పురాణకథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పురాణకథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ధర్మరాజు స్వర్గారోహణం

యుధిష్టరుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా వైభోవోపేతంగా నిర్మించిన ద్వారమొకటి కనపడింది. తానెక్కడున్నాడో అర్థంకాలేదు. తన తమ్ముళ్ళతో ద్రౌపదితో కలిసి స్వర్గారోహణ చెయ్యటం ఒక్కొక్కళ్ళుగా అందరూ రాలి పోవటం అంతా అతని కళ్ళముందు కనపడింది.

అంటే తాను మరణించాడా..? ఈ కనపడేవి స్వర్గ ద్వారాలేనా..??

"యుధిష్టిరునికి స్వాగతం" అన్నారు ద్వారానికి ఇరువైపులా వున్న భటులు. మహారాజా అన్న పిలుపుకి అలవాటు పడ్డందుకేమో యుధిష్టరుడనే పిలుపు కొత్తగా వినపడింది.

"నన్ను అందరూ ధర్మరాజంటారు.." చెప్పాడు

"మాకున్న ధర్మరాజు ఒకడే.. మా ప్రభువు యమధర్మరాజు.."

"అంటే ఇది స్వర్గం కాదా..?"

"ఇక్కడ స్వర్గమూ వుంది నరకమూ వుంది.." అంటుండగానే ఆ ద్వారాలు తెరుచుకున్నాయి.

యుధిష్టరుడు లోపలికి ప్రవేశించాడు. కొంత ముందుకెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడ -

శొభాయమానమైన సింహాసనంపై ఆసీనుడై వున్నాడు ధుర్యోధనుడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతూ, సుర్యతేజంతో ప్రభాసిస్తూ..

ఇది నిజమా.. లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా..? అనుకుంటూ తల తిప్పేసుకున్నాడు. తనతో వస్తున్న భటులతో అన్నాడు -

"ఈ ముందుచూపులేని మూర్ఖుడు దుర్యోధనుడితో నేను ఈ లోకాన్ని పంచుకోలేను. కురుక్షేత్ర సంగ్రామానికి, కురు వంశ నాశనానికి కారణం అతడే. భటులారా నేను ఆతడి ముఖం కూడా చూడలేను. నన్ను దయచేసి నా తమ్ముల దగ్గరకు తోసుకెళ్ళండి.." అంటూ అడిగాడు. అంతలో ఒక మహాపురుషుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

"యుధిష్టిరా.. ఇది సమవర్తి లోకం.. ఇక్కడ ద్వేషానికి, శత్రుత్వానికి ఆస్కారంలేదు. దుర్యోధనుడి గురించి నీవటుల పలకరాదు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధంలో పోరాడి మరణించి అంతను ఇక్కడ స్వర్గ సౌఖ్యాలనుభవిస్తున్నాడు. ఇక్కడ దేవతలు సైతం అతనిని పూజిస్తారు. కాబట్టి ఇక ద్వేషాన్ని మరచి అతనితో కలువు.." అంటు హితబోధ చేసాడు.

"సరే దురోధనుడు క్షత్రియ ధర్మాన్ని పాటించినవాడైతే అతన్ని ఇక్కడే వుండనీ... నేను మాత్రం ఇక్కడుండలేను. యుద్ధంలో మరణించినవారికే స్వర్గమైతే నా అభిమన్యుడెక్కడ, దుష్టద్యుమ్నుడు అతని కుమారులెక్కడ, గురు ద్రోణులు, పితామహుడెక్కడ... నా అగ్రజుడు కర్ణుడుడెక్కడ... నా తమ్ముళ్ళెక్కడ..?? నన్ను అక్కడికి తీసుకెళ్ళండి.."

"అవశ్యం. మీరు ఏది కోరితే అది నెరవేర్చమని మా ప్రభువు ఆజ్ఞ.. మా భటులతో వెళ్ళండి మీరు కోరిన చోటికి తీసుకెళ్తారు.." అంటూ ఆ దేవతాపురుషుడు అదృశ్యమయ్యాడు. భటులు ముందుకు కదిలారు. యుధిష్టరుడు వెనకే నడవసాగాడు.


