పిచ్చాపాటి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పిచ్చాపాటి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఈ చిత్రంలో వున్నదెవరో గుర్తించగలరా?


తెలియదని చెప్పకండి... ఈయన తెలియని భారతీయుడు లేడు..!!

మాయాబజార్ సినిమా క్విజ్ సమాధానాలు


నిన్న ప్రకటించిన మాయాబజార్ క్విజ్ అంటే ఆ చిత్ర అభిమానులు విరివిగా పాల్గొంటారని అనుకున్నాను కానీ, మరీ బొత్తిగా ఇద్దరే సమాధానాలు వ్రాసారు. సరే ఏమైనా మరోసారి ప్రశ్నలు చూసి మీకేమైనా సమాధానం తెలుసేమో చూడండి.




1. తానశర్మ తందానశాస్త్రి పెట్టిన ముహూర్తం "దగ్ధయోగం"లో వుందని, బలరాముడి ఆస్థాన పురోహితులు వారిస్తారు. (తరువాత శశిరేఖాభిమన్యుల పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుందనుకోండి అది వేరే విషయం). ఆ వారించిన పురోహితుడి పేరేమిటి?



2. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన నటుడెవ్వరు?



3. తానశర్మ, తందాన శాస్త్రి విడిదిలో కొన్ని రకాల భ్రాంతులకు లోనౌతారు. అవేమిటి?



4. శకునిమామను ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు పందెం వెయ్యమని అడుగుతారు. చిత్రంగా అందరూ రెండు వెయ్యమంటారు. ఒక్కరు తప్ప. పందెం అడిగేదెవ్వరు? రెండు కాకుండా వేరే పందెం అడిగేదెవ్వరు?



5. శాకంబరీదేవి ప్రసాదం ఏమిటి?



6. సుభద్రాభిమన్యులను రథంపై ద్వారక నుంచి ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చే సారథి ఎవరు?



7. శశిరేఖ ఇష్ట సఖి పేరేమిటి?



8. అడవిలో సుభద్రాభిమన్యులను గోడకట్టి అడ్డుకునే రాక్షసుడి పేరేమిటి?



9. సుభద్రాభిమన్యులను అడవిలో ఘటోత్కచుడి రాక్షసులు ఎదుర్కునేటప్పుడు నేపధ్య సంగీతం ఏమిటి?



10. ఘటోత్కచుడి ఆశ్రమంలో దీవించడానికి వాడే పదం ఏమిటి?



జవాబులు:



1. బలరాముడి ఆస్థాన జ్యోతిష్యులు శంకుతీర్థుల వారు.

2. హాస్యనటుడు బాలకృష్ణ (అంజిగాడు) ఇందులో రెండు పాత్రలలో కనిపిస్తారు. హస్తినాపురంలో లక్ష్మణకుమారుడి సారథిగా, ద్వారకలో ఘటోత్కచుడు తొలిసారి వచ్చినప్పుడు ద్వారపాలకుడిగా లల్లాయిపాట పాడుతూ కనిపిస్తాడు.

3. వివాహభోజనంబు మాయం అయ్యి మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు "మనఃభ్రాంతి", గింబళిపైన తొమలపాకుల పళ్ళెం జరిగినప్పుడు "లోభ్రాంతి", గింబళి ఇద్దరినీ కప్పేసినప్పుడు "సమాధి భ్రాంతి". ఈ విషయాన్ని అల్లురామలింగ-తానశర్మ వివరిస్తాడు.

4. దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు, మాయాశశిరేఖ పందెం చెప్తారు. ముక్కామలదుర్యోధనుడు ముందు "అదే రెండు" అని చెప్పినా, "అహ కాదు కాదు ఒకటి" అంటాడు. "తడబడుతూ అడిగితే అది కూడా తడబడుతూ ఒక్కటే పడింది" అంటాడు సీయస్ఆర్‌శకుని. మాయా శశిరేఖ అడిగినప్పుడు ముందు ఒకటి పడ్డట్టు కనిపించినా మళ్ళీ రెండుగా కనపడుతుంది. "శశిరేఖ కనికట్టు నేర్చినదా లేక నా కన్నేమైనా చెదిరినదా " అంటాడు సీయస్ఆర్‌.శకుని.

5. "ఏమిటా.. గోంగూర.. శాంకంబరీ దేవి ప్రసాదం..ఆంధ్రశాకం  అది లేకపోతే ప్రభువులు ముద్దైనా ముట్టరు తెలిసిందా?"

6. దారుకుడు - భళి భళి మాధవపెద్ది

7. మైనా - ఘటోత్కచుడు ద్వారక వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు "మైనా ఇకనుంచి నీవు ఇతనికే ఇష్ట సఖివి" అంటూ పురమాయిస్తాడు.

