాన్ని ఇచ్చిన “కిరణ్ ప్రభ” గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

అరిపిరాల సత్యప్రసాద్ 

మొపాస కథలు: ఒక సాయం చేస్తావా?

మొన్నామధ్య ఏవో సంగతులు మట్లాడుతుండగా పాడు పెట్టిన భవంతుల ప్రస్తావన వచ్చింది. ఆ రోజు కొంతమంది పాత స్నేహితులమంతా గోపాలరావుగారి బంగ్లాలో చేరి కబుర్లు చెప్పుకుంటూ వున్నాం. అందరూ ఎవరికి తెలిసిన పాత భవంతుల కథలు వారు చెప్పాలనీ, అదీ నిజంగా జరిగినవి చెప్పాలని ఎవరో అన్నారు. సరిగ్గా అప్పుడే సీతాపతిరావుగారు ఈ కథ చెప్పారు. ఎనభై రెండేళ్ళ వయసు ఆయనది. మోకాళ్ళ నొప్పుల వల్ల కష్టపడుతూ లేచి, చేతిని బల్లమీద ఆనించి, వణుకుతున్న కంఠంతో చెప్పడం ప్రారంభించడాయన.

"
నాకు చిత్రమైన సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఆ సంఘటన జరిగి ఇప్పటికి యాభై ఆరేళ్ళైనా, నెలలో ఒకసారైనా అది పీడకలలా గుర్తుకువస్తూనే వుంటుంది. ఇప్పటికీ పెద్దగా శబ్దం అయితే అదిరిపడతాను. చీకట్లో మసకగా ఏ వస్తువు కనపడ్డా అక్కడి నుంచి పరుగెత్తి పారిపోవాలనిపిస్తుంటుంది. అసలు చీకటంటేనే ఒకలాంటి దడ నా గుండెల్లో మిగిల్చిన సంఘటన అది. ఇలాంటి విషయాన్ని ఒకప్పుడు చెప్పుకోడానికి సిగ్గుపడేవాణ్ణి. కానీ ఈ వయసులో చెప్పుకోడానికి అభ్యంతరం ఏముంటుంది?. కాకపోతే అప్పట్లో వేసిన భయం వల్ల నాకు అంతు తెలియని అసహనం కలిగింది. అందువల్ల ఎవరికీ చెప్పుకోలేదు. ఇప్పుడు మీకందరికీ జరిగింది జరిగినట్లు చెప్తాను. సావధానంగా వినండి.

1827
జులైలో రాజుపాలంలో అలా రోడ్డు వెంట నడుస్తూ వుండగా ఒక వ్యక్తి తారసపడ్డాడు. చూడగానే ఎవరో గుర్తుకురాలేదు కానీ ఎక్కడో పరిచయం వున్న ముఖం లానే తొచింది. అందువల్ల నేను ఆగి అతన్ని పరికించి చూశాను. అతను కూడా ఆగిపోయి, నన్ను గుర్తుపట్టినట్లు నా వైపు చెయ్యి చాపాడు.

అప్పుడు గుర్తించానతన్ని. అతను నా చిన్ననాటి స్నేహితుడు. దాదాపు అయిదేళ్ళైంది అప్పటికతన్ని చూసి. అయిదేళ్ళలో అర్థ శతాబ్దం వయసు మీద పడ్డట్లు కనిపించాడు. జుట్టంతా తెల్లబడి, ఏదో భారం మోసి అలిసిపోయినవాడిలా ముందుకు వంగి నడుస్తున్నాడు. అతనికి నా కళ్ళలో ప్రశ్నార్థకాలు కనిపించాయనుకుంటాను. అందుకే అతను అలా తయారవడానికీ, అతని జీవితం నాశనం కావడానికి కారణాన్నినాకు వివరించాడు.

ఒకమ్మాయి ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. సంవత్సరం పాటు సంతోషంగానే వున్నారు కానీ ఆ తరువాత ఆమె ఏదో హృద్రోగంతో కన్నుమూసింది. దాంతో వాడు ఒక్కసారిగా పిచ్చివాడైపోయాడు. ఆమె అంత్యక్రియలు జరిపిన రోజే ఆ వూరినీ, ఇంటిని వదిలేసి సొంతవూరైన రాజుపాలం వచ్చి అక్కడే ఒంటరిగా బతుకుతున్నాడట. బాధవల్లతేనేమీ, జీవితం పట్ల అనాసక్తతవల్లైతేనేమీ ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట.

"
అనుకోకుండా కలిశావు కాబట్టి నిన్నో సహాయం అడగాలనుకుంటున్నాను. ఏమనుకోకు. నువ్వు ఒక్కసారి రాజమండ్రిలో వున్న నా పాతింటికి వెళ్ళిరావాలి. అక్కడ నా బెడ్‌రూంలో  ఒక బల్ల సొరుగులో కొన్ని కాగితాలు వున్నాయి. నాకు అత్యవసరంగా కావాల్సిన కాగితాలు.. అవి తెచ్చి పెట్టాలి. నా నౌకర్నో మరొకర్నో పంపించలేను. చాలా రహస్యమైన పత్రాలవి. ఇక నేనంటావా? ఆ ఇంటితో రుణం అప్పుడే తీరిపోయింది. ఆమె లేని ఇంట్లో నేను అడుగుపెట్టలేను. నీకు ఇంటి తాళం, సొరుగు తాళం ఇస్తాను. అక్కడ ఒక వాచ్‌మెన్ కూడా వున్నాడు. బంగ్లా తెరవమని అతనికి ఉత్తరం రాసి నీ చేతిలో పెడతాను. రేపు ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ కి ఇంటికి వచ్చావంటే అన్ని ఏర్పాట్లు చేసి మరీ పంపిస్తాను."

అతను అడిగిన ఆ చిన్న సహాయం చెయ్యడంలో నష్టం ఏమీ లాదని భావించాను నేను. అందుకే అతను చెప్పినదానికి ఒప్పుకున్నాను. నిజానికి వాళ్ళ వూరు అక్కడికి నాలుగైదు మైళ్ళ దూరంలో వుంది. అప్పట్లో నా దగ్గర వున్న గుర్రం మీద వెళ్ళానంటే ఒక గంట ప్రయాణం.