ఆ దారంతా ఎంతో దుర్భరంగా వుంది. పాపాలు చేసిన మానవులంతటా పరుచుకొని వున్నారు. ఇనప ముళ్ళున్న కందిరీగలు కుడుతున్నాయి, కాకులు గద్దల ఇనుప ముక్కులతో రక్తమోడుతున్నాయి. కుళ్ళిపోయిన శవాలున్నాయి... వాటి నిండా దుర్గంధభరితమైన కీటకాలు. కొంత దూరం వెళ్ళాక మరుగుతున్న నీటితో నిండిన నది కనపడింది. అది దాటిన పిమ్మట ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అక్కడి చెట్లకు కత్తులాంటి ఆకులున్నాయి.. అవన్ని యుధిష్టరుడికి గీసుకొని రక్తం కారసాగింది. కాగుతున్న నూనెలో మరుగుతూ, రాళ్ళతో, ఇనుముతో చేసిన ఆయుధాల దెబ్బలు తింటూ యమలోకపు శిక్షలనుభవిస్తున్న వారు చేస్తున్న ఆర్తనాదాలు భయంకరంగా వున్నాయి.

అక్కడి పరిస్థితి ముందుకెళ్తున్నకొద్దీ మరింత దుర్భరమవసాగింది. యుధిష్టరుడు అసహనంగా అడుగులు వెయ్యసాగాడు. చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి.. భయంకరమైన దుర్గంధం తప్పించి తను ఎటు వెళ్తున్నది అర్థం కావటంలేదు. పాదాలలో సూదికొనయైన ముళ్ళు దిగబడి రక్తం ధారగా ప్రవహించసాగింది. ఇక ముందుకు అడుగులెయ్యలేక అక్కడే ఆగిపోయాడు.

"భటులారా.. ఇంకా ఎంత దూరం ఈ హేయమైనా ప్రదేశంలో నడిపిస్తారు... నా తమ్ముళ్ళను చూపించండి.. ఇక వారిని చూడటానికి నేను ఒక్క క్షణం కూడా వేచి వుండలేను.." అన్నాడు బాధగా.

"అయ్యా.. మనం చేరవలసిన చోటికి చేరుకున్నాము. మిమ్మల్ని ఇక్కడిదాకా మాత్రమే తీసుకురమ్మని మా ప్రభువుల ఆజ్ఞ. మీరు సమ్మతిస్తే ఇక్కడే వదిలేసి మేము తిరిగి వెళ్ళిపోతాము. లేదా మాతో తిరిగి రాదలుచుకుంటే తీసుకు వెళ్తాము. తమ ఆజ్ఞ ఏమిటో తెలియజేయండి."

యుధిష్టరుడు ఆశ్చర్యపోయాడు. కన్ను కానని ఈ చీకటిలో, భయంకరమైన ఆడవిలో ఎక్కడని తమ్ముళ్ళను గాలించగలడు. ఈ దుర్గంధాన్ని భరిస్తూ ఒక్క క్షణం కూడా జీవించి వుండలేడు. ఇలా అనుకుంటూ యుధిష్టరుడు వెనుతిరిగాడు. అంతలో నలువైపుల నుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి..

"ధర్మనందనా.. మమ్మల్ని విడిచి వెళ్ళద్దు.."

"మమ్మల్ని కాపాడు అన్నయ్యా..."

"నీ రాకతో ఇక్కడికి పరిమళ భరితమైన సువాసనలు ప్రవేశించాయి.. మాకు ఈ దుర్గంధాన్ని తప్పించే ఆ ఒక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నావా.."

యుధిష్టరుడు అదిరిపడ్డాడు. "ఎవరది.. ఎవరు మాట్లాడుతున్నారు..??" అడిగాడు

"అన్నయ్యా మేము నీ తమ్ముళ్ళం.. పాండు కుమారులం.."

"పెదనాన్నా మేము మీ పుత్రులం.. వుప పాండవులం"

"నేను ద్రౌపదిని"

"అభిమన్యుడను.."

యుధిష్టరుడి కంట అప్రయత్నంగా కన్నీరు వుబికింది.