8. కుడ్యాసురుడు - కుడ్యం అంటే గోడ.

9. "కోర్ కోర్ శరణు కోర్..".. "ఫో ఫో వెనక్కి ఫో.." లాగా వినిపిస్తుంది కాని, "కోర్ కోర్.." వున్నట్టు గతంలో హాసంలో వివరించారు.

10. అలమలం.. అలమలం పుత్రా అలమలం..


మరోసారి ఈ చిత్ర సృష్టికర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ.. శలవు.

మాయాబజార్ సినిమా క్విజ్..!!


ఆ మధ్య మాయాబజార్ రంగుల్లో వచ్చినప్పుడు మా అమ్మాయిని తీసుకెళ్ళాను (రెండున్నర సంవత్సరాల వయసు). అంత చిన్న పిల్లకు కథ అర్థం కాదేమోనని దగ్గర కూర్చోపెట్టుకోని చెప్పాలని ప్రయత్నిస్తే వద్దని వారించి తనే స్వయంగా చూసింది. పైగా విరామ సమయంలో పక్కన వున్నవారికి జరిగిన కథంతా వల్లె వేసి ఆశ్చర్యపరిచింది. మొత్తమ్మీద ఆ సినిమా మా అమ్మాయికి నచ్చింది.



నచ్చింది కదా అని మొన్న ఈ సినిమాతో పాటు పిల్లలకు నచ్చే సినిమాలు (అనుకుని) బాలభారతం, యశోదాకృష్ణ, లవకుశ, భక్తప్రహ్లాద వంటి సినిమాల సీడీలు కొనుక్కొచ్చాను. అన్ని సీడీలలో మాయాబజార్ సీడిని గుర్తుపట్టి (అన్నగార్ని, ఎస్వీఆర్‌ని), అదే పెట్టమంటూ మారాం చేసింది. "ఆహా ఎంత గొప్ప సినిమా.. యాభై సంవత్సరాల తరువాత కూడా ఈ తరానికి నచ్చడమే గొప్ప.." అనుకుంటూ ఆ సినిమా పెట్టాను. మా అమ్మాయేమో ఎంతో జ్ఞాపకం పెట్టుకోని.. ఇదుగో ఇప్పుడు శశి పాట పాడుతుంది.. ఘటోత్కచుడు మీసం మెలేస్తాడు.. ఆయన చేతులు అతుక్కుపోతాయి అంటూ ముందే చెప్పేస్తోంది. నేనూ సంతోషపడి నా ఫేస్‌బుక్‌లో కూడా వ్రాసుకున్నాను..!!



ఆ తరువాత మొదలయ్యాయి మా కష్టాలు -


ఇక రోజూ అదే సినిమా.. పగలు.. రాత్రి.. మళ్ళీ మళ్ళీ.. "ఇంక చాలమ్మా" అంటే వినదు.. ఇంతకు ముందే మాయాబజార్ సినిమా డైలాగులన్నీ నోటికి వచ్చనుకుంటున్న నాకు, ఇప్పుడు నేపధ్య సంగీతం కూడా నోటికి వచ్చేసే పరిస్థితి.. మా అమ్మాయి ఇప్పటికే మాటలు పాటలు నేర్చేసుకుంటోంది..


సరే ఏది ఏమైనా ఇన్ని సార్లు మాయాబజార్ చూడటం కూడా ఒక అనుభవమే - సెట్టింగుల దగ్గర్నుంచి, ఆహార్యం వరకు, కెమెరా సంగతులు, జూనియర్ ఆర్టిస్టుల నటన దాకా గమనించే అవకాశం కలిగింది. ఆ చిత్రం పైన, ఆ దర్శకాది సాంకేతిక నిపుణులపైనా గౌరవం పెరిగింది. ఆ అనుభవంతో ఇదుగో ఈ క్విజ్.. ప్రయత్నించండి -


1. తానశర్మ తందానశాస్త్రి పెట్టిన ముహూర్తం "దగ్ధయోగం"లో వుందని, బలరాముడి ఆస్థాన పురోహితులు వారిస్తారు. (తరువాత శశిరేఖాభిమన్యుల పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుందనుకోండి అది వేరే విషయం). ఆ వారించిన పురోహితుడి పేరేమిటి?

2. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయనం చేసిన నటుడెవ్వరు?

3. తానశర్మ, తందాన శాస్త్రి విడిదిలో కొన్ని రకాల భ్రాంతులకు లోనౌతారు. అవేమిటి?

4. శకునిమామను ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు పందెం వెయ్యమని అడుగుతారు. చిత్రంగా అందరూ రెండు వెయ్యమంటారు. ఒక్కరు తప్ప. పందెం అడిగేదెవ్వరు? రెండు కాకుండా వేరే పందెం అడిగేదెవ్వరు?