వాడు చెప్పినట్లే మర్నాడు పదిగంటలకి వాడితో కలిసి టిఫిన్ చేసి వివరాలు అవీ తెలుసుకున్నాను. ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లడలేదు వాడు. నాతో కలిసిన తరువాత గుర్తుకొచ్చిన ఇంటినీ, కరిగిపోయిన తన సంతొషాన్ని తల్చుకున్నాడు. ఒంటరిబతుకుని తిట్టుకున్నాడు. అంతుతెలియని మానసిక సంఘర్షణ గురించి చెప్పాడు.

ఆ తరువాత వివరంగా ఏం చెయ్యాలో చెప్పాడు. చాలా చిన్న పని అది. అతను చెప్పిన బల్ల కుడి వైపు పైన వున్న సొరుగులోంచి రెండు కవర్లు, ఒక కట్ట కాగితాలు తీసుకొచ్చి వాడి చేతిలొ పెట్టాలి. అంతే!

"
వాటిల్లో ఏముందో చూడకూడదు మరి.." అన్నాడు.

వాడి అనుమానానికి నాకు బాధనిపించింది. అదే విషయాన్ని కస్త కటువుగా చెప్పాను. వాడు తడబడ్డాడు.

"
క్షమించరా.. నా పరిస్థితి అర్థం చేసుకో..." అన్నాడు. వాడి కళ్ళలో నీళ్ళు. ఇంకేమీ చర్చించలేదు నేను.

మధాహ్నం ఒంటిగంటప్పుడు వాడు చెప్పిన పని చెయ్యడానికి బయల్దేరాను.

ఆ రోజు వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. నా గుర్రం హుషారుగా ముందుకు సాగుతుంటే నేను లయబద్ధంగా వచ్చే గాలిపాట వింటూవుండిపోయాను. నా మొలలో వున్న కత్తి నా బూట్లకు తగులుతూ శబ్దం చేస్తూ వుంటే అది కూడా సాంగీతంలాగే వినిపించింది నాకు. అడవిలాంటి చెట్ల గుండా గుర్రం నడుస్తుంటే చేట్ల కొమ్మలు నా ముఖాన్ని తాకుతున్నాయి. నేను సరగాగా చెట్ల ఆకులను పళ్ళతొ పట్టి కోస్తూ, నములుతూ ఆ ప్రయాణాన్ని, అంతటి ఆహ్లాదకరమైన రోజుని అనుభవిస్తూ, ఆనందిస్తూ గడిపాను.

వాడి భవంతిని చేరుకోగానే వాచ్‌మెన్‌కి ఇవ్వమని వాడు రాసిచ్చిన కవర్ బయటకు తీశాను. అంతకు ముందు గమనించలేదు కానీ, ఆ కవరు అన్ని వైపులా అంటించివుంది. ఒక్కసారిగా కోపం పుట్టుకొచ్చింది. పోనీ ఆ పని అక్కడే వదిలేసి వెనక్కి పోదామని అనుకున్నాను కానీ, మర్యాదకాదని ఆగిపోయాను. వాడేదో బాధల్లో వున్నాడు - యధాలాపంగా అతికించి వుంటాడని సర్ది చెప్పుకోని ముందుకు కదిలాను.

అప్పటికి నాలుగేళ్ళే అయినా దాదాపు ఇరవై ఏళ్ళు పాడు పెట్టినంతగా శిధిలమై వుందా భవనం. సింహద్వారం దగ్గర వున్న ఇనుపగేటు తెరిచే వుంది. పైగా వూడి పడిపోయేందుకు సిద్ధంగా వుంది. లోపలికి దారితీసే నాపరాళ్ళ బండల మధ్యలోనుంచి మొక్కలు మొలిచి దారి కనపడకుండా చేస్తున్నాయి.

నేను తలుపు తీసిన శబ్దం వినపడిందేమో వాచ్‌మెన్ బయటికి వచ్చి ఆశ్చర్యంగా చూశాడు. నేను ఇచ్చిన వుత్తరాన్ని అనుమానంగా అందుకోని ఒకటికి రెండు సార్లు చదివాడు. మధ్య మధ్యలో నా వైపు చూసి రెండో సారి చదవటం పూర్తి చేసి ఆ కాగితాన్ని తన జేబులో పెట్టుకున్నాడు.

"అయితే తమరెందుకొచ్చినట్లు?" అన్నాడు చివరికి.
"
ఏం? అందులో మీ అయ్యగారు రాయలేదా? నేను లొపలికి వెళ్ళాలి" అని క్లుప్తంగా చెప్పాను. అతను బిత్తరపోయాడు.
"
మీరు లొపలికి... అంటే ఆమె గదిలోకి వెళ్తారా?" అడిగాడు. నా సహనం నశించింది.
"
ఏరా నా మీదే అనుమానమా? ప్రశ్నలడుగుతున్నావ్?" అన్నాను. వాడు తడబడ్డాడు.
"
కాదు బాబుగారూ.. ఇదీ.. ఈ బంగ్లా.. ఆ చావు తరువాత తెరవలేదు. ఒక్క అయిదు నిముషాలు వున్నారంటే నేను లోపలి పోయి మొత్తం ఒకసారి చూసి.." అతని మాటల్ని అక్కడే తుంచేశాను నేను.

"
ఏరా ఆటలాడుతున్నావా? తాళం నా దగ్గర వుంటే నువ్వు లొపలికి ఎట్లా వెళ్తావు?" అన్నాను. అతను ఆ పైన అభ్యంతరపెట్టలేదు.

"అయితే పదండి బాబు తమరికి దారి చూపిస్తాను" అన్నాడు.

"నాకు పైగదికి వెళ్ళే మెట్లు ఎక్కడున్నాయో చూపించు చాలు.. నేను వెళ్ళగలను"

"చూపిస్తాను బాబూ... కాకపోతే.." అంటూ ఇంకేదో చెప్పబోయాడు. నా ఓపిక పూర్తిగా నశించి వాణ్ణి ఒక్క తోపు తోసి లోపలికి వెళ్ళిపోయాను.

ఆ ఇంటి మొదట్లో వున్న రెండు గదుల్ని, ఒక వంటగదిని వాచ్‌మెన్ కుటుంబం వాడుతునట్లుంది. వాటిని దాటుకోని మధ్యలో వున్న పెద్ద హాలులోకి చేరుకున్నాను. అక్కడున్న మెట్లు ఎక్కి పైన వున్న గదిలోకి వెళ్ళాలని నా మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ మెట్లేక్కి వాడు చెప్పిన గదిలోకి సులభంగానే ప్రవేశించాను.