"హతవిధీ.. ఏమిటీ ఘోరం..? మహావీరులైన తమ్ముళ్ళు, సాధ్వి ద్రౌపది, నా పుత్రులు వీరంతా వుండవలసిన చోటేనా ఇది. దుర్యోధనుడు చేసిన పుణ్యమేమిటి వీరంతా చేసిన పాపమేమిటి?? ఎందుకు వీరికీ శిక్ష విధించారు..? నా చిత్తమేమైనా చెలించినదా.. అస్వస్థుడనై నిద్రావస్థలో ఈ భయంకరమైన కలగంటున్నానా.." అనుకుంటూ అక్కడే కొంతసేపు నిలబడిపోయాడు.

అంతలోనే తేరుకొని భటులతో -

"మీరు వెళ్ళిపోండి.. మీ ప్రభువుతో నేను ఇక్కడే వుండటానికి నిశ్చయించుకున్నానని నివేదించండి. నా వునికి నా సోదరులకు ఇతర పాపులకి సాంత్వన కలగజేస్తుంటే వారి సుఖం కోసం నేను ఈ బాధలను భరించడానికి సిద్ధమే అని తెలుపండి.. వెళ్ళండి"

ఆ మాట వింటూనే వారు తిరిగివెళ్ళిపోయారు. యుధిష్టరుడు నిస్సహాయంగా నాలుగువైపుల చూసాడు.
"ఏమిటి విచిత్రం? నా తమ్ముళ్ళు నరకంలో వుండటమేమిటి? సరే, విధిరాతను తప్పించడం ఎవరికి సాధ్యం. నా పరివారానికి ఇదే రాసిపెట్టివుంటే అలాగే జరగునుగాక. సుయోధనుడు వీరమరణంతో అమరుడై వుంటే వుండుగాక. నేను మాత్రం ఇక్కడే వుంటాను. భూలోకంలో మహరాజుగా వీరందరి సేవలను అందుకున్నాను. ఇప్పుడు వీరందరికీ సేవ చేస్తాను. వారి సుఖంలోనే నాకు సుఖం వుంది, వారి సంతోషంలోనే నాకు సంతోషం వుంది, వారెక్కడ వుంటే అదే నాకు స్వర్గమౌతుంది" అనుకుంటూ ముందుకు కదలబోయాడు.

సరిగ్గా అప్పుడే దూరం నుంచి సుర్య తేజాన్ని మించిన వెలుగును చూసాడు. అది క్రమంగా దగ్గరకు రాసాగింది. ఆ వెలుగు ప్రసరించడంతో ఆ ప్రాంతమే మారిపోయింది. నరకలోక శిక్షలన్నీ మాయమై ఆ స్థానే దేవతా వృక్షాలు వాటికింద తపస్సు చేసుకుంటున్న మునులు కనిపించారు. అమోఘమైన పూల పరిమళాలు పరచుకున్నాయి. ఆ పరిసరాలన్నీ అద్భుతమైన దృశ్య కావ్యంగా మారిపోయాయి. ఆ వెలుగుతోబాటే ఇంద్రుడు, యమకుబేరాది అష్టదిక్పాలకులు వచ్చి యుధిష్టరుడి ముందు నిలబడ్డారు.

"ధర్మరాజా.." అన్నాడు ఇంద్రుడు.

"లేదు ప్రభూ నేను యుధిష్టరుడిగానే సంతుష్టుడిని. నా పరివారమంతా నరకంలోవుంటే నన్ను ధర్మరాజని పిలవడాం హాస్యాస్పదంగా వుంటుంది." అన్నాడు యుధిష్టరుడు చేతులు జోడించి.

"నీ పరివారమెవ్వరూ నరకంలో లేరు ధర్మనందనా.. అది కేవలం నీ భ్రమ మాత్రమే. రాజుగా పుట్టినవాడు నరకాన్ని చూసితీరాలని ప్రతీతి. అందునా ద్రోణుణ్ణి వధించడానికి నీవు మోసానికి పాల్పడ్డావు. మరణిచినా ఈర్షాద్వేషాలు నీలో చావలేదని దుర్యోధనుణ్ణి చూసి చెప్పకనే చెప్పావు. వీటన్నిటి పర్యవసానమే ఈ నరకలోక అనుభవం.." చెప్పాడు ఇంద్రుడు.