5. శాకంబరీదేవి ప్రసాదం ఏమిటి?

6. సుభద్రాభిమన్యులను రథంపై ద్వారక నుంచి ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చే సారథి ఎవరు?

7. శశిరేఖ ఇష్ట సఖి పేరేమిటి?

8. అడవిలో సుభద్రాభిమన్యులను గోడకట్టి అడ్డుకునే రాక్షసుడి పేరేమిటి?

9. సుభద్రాభిమన్యులను అడవిలో ఘటోత్కచుడి రాక్షసులు ఎదుర్కునేటప్పుడు నేపధ్య సంగీతం ఏమిటి?

10. ఘటోత్కచుడి ఆశ్రమంలో దీవించడానికి వాడే పదం ఏమిటి?



మీ సమాధానాలు వ్యాఖ్య పెట్టండి.. నా సమాధానాలు రేపటి టపాలో)

ఇది నా వందొవ టపా - ఆఖరు టపా

"ఓసోస్.. ఏతంతవూ.. వంద టపాలు రాసీసినావా.. ఎలగెలగా..!!"

"యోవ్.. ఏందయ్యానువ్వా.. వంద టపాలు రాయంగానే సరా.. పదిమందైనా చూడబళ్ళేదాంట.."

"ఏంరా భై.. పరేషాన్ జేస్తున్నవ్.. దమాకిట్ల ఖరాబైంద మళ్ళ.. ఎంత మంది జూసిన్రనిగాదు.. ఎన్ని కామెట్లు గొట్టిన్రో జూడాలే.. గప్పుడే టపా మంచిగగొట్టినవా బేకారుగొట్టినవ ఎర్కైతది.."

"అదేమిటండీ మాష్షారూ.. అలాగంటే ఎలాగండీ.. వ్యాఖ్యలూ వ్యాఖ్యానాలు సరేనండీ.. అందులో "భేషుగ్గా వుంద"ని ఎన్ని వచ్చాయి.. "అబ్బే బాగాలేదురా అబ్బి" అని ఎన్ని వచ్చాయి? అది తేల్చండీ ముందు.."

***

"అయ్యా పాఠక మహాశేయులారా.. పుణ్య పోషకులారా.. మా బ్లాగు పాలిటి దేవతలారా..."

"ఏమిటా హరి కథ?"

"అబ్బ చెప్పనిస్తేగా.. ఇది నా వందో టపా.."

"ఓహో ఇలాంటివి చాలా చూశాం.. వంద టపాలు, వెయ్యి హిట్లు అనుకుంటూ.. విషయం చెప్పు"

"చెప్పడానికేముంది.. ఈ విధంబుగా నా బ్లాగును ఆదరించి, అభిమానించి, ఆస్వాదించి, ఆశీర్వదించి.."

"ఇంకా ఏమిటి దించేది.."

"దించడమంటే ఆ దించడం కాదయ్యా.. ఆనందించి, అభినందించి"

"ఈ దించుడు - నంచుడు ఆపి విషయం చెప్పవోయ్"

"అలాగలాగే. ఈ బ్లాగులో నేను కథలు వ్రాసితిని. కవితలు వ్రాసితిని. కబుర్లు వ్రాసితిని"

"ఏమిటది ఏడో ఎక్ఖం వొప్పజెప్పినట్లు? సరిగ్గా చెప్పు."

"ఇలాగైతే నా వల్లకాదండీ... నేను ఏమి చెప్పలేను."

"చెప్పకపోతే ఫో.. నువ్వుకాకపోతే కూడలికి పోతే సవాలక్ష బ్లాగులు"

"అదే చెప్పేది.. ఆ సవా లక్ష బ్లాగుల మధ్యలో మా బ్లాగు నిలబడిందా లేదా"

"ఏమిటి నీ ప్రజ్ఞే.."

"అబ్బే నా ప్రజ్ఞేపాటిది.. ఏదో చదివేవాళ్ళు పదిమంది వుండబట్టి నా రాతలు గాని.."

"పోనీలే సత్యం గ్రహించావు.."

"అది మన పేరులోనే వుంది కదా"

"ఏమిటి"

"సత్యం"

"బాగానే వుంది సంబడం.. పేరు పెట్టుకోగానే సరా? అక్కడికి లక్ష్మీ పేరు పెట్టుకున్నవాళ్ళు చెయ్యెత్తితే డబ్బులు రాలుతున్నట్లు"

"ఇదుగో మా ఆవిడనేమన్నా అన్నావో.."