లోపల మొత్తం చీకటిగా వుండటంతో మొదట ఏమీ అర్థం కాలేదు. పైగా ఎన్నాళ్ళుగానో మూసి వుండటం వల్ల వచ్చే ఒకరకమైన వాసనకి కొంత వెనకడుగు వేశాను. కాస్త కళ్ళు కుదుటపడగానే ఆ గదిలో వున్న మంచం, దాని మీద వున్న పరుపు, దిండు అస్పష్టంగా కనిపించాయి. అంతా చిందరవందరగా వుంది. పరుపు మీద పక్కగుడ్డ కూడా పరిచిలేదు. దిండు మీద మాత్రం అప్పుడే ఎవరో పడుకున్నట్టుగా గుంతపడి వుంది. కుర్చీలు ఎక్కడ పడితే అక్కడ పడివున్నాయి. పక్కన అరమరలా కనిపిస్తున్న చోట తలుపు సగం మూసినట్లు అనిపించింది.

అన్నింటికన్నా ముందు కిటికీల దగ్గరకు వెళ్ళి, వాటిని తెరిస్తే కొంత వెలుగు వస్తుందేమో అని ప్రయత్నం చేశాను. తుప్పు పట్టిన తలుపులు ఒక పట్టాన తెరుచుకోలేదు. నా కత్తితో వాటిని పగులగొడదామని కూడా చూశాను కాని ఫలితం శూన్యం. నా ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో చిరాకనిపించింది. పైగా అప్పటికే నా కళ్ళు ఆ మసక చీకటికి అలవాటుపడటంతో, వెలుతురు కోసం ప్రయత్నం ఆపి నేను నా స్నేహితుడు చెప్పిన పని చెయ్యడానికి బల్లదగ్గరకు నడిచాను.

అక్కడే వున్న ఒక కుర్చీలో కూర్చోని బల్ల కుడివైపు పైన వున్న సొరుగు తెరిచాను. దాన్నిండా ఏవేవో కాగితాలు వస్తువులు వున్నాయి. అయితే నాకు కావాల్సిన వస్తువులు ఎలా గుర్తించాలో తెలుసుకాబట్టి వాటికోసం వెతకసాగాను.

అలా కనిపించీ కంపించని వెలుగులో కష్టపడి వెతుకుతున్న హడావిడిలో వెనుకగా ఏదో చప్పుడు అయినా పట్టించుకోలేదు. బహుశా కిటికీకి వున్న పరదా వూగుతూ చేసిన చప్పుడేమో అని అనుకున్నాను. అయితే మరికొద్ది సేపటికే అర్థం కాని ఆ శాబ్దమేదో మళ్ళీ వినిపించడంతో కొద్దిగా అనుమానించాను. అయితే నా అనుమానం, భయం నా గౌరవానికే భగం అనిపించి వెనక్కి చూడకూడదనుకున్నాను. అప్పటికే నాకు కావాల్సిన రెండో కవర్ కూడా దొరికింది. సరిగ్గా నేను అందుకోవాల్సిన కాగితాల కట్ట మీద చెయ్యి వేశానో లేదో అప్పుడే నా వెనుక, నా భుజాలకి కొంచెం పైన ఒక బాధాకరమైన నిట్టూర్పు వినపడి అదిరిపడ్డాను. ఒక్క ఉదుటున కుర్చీలో నుంచి దూకి, అవతల నేల మీద పడుతూనే చేతిని నా కత్తి ఒరమీద వేశాను. ఆ కత్తి వుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే భయంతో అక్కడినుంచి పరుగుతీసేవాణ్ణి.

అక్కడ.. ఒక పొడవాటి అమ్మాయి.. తెల్లటి చీరలో... నేను కూర్చున్న కుర్చీ వెనకే నిలబడి నేను చేస్తున్న పని చూస్తూ వుంది.

నా కాళ్ళు చేతుల్లో పుట్టిన వణుకుకి తూలిపడబోయాను. ఆ క్షణం నేను అనుభవించిన భయం, స్వయంగా అనుభవిస్తే తప్ప ఎంత చెప్పినా అర్థంకాదేమో. మెదడు మొద్దుబారిపోయి, గుండెల్లో దడ చెవులకు వినపడుతూ శరీరమంతా దూది పింజెలాగా మారిపొయినట్లు అనిపించింది.

అప్పటిదాకా నాకు దయ్యాలంటే ఎలాంటి నమ్మకమూ లేదు. అలాంటివాణ్ణి మొదటిసరి ప్రత్యక్ష అనుభవంతో గడగడాలాడిపొయాను. ఆ కొన్ని క్షణాలు అనుభవించిన భయం, నా జీవితం మొత్తం మీద అనుభవించిన భయాలన్నింటికన్నా ఎక్కువ. ఆ పిల్ల నాతో మాట్లాడకపోతే అక్కడికక్కడే చచ్చిపోయేవాణ్ణేమో. అవును, మాట్లాడింది. సన్నగా పీలగా వున్న స్వరంలో, బాధ ధ్వనిస్తున్న గొంతుతో మాట్లాడింది. ఆ మాటలతో నా భయం నరాల్లోకి పారిపోయింది. అక్కడికేదో ధైర్యం వచ్చిందని కాదు నేను చెప్పేది. అప్పటికీ నేను ఏం చేస్తున్నానో తెలియని భీతావస్థలో వున్నాను. కాకపోతే లేని ధైర్యం ఏదో అరువు తెచ్చుకోని ముఖం స్థిరంగా వుంచే ప్రయత్నం చేశాను.

"మీరు నాకొక సహాయం చెయ్యగలరా?" అంది ఆ పిల్ల.

నాకు సమాధానం చెప్పాలని అనిపించింది. అయితే నొట్లో నుంచి ఒక్క మాట కూడా పెగలని పరిస్థితి. ప్రయత్నిస్తే నోట్లో నుంచి ఏవో వింత శబ్దాలు మాత్రం వచ్చాయి. ఆమె అదేమీ పట్టించుకోనట్లు చెప్పుకుపోతోంది -

"కాదనకండి మీరు సహాయం చెయ్యాలి. నన్ను కాపాడలి. నన్ను బాగుచెయ్యాలి. ఎంత బాధ అనుభవిస్తున్నానో తెలుసా? అబ్బ... ఎంత బాధో ఈ బాధ.." అలా అంటూనే వచ్చి నేను ఇంతకు ముందు కూర్చున్న కుర్చీలో కూర్చుంది. నేను మాత్రం అలాగే చూస్తూ వుండిపొయాను.