యమధర్మరాజు పుత్రవాత్సల్యంతో -"నాయనా.. నేను నీకు పెట్టిన మూడొవ పరిక్ష ఇది. పూర్వం ద్వైత వనంలో నీవు సమిధలకై వచ్చినప్పుడు ఒక తటాకం వద్ద నిన్ను ప్రశ్నించాను, మహాప్రస్థానంలో కుక్కగా నీ వెంట వచ్చి పరీక్షించాను, ఈ నరకానుభవం కూడా అలాంటిదే. అసూయ ద్వేషాన్ని విడనాడి నీ పరివారానికి తోడుగా నిలవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నావో అప్పుడే నీ శిక్ష ముగిసింది. నరకము స్వర్గము అని రెండు వేరు వేరు ప్రదేశాలు లేవు. నీ మనసులో ఈర్ష వున్నప్పుడు ఇదే నరకం, సంతోషమున్నప్పుడు ఇదే స్వర్గం" అన్నాడు నవ్వుతూ.

"ధర్మరాజు" నమస్కరించాడు.


03.10.2008

ఒక అవతారానికి ముందు..

లి సంహారానికి విష్ణువు వామనుడై అవతరించాడు. చూడ చక్కని రూపంతో ముద్దు ముద్దు మాటలతో బలి చక్రవర్తి ముందు నిలబడి మూడడుగుల నేల కావాలంటూ చెయ్యి చాపాడు.

బలి చక్రవర్తి కూతురు రత్నమాల తన తల్లి కైతవి పక్కనే నిలబడి ఆ మనోహర దృశ్యాన్ని చూసింది. అమాయకంగా అర్థిస్తూ నిలబడ్డ ఆ బాల వటువును చూడగానే రత్నమాలకు చిత్రంగా మాతృవాత్సల్యం పొంగుకొచ్చింది. ఆ చక్కని బిడ్డడు తన పుత్రుడే అయితే తన స్తన్యమిచ్చి లాలించాలనిపించిందామెకు.

మూడొవ అడుగు బలి తలపై పెడుతూ వామనుడు ఆమె వైపు చూసి తథాస్తు అన్నట్టు నవ్వాడు.

***

కశ్యప మహర్షి ఒక మహత్తరమైన యాగం తలపెట్టాడు. అయితే ఆ యాగానికి కావల్సిన ఉత్తమజాతి అశ్వం కేవలం వరుణుడి దగ్గర వుందని తెలుసుకొని, అర్థించడం ఇష్టంలేక తన తపోశక్తితో దానిని తస్కరించాడు. యాగానంతరం వరుణుడు కశ్యపాశ్రమానికి చేరి కశ్యప పత్ని అదితిని ఆ అశ్వాన్ని తిరిగిమ్మని కోరాడు. అదితి సైతం తిరస్కరించడంతో వుగ్రుడై అదితికశ్యపులను భూలోకంలో జన్మించమని, పుత్రుడుండీ పుత్రవియోగం అనుభవించమని శపించాడు. అదితి ఆందోళనగా కశ్యపమునిని చేరి విషయం తెలిపింది. ఆ శాపంవల్ల తనకు కలుగబోయే అదృష్టాన్ని దివ్యదృష్టితో గ్రహించిన కశ్యపుడు ఆ జగన్నాధుణ్ణి తలుస్తూ నమస్కరించాడు.

***

ఎన్నడూ లేనిది పార్వతి కొలనులో శివపూజకై నిర్దేశించిన పూలు మాయమైనాయి. పార్వతి కోపంతో దుర్గైంది.. కాళికైంది.. ఆ పని చేసినవాడు కొంగరూపంలో తిరిగే రాక్షసుడు కావాలని శపించింది. శివార్చనకే ఆ పూలు కోసిన గంధర్వుడు అదేమి తెలియక పరమేశ్వరుడి పాదాలపై ఆ పూలు వుంచి నమస్కరించాడు. అన్నీ తెలిసిన సర్వేశ్వరుడు మూడు నేత్రాలు మూసుకొని కేశవ స్తుతి చేసాడు.