"ఏమిటీ మీ ఆవిడ పేరు లక్ష్మా? ఏదో తెలియక అన్నానయ్యా బాబు. క్షమించు."
"క్షమించాములే ఫో"

"అది సరేగాని ఇంకా ఎంతకాలమిలా పలక మీద బలపం పెట్టి పిచ్చి రాతలు... దీనికి అడ్డు ఆపు ఏమైనా వుందా?"

"ఎందుకులేదు.. అయినా నా బ్లాగు మూసెయ్యాలనుకుంటున్న విషయం నీకెలా తెలుసు?"

"ఏమిటి నిజంగానే"

"అంత సంతోషపడకు.. ఇదంతా తాత్కాలికమే.. పలక-బలపం మీద రాతలు అయిపోయాయి.. పలక నిండిపొయింది. ప్రమోషన్ వస్తే కలం-కాగితం పట్టుకుంటా. లేకపోతే మళ్ళీ ఇదే క్లాసుకి వచ్చి పలకమీద రాతలన్నీ కడుక్కోని మళ్ళీ మొదట్నించి మొదలెడతా.. అంతదాకా శెలవలే శలవలు.."

(శలవు)

పెసరట్టు చదువుతూ - పుస్తకం తింటూ...

నిన్న ఆఫీసులో పని వుండి కొంచెం ఆలస్యమైంది. ఇంటికెళ్ళినా స్వయంపాకం చేసుకునే వోపిక లేకపోయింది. దగ్గర్లోనే విజయవాడ వారి అమరావతి హోటల్ గుర్తుకొచ్చింది. రిక్షా ఎక్కి అక్కడి చేరుకోని ముందుగా అక్కడే వున్న సౌత్ ఇండియన్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన సరుకులు తీసుకుంటుంటే కొత్తగా వచ్చిన స్వాతి వారపత్రిక కనపడింది. తెలుగుపుస్తకం కనపడితే (అందునా ప్రవాసంలో వున్నప్పుడు) చేతులు ఎలా ఆగుతాయి.?? వెంటనే కొనుక్కోని హోటల్లోకి అడుగు పెట్టాను.


స్వాతి చేతిలోకి రాగానే అనివార్యంగా చూసేవి బాపు కార్టూనులు - ఆపైన కోతికొమ్మచ్చి - తరువాతే ఏదైనా. ఈ వారం కోతి కొమ్మచ్చి పుస్తకావిష్కరణ గురించి ఎంబీయస్ ప్రసాద్‌గారి వ్యాసం కూడా వుంది.


"సార్ ఆడర్ ఇవ్వండి" అన్నాడు సర్వరుడు.


"ఇడ్లీ.. ఇదుగో ప్లేట్లో ఒక మూలగా కొద్దిగా కారప్పొడి కూడా వేసుకొస్తావా?" చెప్పాను.


మళ్ళీ పుస్తకంలోకి -


భలే వుందీ కార్టున్.. బాపుగారికి టీవీ సీరియల్ అంటే మా చెడ్డ కోపం అనుకుంటా - అవి చూసే లేడీస్ మీద ఎన్ని కార్టూన్లు వేసారో.. కోతి కొమ్మచ్చిఎక్కడా కనపడదే - ఆ దొరికింది.


సాక్షి - వారెవా.. అరే ఆమ్యామ్యా అనే పదం కనిపెట్టింది అల్లురామలింగయ్యగారా.. బాగుంది..

"నా రాజ్యం పెళ్ళాం ఇప్పిస్తావా అల్లు రామం?.."ఓహో సుగ్రీవుడన్నమాట.. కార్టూను హ హహ్హదిరింది


"సార్ ఇడ్లీ"


"వీడొకడు మధ్యలో... ఏమైనా ఈడ్లీ తిని ఎన్నాళ్ళైందో.. తెలుగు వారి ఇడ్లీ..!!"


అహా ముళ్ళపూడి బొమ్మ బాపు రచన.. అదేనండి ముళ్ళపూడి మాటలతో బొమ్మలేస్తున్నారు బాపూ బొమ్మల్తో కథలు చెప్పేస్తున్నారు..


ఏమిటిది చట్నీలో నల్లగా - ఒహో పోపు మాడ్చినట్లున్నాడు. సరేలే కారప్పొడి వుందిగా.. ఏదీ?? అర్రెర్రె ఇడ్లీ కింద దాకున్నావా.. వుండు నీ పని చెప్తా..


హ్మ్మ్.. అయితే ఏమంటారు.. సాక్షి సినిమాకి పల్లెటూర్లో అన్నసంతర్పణలు చేసారా? సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల - అదేదో పాటుండాలే - "దయ లేదానీకు దయలేదా..!!" పీబీ శ్రీనివాస్ కదూ పాడింది.