"చేస్తారు కదూ?"

తలాడించాను మాట రాక. అంతే ఆమె తన చేతిలో ఒక చెక్క దువ్వెనని తీసుకోని నా వైపు చాచి సన్నగా గొణిగింది.
"
నా తల దువ్వుతారా? దువ్వుతారా? చూడండి ఎలా చిక్కు పడిపోయిందో. నొప్పి కూడా పెడుతోంది. కొంచెం చిక్కు తీస్తారా? తల దువ్వుతారా?"

విరబోసుకోని వున్న ఆమె జుట్టు వైపు చూశాను. చాలా దట్టమైన పొడుగైన నల్లటి జుట్టు. ఆమె కూర్చున్న కుర్చీ మీదుగా కిందకు పడి నేలని తాకుతోంది. ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు. వణుకుతున్న చేతుల్తో ఆమె చేతిలో దువ్వెన ఎందుకు అందుకున్నానో తెలియదు. ఎందుకు ఆమె నల్లటి జుట్టుని నా చేతుల్లోకి తీసుకోని ఆ స్పర్శకి గడగడలాడుతూ, పాములు పట్టుకున్నంత భయంతో ఎందుకు నిలబడ్డానో అసలే తెలియదు. ఇప్పుడు మీరు అదే ప్రశ్న అడిగినా సమాధానం చెప్పలేను.

ఇదుగో ఇప్పటికీ ఆ స్పర్శ గుర్తుకు వస్తే నా చేతులు ఇలా గడగడా వణుకుతుంటాయి.

ఆమె తల దువ్వాను. చిక్కు తీశాను. సుతారంగా జారిపోయే జుట్టు అది. అలాగే దువ్వాను. పాయలు తీసి జడ అల్లాను. దాన్ని చుట్టి ముడి పెట్టాను.

అంతా అయిపోగానే అమె గట్టిగా శ్వాస వదిలి, తల చూసుకోని మురిసిపోయింది. తల వంచి "ధన్యవాదాలు" అంటూ నా చేతిలో దువ్వెనని ఒక్క ఉదుటున లాక్కోని ఇంతకు ముందు తలుపు వున్నట్లు అనిపించిన వైపు పరుగెత్తింది.

నేను ఒక్కణ్ణే మిగిలాను..! ఒక్కసారి పీడకల నుంచి అదిరిపడి లేచినవాడికి మల్లే అలాగే నిలబడిపొయాను. ఎప్పటికోకాని ఈ లోకంలోకి రాలేదు. ఒక్కసారి కిటికీలవైపు పరుగెత్తి బలమంతా ఉపయోగించి కిటికీ తలుపు తెరిచాను. భళ్ళున వెలుతురు వచ్చిపడింది. ఆమె పరుగెత్తిన తలుపు వైపు పరుగెత్తాను. ఆ తలుపు గడియ వేసి వుంది. తెరుచుకునే అవకాశమే కనపడలేదు.

అంతే! పిచ్చి పట్టినవాడిలా ఒక్కసారి అక్కడినుంచి పరుగెత్తాలని అనిపించింది. యుద్ధానికెళ్ళే సైనికుడిలా కదిలాను. చకచకా నేను తీసుకోవాల్సిన కాగితాలు అందుకున్నాను. గదిలో నించి పరుగులు పెడుతూ బయటికి పరుగెత్తాను, ఒక్కొక్క సారికి నాలుగు మెట్లు చెప్పున గెంతుకుంటూ ఎలా వచ్చానో తెలియదు కానీ మొత్తానికి బయటికొచ్చిపడ్డాను. బయట నిలబడి వున్న గుర్రం మీదకు ఒక్క అంగలో దూకి దౌడు తీయించాను.

మళ్ళీ మా ఇంటికి వచ్చేదాకా ఎక్కడా ఆగలేదు నేను. గుర్రం జీను తీసి పనివాడి మీదకు విసిరేసి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జరిగిందంతా నెమరేసుకున్నాను. పొరపాటున ఏ చిత్త భ్రాంతికైనా లోనైయ్యానా అన్న అనుమానం కొద్దిసేపు కలిగింది. నాకు నరాల ఒత్తిడి ఉంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు చిత్రమైన విషయాలు గోచరించడం మామూలే. అందువల్ల ఇది ఖచ్చితంగా నా భ్రాంతే తప్ప నిజం కాదని నిర్థారణకి వచ్చాను. కానీ నా గదిలో కిటికీ దగ్గరకు వెళ్ళిన తరువాత, నా గుండెపైన, మిలటరీ చొక్కా పైన నల్లగా పొడుగ్గా వున్న వెంట్రుకలు కనపడ్డాయి. వణుకుతున్న చేతులతో ఒక్కొక్కటే తీసి పడేశాను.

అప్పటికే నా మానసిక స్థితి అర్థం కాని రీతిలో వుండటం వల్ల నా మిత్రుణ్ణి కలవకూడదని అనుకున్నాను. అదీకాక, కాస్త స్థిమితపడి నాకు జరిగిన అనుభవాన్ని గుర్తుచేసుకోని అది నిజమేనన్న నిర్థారణకి రావాలని అనుకున్నాను కూడా. అందుకే నౌఖర్ని పిలిపించి, వాడి ద్వారా తెచ్చిన కాగితాలు పంపిచాను. ఆ కాగితాలు అందుకోని నా మిత్రుడు నా గురించి అడిగాడట. నాకు అనారోగ్యంగా వుందనీ (వడదెబ్బ తగిలిందని చెప్పమన్నాను) తెలిసి చాలా కలవర పడ్డాడట. మర్నాడు వాణ్ణి కలిసి, జరిగిన విషయం వివరంగా మాట్లాడాలని వెళ్ళాను. ముందు రోజు రాత్రి బయటికి వెళ్ళినవాడు ఇంకా రాలేదని అక్కడివారు చెప్పారు. మళ్ళీ సాయంత్రంగా కబురుపెట్టాను. లేడనే సమాధానం వచ్చింది. మరో వారం ఎదురుచూసి ఇక లాభం లేదని పోలీసులకి తెలియబరిచాను. వారంతా తీవ్రంగా గాలింఛినా అతని జాడ దొరకలేదు. అసలు ఎలా మాయమైపోయాడో కూడా తెలియలేదు.
ఆ పాడుబడ్డ భవంతిని కూడా అణువణువూ గాలించారు కానీ అనుమానాస్పదమైనది ఏదీ కనిపించలేదన్నారు. అక్కడ ఒక అమ్మాయి వుండే అవకాశమే లేదన్నారు. ఇంకా కొంతకాలం ప్రయత్నాలు చేసి, ఫలితం లేకపోవటంతో మానుకున్నారు. యాభైఆరేళ్ళైంది ఇప్పటికి. వాళ్ళ గురించి ఇంకా ఏ సంగతీ తెలియలేదు.