***

మహర్షి ద్రోణుడు అగ్నిని ఆవాహన చేసాడు. ఆయన ముందున్న సమిధలు భగ్గున మండాయి. ఆ ఋషి పత్ని ధర కంట కన్నీరు వర్షిస్తోంది. ఇద్దరూ అగ్నిహోత్రం చుట్టు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తూ నిలబడ్డారు.

"దేవాది దేవా.. సంతానంకోసం అలమటించిపోతున్నాము.. ఇన్నేళ్ళుగా చేసిన తపస్సు నీలో కరుణ కలిగించలేదా ప్రభూ.. మా అత్మాహుతితోనైనా నీకు దయ కలిగితే మరుజన్మలోనైనా పుత్రభాగ్యాన్ని ప్రసాదించు తండ్రి.." అంటూ ఇద్దరూ వేడుకున్నారు. ఆ పై ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు.

***

ఆ రోజు నారదుడు సత్యలోకం చేరేసరికి జయవిజయులు విష్ణుమూర్తికి ప్రణమిల్లుతూ కనపడ్డారు.

"స్వామీ.. సనకసనందులను అడ్డగించిన పాపం మీ వియోగానికి కారణమౌతుందని తెలిస్తే.. వారిని అడ్డగించేవారమే కాదు. వారి శాపాన్ననుసరించి హిరణ్యాక్షహిరణ్యకశపులుగా, రావణకుంభకర్ణులుగా మీకు విరోధులమై మీచేతే వధించబడ్డాము. ఇక మా వల్లకాదు.. విష్ణుద్వేషులమై మిగిలిన ఆ ఒక్క జన్మా వెంటనే ఆరంభిస్తాము.. మమ్ములని వధించి శాశ్వత విష్ణుసేవా భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభూ.." అంటూ వేడుకొని వెళ్ళిపోయారు.

నారదుడు విష్ణుసంకీర్తనం చేసి నమస్కరించాడు.

"దేవదేవా.. ఏనాడు లేనిది తాపసిని నాకు కోపం కలిగింది స్వామీ.. మునుపు మిమ్మల్ని దర్శించి వెళ్తుండగా నగ్నంగా విహరిస్తున్న కుబేరపుత్రులు నలకుబేరుడు, మణిగ్రీవుడు కనిపించారు. నన్ను చూసి, తొలగక, నా ఆగ్రహానికి కారణమయ్యారు. వారిద్దరిని మద్దిచెట్లు కమ్మని శపించాను. నా చేత ఈ పని చేయించటంలో అంతరార్ధమేమిటి జగన్నాటక సూత్రధారి..?" అని ఆడిగాడు.

విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి అన్నాడు -

"నీవల్ల శాపంపొందిన కుబేరపుత్రులే కాదు నారదా.. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి ఆరుగ్గురు కొడుకులు అనేకానేక జన్మలెత్తుతూ బ్రహ్మ విధించిన శాపవిమోచనానికి ఎదురుచూస్తున్నారు.. సహస్రాక్షుడనే రాజు రాక్షస రూపంలో శాపవిముక్తికై వేచివున్నాడు.."

"ఇంతమంది శాపగ్రస్తులు ఏ కథకి నాంది పలుకుతున్నారు దేవా.."

"శాపగ్రస్తులేకాదు నారదా, వరప్రసాదులు కూడా వున్నారు.. సూర్యుని కుమార్తె కాళింది నన్ను వివాహమాడాలని వరం పొందింది. తరువాతి అవతారంలో ద్వంద యుద్ధం చేస్తానని జాంబవంతుడికి మాట ఇచ్చాను.."

"నారాయణా.. అయితే ద్వాపర యుగానికి దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారభమైనట్లేనా..."

విష్ణుమూర్తి నవ్వుతూ లక్ష్మీదేవి వైపు చూసాడు. ఆమె చిరునవ్వుతో సమ్మతించి అదృశ్యమైంది.. ఆమెతో పాటే విష్ణుమూర్తి కూడా. అటుపై ఆదిశేషుడు కూడా అంతర్ధానమయ్యాడు. నారదుడు నిష్ఠగా నారాయణ మంత్రం పఠిస్తున్నాడు.