"సార్.. ఇంకేమన్నా కావాలా?"


"పెసరట్టు.. కొద్దిగా వుల్లిపాయలు వేసి"


కోతికొమ్మచ్చి మొదటిభాగం పుస్తకం మాత్రం దొరకలేదు. మొన్నామధ్య నెల్లూరు వెళ్ళినప్పుడు ప్రభవలో దొరుకుతుందేమోనని చూశాను. "రేగడివిత్తుల" చంద్రలతగారిదే కదా ప్రభవ.. అక్కడ రిజిస్టర్‌లో రాసి వచ్చాను తెప్పించమని. తెప్పిస్తే మా వాళ్ళకి చెప్పి కొనిపించి వుంచాలి..!!


పుస్తకావిష్కరణ గురించి చాలా బాగా వ్రాసారు ప్రసాద్ గారు - ఎంత అదృష్టం బాపు రమణల్ని సన్మానించడం వారి చేతులు మీదుగా సన్మానం పొందడం..! వేమూరి బలరాం గారు చాలా గొప్‌ప్‌ప్ఫ పని చేశారు. మళ్ళీ వంశీతో "మా దిగువ గోదావరి కథ"లట. మళ్ళీ బాపు కుంచె ఝుళిపిస్తారు..!!


ఏమిటిది పెసరట్టు మాడినట్లుంది - మాడినా పెసరట్టు అల్లం చెట్ని రుచే వేరు - ఒహో ఇది అల్లం చెట్నీ కాదా సాంబారు కాస్త గట్టిపడినట్లుంది -ఫర్లేదులే -


ఇంతకీ ఏమిటంటారు - రమణగారు మాట్లాడదామని మైకు ముందుకి రావటమే గొప్ప విషయం.. ఈ జనాలు సరిపోయారు ఏకబిగిన అలా చప్పట్లు కొడితే చివర్లో కొట్టే చప్పట్లు అనుకున్నారేమో ఆయన మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయారట. ఏమిటిది నా కళ్ళు చమర్చాయి - అబ్బే లేదు లేదు మిరపకాయ కొరికినట్లున్నా..!! రావికొండలరావు మాష్టరుతో ఏకిభవిస్తున్నా - ఏమిటీ.. కోతి కొమ్మచ్చి అంటూ ఈ బాపూ రమణలు అటూ ఇటూ గెంతుతూ - చక్కగా సూటిగా ఒక్క విషయం చెప్పలేరూ - సాంబారులో ఏమిటిది వుప్పు తక్కువ!!


ఎక్కడిదీ కాఫీ ఘుమ ఘుమ? - నా ముందే పెట్టాడే..! ఒహో నేనే ఆడర్ ఇచ్చానా?ఎప్పుడూ? గుర్తులేదే?

హమ్మయ్య స్వాతిలో నేను చదవాలనుకున్నవి అయిపోయాయి. ఇంక తీరిగ్గా ఇంటికివెళ్ళి మిగిలినవి చదువుకోవచ్చు.

"టిఫిన్ ఎలా వుంది సార్"


"బాగానే వుంది - సాంబారులో వుప్పు తగ్గింది, చట్నీలో పోపు మాడింది, పెసరట్టు ఎక్కువగా కాల్చారు.. ఇదుగో పెసరట్టులో వుల్లిపాయలంటే చిన్నచిన్న ముక్కలుగా తరగాలి - ఇలా పెద్ద పెద్ద ముక్కలు కాదు. కాఫీ రుచిపచి లేదు"

"అది కాఫి కాదు సార్.. టీ"


"ఏదో వొహటి.. చేతులు కడుక్కొస్తా గ్లాసులో కాసిని నీళ్ళు పొయ్యి" అంటూలేచాను. చేతులు కడుక్కోని తిరిగొచ్చేసరికి స్వాతి పుస్తకం మీద నీళ్ళుపడి "రేయ్.." వు-న్నా- "సర్వరా.." యి.


"సార్"


"నీకు కళ్ళు కనపడటంలేదా? పుస్తకం మీద నీళ్ళు పోస్తావా? అదీ బాపుకార్టూన్ తడిసేట్టు పోస్తావా.. నువ్వేం గడ్డి పెట్టినా తిన్నాను.. ఇదామర్యాదా.. ధాం ధూం.."


పెట్టిన టిఫిన్ బాలేకపోయినా ఏమి అననివాడు పుస్తకం తడిస్తే ఎందుకు అరుస్తున్నాడో సర్వరుడికి అర్థం అయినట్లు లేదు.


(బాపూ రమణలకి జయహో)

యాభైల్లో పత్రికాప్రకటనలు - 2


(గత టపా తరువాయి)

డాక్టరు కావడం ఇంతకన్న సులభం కాలేదు..!! జై "జుల్లుంధర్" సిటీ.