మూల కథ:  Appartion

మొపాస కథలు: క్షమయా ధరిత్రి

ఆమె కుటుంబం ప్రపంచానికి దూరంగా వుండటానికి ఇష్టపడేది. ఈమె కూడా అలాగే పెరిగింది. ప్రపంచంలో ఏం జరిగినా ఆ ఇంటికి దూరంగా వుండేది. ఎప్పుడైనా రాత్రి భోజనాలప్పుడు దేశ రాజకీయల గురించి వాళ్ళు మాట్లాడుకునేవారు. అవి ఎప్పటి సంగతులంటే, వాళ్ళు చరిత్ర పుస్తకంలో విషయాలు మాట్లాడుకున్నట్లు వుండేది. నెపోలియన్ దేశంలో దిగినట్లు, పదహారో లూయీస్ మరణించినట్లు విశేషాలు చెప్పుకునేవారు.

ప్రపంచం తనపాటికి తను మారిపోయేది. ఫ్యాషన్లు మారిపోయి కొత్త కొత్తవి వచ్చేవి. కాలం పథ్థతులను మార్చివేసేది. కానీ ఆ కుటుంబంలో మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒకే సాంప్రదాయం నడిచేది. ఆ ప్రాంతంలో ఏదైనా హేయమైన సంఘటన జరిగితే ఆ వార్త ఈ ఇంటి గుమ్మం ఎక్కక ముందే చచ్చిపోయేది. ఎప్పుడైనా ఒకసారి ఆ తల్లి తండ్రి సాయంత్రం ఏకాంతంలో ఇలాంటివి మాట్లాడుకునేవాళ్ళు – అది కూడా గుసగుసగా! గోడలకు చెవులుంటాయిగా మరి!!

“ఆ రివోయిల్ కుటుంబంలో ఎంత ఘోరం జరిగిందో విన్నావా?” ఎక్కువగా చప్పుడు చెయ్యకుండా అడిగేవాడు తండ్రి.

“అవునవును. అసలు ఊహించలేము కదా! దారుణం” అనేది.

పిల్లలు విన్నా ఏమీ అర్థం అయ్యేది కాదు. అర్థం చేసుకోకుండా ఏళ్ళు గడిపేశారు. వయసుకు వచ్చారన్నమాటే కానీ కళ్ళకు, మొదళ్ళకు గంతలు కట్టుకోని పెరిగారు. జీవితంలో వాస్తవం అనే కోణం ఎలా వుంటుందో తెలియదు. మనుషులు మాట్లాడేది వేరు ఆలోచించేది వేరు ఆచరించేది వేరు అని తెలియదు. బతకాలంటే యుద్ధాలు చేయాలనీ, తుపాకీ పహారాలోనే శాంతి వుంటుందనీ, ముందు ముందు అలాంటి జీవితాలే గడపాలనీ తెలియదు. ఏ కల్మషం లేకుండా సాదాసీదాగా వుండేవాళ్ళను ప్రపంచం మోసం చెయ్యాలని చూస్తుందనీ తెలియదు. నిష్కపటంగా వుండేవాళ్ళని ఎగతాళి చేస్తారనీ, మంచివాళ్ళు వేధించబడతారనీ తెలియదు.

ఇలాంటి వాళ్ళు చాలా మంది వుంటాఋ. వాళ్ళలో కొంతమంది చివరిదాకా గుడ్డినమ్మకంతో, ప్రపంచం మీద, మనుషులమీద విశ్వాసంతో స్వచ్ఛంగా బతికేస్తారు. వాళ్ళ స్వచ్ఛతే వాళ్ళని కళ్ళు తెరువనివ్వకుండా గంతలు కట్టేస్తుంది. మిగిలినవాళ్ళు అలా కాదు. తప్పులు చేస్తారు. ఆ తరువాత ఆశ్చర్యపోతారు. అసహనంగా తయారౌతారు. ఇదంతా విధి ఆడిన నాటకం అనుకుంటారు. పరిస్థితుల చేతిలో ఓడిపోయామని బాధపడతారు. మనుషుల్లో అరుదుగా మాత్రమే తటస్థించే చెడ్డవాళ్ళు తమకే ఎందుకు కలిసారని ఆలోచిస్తారు.

ఆ కుటుంబం పేరు సవిన్యోల్. కూతురు బెర్తా. ఆమెకు పద్దెనిమిదేళ్ళు రాగానే ఘనంగా పెళ్ళి జరిపించారు. జార్జి బెరోన్ అనే పారశీ యువకుడుతో ఆమె పెళ్ళైంది. స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో పని చేసెవాడతను. అందగాడు, మంచి మర్యాద తెలిసినవాడు. అతన్ని చూస్తేనే అన్నీ సుగుణాలే వున్నట్లు అర్థం అవుతుంది. కాకపోతే అతనికి ఎక్కడో అంతరాళాలలో అత్తమామలంటే చులకన భావం వుంది. దగ్గర వాళ్ళతో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళని “అవశేషాలు” అని వెక్కిరించేవాడు.

అతను మంచి కుటుంబం నుంచి వచ్చాడు. అమ్మాయిది కూడా బాగా ధనవంతుల కుటుంబం. ఇద్దరూ ప్యారిస్ లో స్థిరపడ్డారు. ఎంతో పేరుపడ్డ భర్త కుటుంబంలో ఆమె కూడా ఒక భాగమైపోయింది. ఇక్కడ కూడా బయట ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండానే ఆమె జీవితం గడిచిపోసాగింది. ఆ మహానగర సాఘిక జీవనం, సరదాలు, సంతోషాలు, వేడుకలు ఇవేవీ ఆమెకు పరిచయం కాలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితాన్ని చూడలేకపోయింది. అందువల్లే మోసాలనీ, మాయామర్మాలనీ, విశ్వాసఘాతుకాలని కూడా చూడలేకపోయింది.
తన ఇంటికీ, కుటుంబానికీ అంకితమై వుండిపోయిందే తప్ప ఆమె వుండే వీధికి అవతల జరిగే విషయాలను కూడా తెలుసుకోలేదు. ఎప్పుడైనా అవసరానికి ప్యారిస్ నగరంలోని మరో వైపుకి వెళ్ళిన రోజు దుర్గమైన మార్గాలు దాటి అంతుతెలియని మాయాప్రపంచాన్ని చూసినంత ఆనందపడేది. అలాంటి రోజు సాయంత్రం భర్త కలిసినప్పుడు –
“ఈ రోజు ఊర్లోకి వెళ్ళాను తెలుసా” అంటూ ఏదో సాధించినట్లు చెప్పుకునేది.