***


బలిపుత్రిక రత్నమాల పూతన అనే రాక్షసిగా, శివపూజకై పార్వతి కొలనులో పూలుకోసిన గంధర్వుడు బకమనే రాక్షసుడిగా, సహస్రాక్షుడు తృణావర్తుడనే రాక్షసుడిగా పుట్టి కంసుడి దగ్గర చేరారు. జయవిజయులు శిశుపాల దంతవక్తృలుగా పుట్టి విష్ణుదూషణ చేయసాగారు. ధరాద్రోణులు యశోదా నందులై గోకులంలో పుట్టారు. నారద శాపంతో మద్దిచెట్లైన కుబేరపుత్రులు నందుని పెరట్లో పెరిగి విష్ణుస్పర్శకై వేచివున్నారు. లక్ష్మీదేవి రుక్మిణిగా జన్మించింది. అదితికశ్యపులు దేవకీ వసుదేవులుగా జన్మించారు. పూర్ణిమంతుడు, పుర్ణిమాసాది మరీచి పుత్రులు ఆరుగ్గురు, షడర్భకులుగా దేవకి గర్భమున ఒక్కొక్కరే జన్మించారు. ఏడొవ గర్భమున ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడు. అష్టమ గర్భంలో సాక్షాత్ శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు.

కురుక్షేత్రంలో 18వ రోజు

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రధాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణిచిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో వుప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి -

"బావా చూసావా.. కౌరవులు ఎలా నశించారో..?" అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.

అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళముందు కనపడిది. తను జయించాడు... కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీదే లేడు..!!

అన్నిరధాలు రణరంగం మధ్యలో వున్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క వుదుటన రధం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు.

భీష్ముడు దుఖ్ఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.

"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు -

"అవును పితామహా... సుయోధనుడి వూరువులను ఇప్పుడె భంగపరిచాను... గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను.. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."

"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"

"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." నకులుడన్నాడు.

"నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా.." సహదేవుడాన్నాడు.

భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.

"చెప్పండి పితామహా.."

"నీవేమి చెప్పవేం..??"

"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను... ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.."

"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనవునికి నమస్కరించాడు.

"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు.. ధర్మ పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."

ఆ మాటలువింటూనే అర్జునిడికి కోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు.

"యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత." అనుకున్నాడు.

అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రధాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రధం పైన వున్న ధ్వజం వైపు చూసాడు. జండా పై వున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రధమ్ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు.

"శ్రీరామచంద్రా... వాసుదేవా.. నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా... పార్ధుడి రధంపై ధ్వజమై నిలిపి నీ నోటివెంటవచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సదర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు.

శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రధంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రధంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.

అంతే... ఫెళ ఫెళ మంటూ రధం కుప్పకూలిపోయింది... రధ చక్రాలు తునాతునకలైయ్యాయి. రధాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపీతులై చూస్తుండగానే రధం అశ్వాలతోసహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" అంటూ పరుగున వచ్చాడు.

అర్జునుడు భయపడుతూ "బావా వాసుదేవా.. " అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.

ఆ మాటలువింటునే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.

"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంటుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు -

"పార్థా.. నవ్వక ఎమిచెయ్యమంటావు. నిన్నుకాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది.."

"నన్ను కాపాడాడా..?"

"అవును అర్జునా... ఈ రధం ఇప్పుడుకూలిపోలేదు... భీష్మ బాణ ధాటికి నీ రధ చక్రాలు కూలాయి... కర్ణ అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణిచాయి.. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రధం ఎప్పుడో తునాతునకలయ్యింది... బ్రహ్మాస్త్ర ధాటికి నీ రధం యావత్తూ బూడిదయ్యింది..."

"మరి..?"

"నీ రధంపైన సాక్షాత్తు ఆదివిష్ణువున్నాడు... ఆ పర్మాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచివున్నాయి. ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రధం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా.. అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."

హనుమంతుడు ఈ మాటలంగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడి ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగ్గురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.

"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.
శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.


(ఈ నెల 24 జన్మాష్టమి సందర్భంగా)