ప్రచురణ సంస్థ పేరు చేస్తున్న సేవకు తగ్గట్టుగానే వుంది..


మొబైల్ డాక్టర్.. ఈ షాపులు ఇప్పుడున్నాయో లేదో..


ఈ రెండు ప్రకటనల్లో ఒకటి వాచి కొంటే బైనాకులర్స్ ఫ్రీ ఇంకొకటి ఏదో తైలం కొంటే వాచీ ఫ్రీ... అసలు ఈ సన్యాసి ఫార్మసివారు ఫరీదాబాద్ నుంచి, ఇండో ట్రేడింగ్ వారు బొంబాయి నుంచి ఇవన్నీ పంపిస్తారంటారా?


ఈ "జుల్లుంధర్"లో మొత్తానికేదో విషయం వుంది. మీరు పువ్వు పేరు కార్డురాస్తే మీ జాతకం చెప్పడమంటే మాటలా? అదిన్నూ రూపాయి నాలుగణాలకే..!!


ఇది నాకు బాగా నచ్చింది - ఏ హడావిడి లేకుండా చెప్పదల్చుకున్నది బొమ్మలో చెప్పేసారు..


అదండీ విషయం.


(రచన పత్రిక వెబ్సైటులో కథా ముత్యాల పేరిట పాత కథలు పెట్టారు. ఆ కథల మధ్యలో నుంచి సేకరించినవే ఈ ప్రకటనలు.)

యాభైల్లో పత్రికాప్రకటనలు - 1

1950 ప్రాంతంలో కొన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూడండి -

మరీ బొత్తిగా మూడు రూపాయల ఎనిమిదణాలే.. పోనీ ఒహట్రేండు తీసుకుందారేటి?


అహా చతుర్ముఖ పారాయణానికి శ్రేష్టమైనవి... ఆకర్షణీయమైన డిజైనుతో దివ్యంగా వుంటాయట..


ఈ పేస్టు ఎప్పుడైనా వాడారా? పళ్ళపొడిగా కూడా దొరుకుతుందట..!! అన్నింటికన్నా చివర వాక్యం గమనించారా - "రెమి హాస్యనాటకం - ప్రతి శుక్రవారం రేడియో సిలోను 41.72 మీటర్ల మీద సా. 6-00 నుండి 6-45 వరకు వినండి"


టీ కాఫీ పాలు గంజి పళ్ళరసం - అన్నింటికి ఒకటే ప్రత్యామ్నాయం


రామ బాణం.. హ హ హ


డాక్టరు కావడం ఇంత సులభం అని మీరెప్పుడైనా ఊహించారా?


మరికొన్ని తరువాతి టపాలో...

విమానయానంలో పదనిసలు

విమానయానం ఒకప్పుడు కొందరి కల. ఇప్పుడు చాలామందికి అది చాలా సాధారణ వీషయం అయిపోయిందనుకోండి. దాదాపు అయిదేళ్ళ క్రితం నా మొదటి విమాన ప్రయాణం మొదలుకోని ఇప్పటిదాకా కొన్ని తమాషా అనుభవాలు ఎదురయ్యాయి నాకు. మచ్చుకి రెండు -

1
ఒకానొక సందర్భంలో విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. నిజానికి బాపట్లలో ఒక పని ముగించుకోని వెంటనే హైదరాబాదులో ఒక మీటింగ్ అటెండ్ కావాల్సి వుండటంతో ఈ సాహసం చెయ్యాల్సి వచ్చింది. బాపట్ల నుంచి రెండున్నర గంటలు విజయవాడ ప్రయాణం, అక్కడినుంచి గన్నవరం, ఒక గంట ముందు చేరి, విమానం ఒక గంట లేటు అంతా కలుపుకుంటే ఏ కారులోనే హైదరాబాద్ చేరుకునేవాణ్ణి. అదే ఇప్పటి శంషాబాదు ఏయిర్‌పోర్ట్ అయితే మరో రెండు గంటలు కలుపుకోవచ్చు. సరే ఒకసారి కమిటయ్యాను కదా అని అలా కానిచ్చాను.


గన్నవరం విమానశ్రయం చూశాక అదొక షాక్. కొంచెం కొత్తగా కట్టిన బస్టాండ్ మాదిరిగా వుంది. ఆటో వాళ్ళు లోపల తిరుగుతున్నాను. సమోసా టీ లోపల అమ్ముతున్నారు. (ఇప్పుడు కొంత బాగుపడింది లెండి). నేను వెళ్ళిన రోజు ఎనౌన్స్‌మెంట్ పని చెయ్యటంలేదని ఒక అమ్మాయి వచ్చి - "హైదరాబాద్.. హైదరాబాద్ ఎవరండీ" అంటూ అరిచింది.