ఒకటో రెండుసార్లు ఆమెకి నాటకాలు చూపించాడు అతను. అవి ఆమె మనసులో ఎన్నటికీ వాడిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అలా వెళ్ళి వచ్చిన చాలా రోజుల తరువాత కూడా ఆమె మాటల్లో ఆ విశేషాలు దొర్లుతుండేవి. ఒకోసారి ఏ మూడు నెలల తరువాతో ఉన్నట్టుండి ఆమె పగలబడి నవ్వేది.

“నీకు గుర్తుందా? జనరల్ వేషం వేసినవాడు కోడిలా భలే కూశాడు కదూ” అని గుర్తు చేసుకునేది. అటు అమ్మగారింటి వైపు, ఇటు అత్తగారింటి వైపు వున్న బంధువులే ఆమెకు తెలిసిన స్నేహితులు.

ఆమె భర్త మాత్రం ఆయన ఇష్టప్రకారమే నడుచుకునేవాడు. ఇష్టం వచ్చిన వేళకి ఇంటికి వచ్చేవాడు. ఒకోసారి బిజినెస్ కారణాలు చెప్పి చాలా ఆలస్యంగా వచ్చేవాడు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లు అతని నడవడి వుండేది. ఏ కల్మషమూ లేని భార్య మనస్సులో ఎలాంటి అనుమానాలు వుండవని అతనికి నమ్మకంగా తెలుసు.

కానీ అనుకోకుండా ఒక రోజు ఉదయం ఆమెకు ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఆమె నెత్తిన పిడుగు పడ్డట్లైంది. స్వచ్ఛమైన ఆమె మనసుకి సంతకం లేని ఆ ఉత్తరం చేస్తున్న అపవాదుల తీవ్రత అర్థం కాలేదు. కానీ, అన్యాయాన్ని ఎదిరించడానికీ, నిజాన్ని బతికించడానికీ, ఆమె సంతోషాన్ని నిలబెట్టడానికి రాస్తున్నట్లుగా చెప్పుకున్న ఉత్తరాన్ని కాదని పడెయ్యలేకపోయింది. ఆమె భర్త గత రెండేళ్ళుగా రోసే అనే వితంతువుతో సంబంధం పెట్టుకోని, ప్రతి సాయంత్రం ఆమె దగ్గరే గడుపుతున్నట్లుగా ఆ జాబులో వుంది.

బెర్తాకి తన బాధని ఎలా దాచుకోవాలో తెలియలేదు. భర్తని అనుమానించి ఆరా తీసే ఆలోచనాలేదు. అతను మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆ వుత్తరాన్ని అతని ముందు పడేసి భోరున ఏడుస్తూ తన గదిలోకి పరుగెత్తింది.

దాంతో సమాధానాన్ని తయారు చేసుకోడానికి అతని కావల్సినంత సమయం దొరికింది. వెళ్ళి భార్య గది తలుపు కొట్టాడు. ఆమె చటుక్కున తలుపు తీసింది కానీ అతని వైపు చూసే ధర్యం చెయ్యలేకపోయింది. అతను చిరునవ్వులు నవ్వుతూ కూర్చోని ఆమెని తన దగ్గరకు లాక్కోని కాస్త ఎగతాళి ధ్వనిస్తున్న గొంతులో చెప్పడం మొదలుపెట్టాడు.

“పిచ్చిపిల్లా, నిజమే నాకు రోసే అన్న పేరుతో ఒక స్నేహితురాలు వుంది. పదేళ్ళుగా పరిచయం. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. ఇంకా చెప్పాలంటే నేను నీతో ఎప్పుడూ ప్రస్తావించని స్నేహితులు చాలామంది వున్నారు. నీకేమో కొత్త పరిచయాలు నచ్చవు, ఫంక్షన్లు నచ్చవు, అసలు బయట ప్రపంచంతో సంబంధమే వుండదు కదా? ఇప్పుడేమో ఇలాంటి తప్పుడు నిందలు నమ్మి భయపడుతున్నావు. సరే ఒక పని చేద్దాం. భోజనం చేసిన తరువాత నువ్వు తయారవ్వు. ఇద్దరం కలిసి వెళ్ళి ఆ అమ్మాయిని కలుద్దాం. నువ్వు ఒక్కసారి కలిశావంటే నీక్కూడా ఆమె మంచి స్నేహితురాలౌతుంది. నా మాట నిజం” అన్నాడు.

ఆమె భర్తని గట్టిగా ఆలింగనం చేసుకుంది. ఒకసారి రాజుకుంటే ఆరిపోని నిప్పులాంటి స్త్రీ సహజమైన కుతూహలంతో అతనితో వెళ్ళి ఆమెని చూడటానికి ఒప్పుకుంది. ఇప్పుడు ఆమెకు అణువంత కూడా అసూయ లేదు. ప్రమాదానికి సిద్ధపడటం అంటే ఆ ప్రమాదాన్ని ఎదిరించే సామాగ్రిని సిద్ధం చేసుకోవడం అని మాత్రం అనిపించింది.
***
ఓ అందమైన ఇంటి నాలుగో అంతస్థులో చక్కగా అమర్చిన చిన్న ఫ్లాట్ లో ప్రవేశించారు ఇద్దరూ. పరదాలు, కర్టన్లతో చీకటిగా మారిపోయిన డ్రాయింగ్ రూమ్ లో ఓ అయిదు నిముషాలు ఎదురుచూశాక తలుపులు తెరుచుకున్నాయి. కాస్త పొట్టిగా, కొంచెం లావుగా, చామనఛాయలో వున్న స్త్రీ ఆశ్చర్యంగా చూస్తూ, చిరునవ్వులు నవ్వుతూ వచ్చింది.
 “ఈమె నా భార్య – ఈమె మేడమ్ జూలీ రోసే” జార్జి ఒకరికొకరిని పరిచయం చేశాడు.

ఆమె ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన గొంతుతో సగం అరుపు అరిచి ఆ పైన అణిచేసుకుంది. చేతులు ముందుకు చాపి బెర్తా వైపుకు పరుగు తీసింది. మేడమ్ బెర్తా ఎవరినీ కలవదని తనకు తెలుసనీ అందుకే ఇలా ఇంటికే వచ్చేస్తుందని అసలు ఊహించలేదనీ చెప్పింది. ఆమె పరిచయం కలగడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చెప్పుకొచ్చింది. జార్జి అంటే తనకి ఎంతో ఇష్టమనీ (జార్జి అనే పేరును ఆమె ఎంతో కలగొలుపుగా, ఒక సోదరిలా పిలుస్తుంది) అందువల్ల అతని భార్యని కలిసి ఆమెతో కూడా స్నేహం చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పింది.

ఓ నెల గడిచేసరికి ఈ కొత్త స్నేహితులది విడదీయరాని బంధమైపోయింది. ప్రతి రోజూ కలుసుకునేవాళ్ళు. ఒకో రోజు రెండుసార్లు కలుసుకునేవాళ్ళు. ఒకరోజు వీళ్ళింట్లో భోజనం, మరోసారి వాళ్ళింట్లో. జార్జి ఇప్పుడు ఇంటిపట్టునే వుంటున్నాడు. అతని మాటల్లో బిజినెస్ ఇబ్బందులు మచ్చుకైనా కనపడటంలేదు. తన ఇంట్లో నిప్పుగూడు పక్కన కూర్చోవడంలో ఎంత ఆనందం వుందో చెప్తుండేవాడు.

ఓకసారి మేడమ్ రోసే వుంటున్న బిల్డింగ్ లోనే మరో ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. బెర్తా క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఫ్లాట్ కొనేసింది. తన స్నేహితురాలితో మునుపటి కన్నా ఎక్కువ సమయం గడిపేందుకు అది మంచి అవకాశం అనిపించిందామెకు.

రెండేళ్ళపాటు వాళ్ళ స్నేహబంధం ఏ కారుమబ్బులు కమ్మకుండా సాగింది. ఆ అనుబంధం హృదయాలనూ, మనస్సులనూ కలిపింది. స్వచ్ఛమైన, సుకుమారమైన, అంకితమైన బంధంగా ఎదిగింది. ఇప్పుడు రోసే పేరు పలకకుండా బెర్తా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెకు రోసే అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం. ఇప్పుడు బెర్తా జీవితంలోకి సంతోషం, సాంత్వన, సంతృప్తి ప్రవేశించాయి.

కానీ మేడమ్ రోసే అనారోగ్యం పాలైంది. బెర్తా దగ్గరే వుండి సేవలు చేసింది. రాత్రిళ్ళు ఆమె దగ్గరే వుండేది. బాధతో విలవిలలాడేది. ఆమె భర్త అయితే అలవికాని దుఃఖానికి లోనయ్యాడు. ఓ రోజు ఉదయం రోసేని పరీక్షించిన డాక్టరు జార్జినీ, అతని భార్యని విడిగా తీసుకెళ్ళి మాట్లాడాడు. రోసే పరిస్థితి ఏమంత బాలేదనీ, కోలుకోకపోవచ్చనీ చెప్పాడు.
ఆయన వెళ్ళిపోయాక ఇద్దరూ బాధతో ఒకరికి ఎదురుగా మరొకరు కూలబడిపోయి కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. ఆ రాత్రి ఇద్దరూ ఆమె మంచం దగ్గరే మేల్కోని వుండిపోయారు. బెర్తా తన స్నేహితురాలికి పదే పదే ముద్దుపెడుతూ వుండిపోయింది. జార్జి ఆమె పాదాల దగ్గర నిలబడి జీవం కోల్పోయిన ఆమె ముఖాన్ని పరికిస్తూ గడిపాడు.

మర్నాటికి పరిస్థితి మరింత విషమించింది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తాను బాగానే వున్నానని చెప్పింది రోసే. స్నేహితులు ఇద్దర్నీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి రమ్మని బలవంతం చేసి మరీ పంపించింది.

వాళ్ళి తమ ఇంట్లో భోజనానికి కూర్చున్నారన్న మాటే కానీ ఏమీ తినడానికి ప్రయత్నించలేదు. పనిమనిషి జార్జికి ఏదో కాగితం తెచ్చి ఇచ్చింది. అతను దాన్ని తెరిచి చదివాడు. ముఖం పాలిపోయింది. తన కుర్చీలోనుంచి లేచి భార్యవైపు చూశాడు.

“ఇక్కడ వుండు. నేను వెళ్ళక తప్పదు. పది నిముషాలలో వచ్చేస్తాను. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ్నుంచి కదలకు” అన్నాడు. తన గదిలోకి పరుగులు పెట్టి తన హ్యాట్ తెచ్చుకున్నాడు.

బెర్తా అతని కోసం ఎదురుచూస్తూ వుండిపోయింది. కొత్త భయాలేవో ఆమెని కమ్ముకున్నాయి. విధేయత ఆమె స్వభావం కాబట్టి భర్త వచ్చేదాకా తన స్నేహితురాలిని కలవడానికి కూడా వెళ్ళలేకపోయింది. ఎంతసేపైనా అతను తిరిగిరాలేదు. ఒకవేళ బిజినెస్ పని మీద వెళ్ళాడా అని అనుమానించింది. బిజినెస్ పని అయితే తప్పకుండా గ్లౌజులు వేసుకొని వుంటాడు కాబట్టి అతని గదిలోకి వెళ్ళి చూద్దామనుకుంది. వెళ్తే అవి ఎదురుగానే కనపడ్డాయి. వాటి పక్కనే హడావిడిలో నలిపి పడేసినట్లుగా ఒక కాగితం కూడా కనపడ్డది. అది నిస్సందేహంగా ఇంతకు ముందు జార్జి చూసిన కాగితమేనని అర్థం అయ్యింది.

ఆమెను మొదటిసారిగా ఓ కుతూహలం కమ్మేసి ఆ కాగితాన్ని చదివి అతను ఎందుకు అంత అర్థాంతరంగా వెళ్ళిపోయాడో తెలుసుకోమంది. అంతరాత్మ తిరగబడి అది తప్పని మాత్రం చెప్పగలిగింది కానీ భయం కలగలిసిన కుతూహలాన్ని మాత్రం జయంచలేకపోయింది. చప్పున కాగితాన్ని అందుకోని, సాపు చేసి వణుకుతున్న చేతులతో పట్టుకోని చూసింది. అది రోసే చేతి రాత!