నవ్వుకుంటూ వెళ్ళి విమానం ఎక్కాను. అప్పుడు ఏయిర్ డెక్కన్‌గా పిలువబడే విమానమది (కింగ్‌ఫిషర్ రెడ్ అయ్యింది). లోపల నేను కూర్చున్న తరువాత ఒక్కసారిగా అత్తరు వాసన గుప్పుమంది. చూస్తే ఒక ముస్లిం కుటుంబం. సకుటుంబ సపరివార సమేతంగా ఒక పదిహేనుమంది ఎక్కారు. వాళ్ళలో కాస్త చదువుకున్నాయన ఎర్‌హోస్టెస్ దగ్గరకు వెళ్ళి "ఏ సీట్‌లో కూర్చోవాలే?" అడిగాడు బోర్డింగ్ పాస్ చూపిస్తూ.

"ఫ్రీ సీటింగ్ సార్" చెప్పిందామె.

"అంటే"

"ఎక్కడైనా కూర్చోవచ్చు.."

"ఏంటీ?"

"ఎక్కడైనా కూర్చోవచ్చండి.."

వింటూనే ఆయన వెనక్కితిరిగి "సునే.. ఇది భీ మన ఎర్ర బస్సు లెక్కనే ఎక్కడైనా కూర్చోవచ్చు.." అన్నాడు.

ఏయిర్హోస్టెస్ ఎర్ర మేకప్పు బుగ్గలు మరింత ఎర్రగా అయ్యాయి.

2

2008 డిసెంబరు రెండొవ వారంలో ఒక రోజు. నేను డిల్లీ నుంచి ఇండోరుకి ప్రయాణం చేస్తూ ఇండియన్ విమానంలో అడుగుపెట్టాను. నా సీటు అత్యవసర (ఎమర్జెన్సీ) ద్వారం వెనకగా వున్న వరసలో కిటికీ సీటు. అత్యవసర ద్వారం దగ్గర వున్న మూడు సీట్లలో ఒక చిన్న పాప ఆ అమ్మాయి తల్లిదండ్రులు (పంజాబీ జంట) వున్నారు. విమానమెక్కడం మొదటిసారనుకుంటా ఆ చిన్న పిల్ల చాలా సంబరంగా కిటికీ పక్కన కూర్చొని సంతోషపడుతోంది. ఇంతలో ఏర్‌హోస్టెస్ వచ్చి చిన్న పిల్లలు అత్యవసర ద్వారం దగ్గర కూర్చోను వీల్లేదంటూ అభ్యంతరపెట్టింది.

ఆ పిల్లకేమో కిటికీ దగ్గర కూర్చోవాలని.. చివరికి నేను కూర్చున్న వరస లోకి వారిని మార్చి మమ్మల్ని ముందుకు పంపారు. నేను కూర్చున్న వరసలో వున్న ఒకతను సీటు మారనని మొరాయించడంతో నాలుగైదు మార్పులు చేసేసరికి చివరికి నేను కిటికీ సీటు వదిలిపెట్టి ఐల్ సీటుకు చేరుకున్నాను. విమానం బయలుదేరింది.

నా పక్కన కూర్చున్న ఇద్దరికి ముందే పరిచయం వున్నట్లుంది.. అదే పనిగా మాట్లాడుకుంటున్నారు. మధ్యసీటులో వ్యక్తి ఏర్‌హోస్టెస్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు స్వల్పాహారం ఇస్తుందా అని పదే పదే తొంగి చూస్తున్నాడు. అప్పటికే గంటన్నర ఆలస్యమైందని అందుకే భోపాల్ వెళ్ళి ఇండోరు వెళ్ళాల్సిన ఫ్లైటు ముందు ఇండోరు వెళ్ళి ఆ తరువాత భోపాల్ వెళ్తుందని చెప్పారు.

నేను సంతోషపడ్డాను. విమానం ఆలస్యమైనా నేను సమయానికే ఇల్లు చేరుకుంటానని.

"ఛ.. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నా" అన్నాడు నా పక్కన కూర్చున్నతను.

"ఓ.. చేసుకున్నారా?" అంటూ ఆశ్చర్యపోయాడు కిటికీ సీటు.

కొంతసేపటికి ఏర్‌హోస్టెస్ వచ్చి స్వల్పాహారం వడ్డించింది. నా పక్కన కూర్చున్నతను తన జేబులోనించి ఒక మంచినీళ్ళ బాటిల్ తీసాడు. ఇండియన్ ఫ్లైట్లలో సర్వ్ చేసే ఇండియన్ స్ప్రింగ్ 200ఎంఎల్ బాటిలే అది. మూత తీయగానే విషయం గుప్పుమంది - అందులో వుంది నీళ్ళు కాదు.. వోడ్కా.