“ఒక్కసారి ఒంటరిగా వచ్చి నాకు ముద్దు పెట్టవా ప్రియా! నా సమయం అయిపోవచ్చింది”

రోసే చావుకి సంబంధించిన విషయమే గమనించిన ఆమె మెదడుకి అసలు విషయం వెంటనే అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆమె చదివిన వాక్యాల అర్థం ఆమె ముఖం మీద ఒక విస్ఫోటనంలా విరుచుకుపడింది. ఆ పెన్సిల్ రాత ఆమె ఉనికినే ప్రశ్నించే దిగులు వెలుగును ప్రసరించింది. అతి హేయమైన ఒక నిజాన్ని బట్టబయలు చేసింది. ఆమెను ఇంతవరకూ బలి చేసిన ఒక విశ్వాసఘాతుకాన్నీ, మోసాన్ని తేటతెల్లం చేసింది. సంవత్సరాలుగా సాగుతున్న ద్రోహాన్ని, ఆమెను ఆట బొమ్మను చేసి ఆడించిన దుర్మార్గాన్ని తెలియపరిచింది.

ఆ ఇద్దరూ ఆమెకు కనపడ్డారు. ఏదో ఒక సాయంత్రం చిరుదీపపు వెలుగులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చోని ఒకే పుస్తకంలో చదువుతూ పేజి చివరిలో ఒకరి ముఖం ఒకరు చూసుకున్న దృశ్యం మళ్ళీ ఆమెకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ప్రేమకు పేదయై, క్షోభపడి, రక్తమోడుతున్న ఆమె మనసు ఆమెను అంతు తెలియని నిరాశల ఊబిలోకి తోసేసింది. ఆడుగుల చప్పుడు వినపడింది. ఆమె పరుగున తన గదిలో వెళ్ళి తలుపులు వేసుకుంది. బయట నుంచి భర్త పిలిచాడు.

“త్వరగా రా, మేడమ్ రోసే చావుబతుకుల్లో వుంది” అన్నాడు

బెర్తా బయటకు వచ్చి వణుకుతున్న పెదాలతో సమాధానమిచ్చింది – “నువ్వు వెళ్ళు. ఆమెకు నాతో అవసరం లేదులే”

ఆమె సమాధానం అర్థం కాక అతను ఆమె వైపే చూశాడు. తిరిగి హెచ్చరించాడు: “చెప్తున్నాను కదా... వెంటనే బయల్దేరు. ఆమె చనిపోయేలా వుంది”.

“నీ స్థానంలో నేనుంటే వెళ్ళిపోయేదాన్ని” బెర్తా అంది.

చివరికి విషయం అర్థం చేసుకొని, ఆఖరిఘడియల్లో వున్నఆమె దగ్గరకు గడపడానికి వెళ్ళిపోయాడు.

ఆమె మరణం తరువాత బాహాటంగా విలపించడానికి ఏ మాత్రం సంకోచించలేదతను. అతని భార్య విషాదం మరో రకంగా సాగింది. భర్తతో మాట్లాడటం మానేసింది. కనీసం చూడనైనా చూడటంలేదు. తన చుట్టూ అసహ్యమనే కంచె కట్టుకోని, ఏహ్యభావం నిండిన కోపంతో కలిసి ఒంటరిగా బతుకుతోంది. పగలు రేయి తేడా లేకుండా భగవంతుడికి ప్రార్థనలు చేస్తోంది.

ఒకే ఇంటిలో ఉన్నా ఇద్దరూ వేరు వేరు ప్రపంచాలలో వుండేవారు. భోజనానికి కూర్చుంటే టేబుల్ ఆ చివర ఒకరు, ఈ చివర ఒకరు. ఇద్దరి మధ్య మౌనం, నైరాశ్యం పరుచుకోని వుండేది. విషాదం క్రమంగా కరిగిపోయింది కానీ ఆమె మాత్రం అతన్ని క్షమించలేదు. అందువల్ల ఇద్దరి జీవితాలు నిస్తారంగా చేదు విషంలా కొనసాగాయి.

దాదాపు ఓ సంవత్సరం పాటు ఇద్దరూ అపరిచితుల్లా బతికారు. బెర్తా ఆలోచించడం కూడా మానేసింది.

కానీ ఓ రోజు ఉదయం బయటికి వెళ్ళిన బెర్తా ఎనిమిది గంటలకు తిరిగి వచ్చింది. ఆమె చేతిలో తెల్లటి రోజాలతో చేసిన పెద్ద బొకే! భర్తతో మాట్లాడాలనుకుంటున్నట్లు వర్తమానం పంపింది. అతను ఖంగారుపడుతూ, భయపడతూ వచ్చాడు.

“మనం బయటకు వెళ్ళాలి. ఈ పువ్వులు మీరు తీసుకుంటారా? బాగా బరువుగా వున్నాయి” అంది.

వాళ్ళు ఎక్కిన జట్కా స్మశానం గేటు ముందు ఆగింది. వాళ్ళు దిగారు. బెర్తా కంటిలో కన్నీరు,

“ఆమె సమాధి దగ్గరకు తీసుకెళ్తావా?” అంది జార్జితో.

అతను ఖంగారుపడ్డాడు. ఎందుకు ఆ కోరిక కోరిందో అర్థం కాలేదు. కానీ కాదనకుండా అక్కడకు తీసుకెళ్ళాడు. అతని చేతిలో పూలు అలాగే వున్నాయి. చివరకు ఒక తెల్లటి పాలరాతితో కట్టిన సమాధి ముందు ఆగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చెయ్యెత్తి అ సమాధిని చూపించాడు.

ఆమె అతని చేతిలో బొకే అందుకోని సమాధి ముందు మోకరిల్లి వాటిని అక్కడ పెట్టిండి. తరువాత మౌనంగా మనసులోనే ప్రార్థనలు చేసింది. గతం మొత్తం జ్ఞాపకం చేసుకుంటూ ఆమె భర్త వెనుకే నిలబడ్డాడు.
ఆమె నిలబడి తన చేతిని అతని వైపు చాపింది.

“నీకిష్టమైతే మనం స్నేహితులుగా వుండిపోదాం” అంది.


***