నేను ఖంగారుగా "ఏమిటిది" అన్నాను.

"సారీ నేను మిలటరీలో పనిచేస్తున్నాను. టైముకు పడకపోతే ఇబ్బంది అందుకే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. భయపడకండి.. మీకెలాంటి ఇబ్బంది వుండదు. కావాలంటే నా ఐడీ కార్డ్ చూపిస్తాను" అన్నాడు.

నేను "ఫర్లేదు" అన్నాను. అంతలో నాకు మరో షాక్ - అతను మరో జేబులోనించి ఒక నిమ్మకాయ, చిన్న బటన్ నైఫ్ తీసాడు. పద్ధతిగా నిమ్మకాయ కోసి, విమానంలో ఇచ్చిన టీ కప్పులో పిండాడు. వోడ్కా, మంచినీళ్ళు కలిపాడు. తనతో తెచ్చుకున్న బాటిల్, ఎయిర్లైన్స్ వారు ఇచ్చిన బాటిల్, రెండింటిలో ద్రావకాన్ని నింపుకోని మూతలు బిగించాడు. ఇంక చెప్పేది ఏముంది? దర్జాగా ఏ బారులోనో కూర్చున్నట్టు కొంచెం కొంచెంగా సిప్ చేసుకుంటూ, మధ్య మధ్యలో ఎయిర్లైన్స్ ఇచ్చిన కట్‌లెట్ తింటూ..!!

"అసలు కత్తి జేబులో పెట్టుకోని సెక్యూరిటీ ఎలా దాటి వచ్చారు సార్?" షాక్ నించి తేరుకోని అడిగాను.

"ఇంకొక విషయం చెప్పనా? సీటు కింద బ్యాగులో సిగెరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె కూడా వున్నాయి.. ఇంతకు ముందు విమానంలో బాత్రూంలోకి వెళ్ళి సిగిరెట్ కూడా తాగేవాణ్ణి. ఈ మధ్య చెయ్యట్లేదు" అన్నాడు. కిటికీ సీటులో వున్న అతని మిత్రుడు నవ్వి అవునన్నట్లు తలవూపాడు.

"అసలెలా సాధ్యం? సెక్యూరిటీ వాళ్ళు పై నించి కిందదాకా తడిమి తడిమి చూస్తారు కదా?" అడిగాను నేను.

"వాళ్ళ ముఖం.. ఈ సెక్యూరిటీగాళ్ళ పైన నన్ను ఇన్‌చార్జిగా వెయ్యమను వారం రోజుల్లో అందరినీ సస్పెండ్ చేయిస్తాను.." అన్నాడు.

"ఎలా తెచ్చారు అని అడుగుతున్నాడు" గుర్తు చేశాడు కిటికీ సీటు.

"అలాంటివి చెప్పకపోవడమే మంచిది.. కేమోఫ్లాజ్ అని ఒకటుందిలే.. మిలటరీ ట్రైనింగ్‌లో నేర్పించారు.." అన్నాడు నవ్వుతూ.

నేను ఇంకేమీ మాట్లాడలేదు.

ఒక మందు బాటిల్, ఒక కత్తి, ఒక అగ్గిపెట్టె విమానంలోకి తేవడం ఎలాగో తెలిస్తే ఎన్ని ఘోరాలు జరుగుతాయో అని ఆలోచిస్తే ఇప్పటికీ వళ్ళు జలదరిస్తుంది.

కార్పొరేట్ గీత

పార్థా!

ఈ సంవత్సరం బోనస్సు రాలేదని పశ్చాత్తాప పడవద్దు..

ఇంక్రిమెంటు వస్తుందో రాదో అని విచారించవద్దు..

జీతం తరగకుండా వచ్చిందని సంతుష్ఠుడివై వుండు..

నీ జేబులోంచి ఏం పుట్టిందని, ఇప్పుడు పోయిందని బాధపడుతున్నావు

వచ్చినదంతా మీ కంపెనీ నించే వచ్చింది

నిన్న నువ్వు లేనప్పుడు కంపెనీ వుండేది

రేపు నువ్వు లేనప్పుడు కంపెనీ అలాగే వుంటుంది

కంపెనీ శాశ్వతం కాని నువ్వు కాదు

నువ్వు ఏమి చేసినా కంపెనీ కోసమే చేశావు

డిగ్రీ తీసుకొని వచ్చావు

పొయ్యేటప్పుడు ఎక్స్పీరియన్సు తీసుకొని పోతావు

ఈ రోజు నీదనుకుంటున్న కంప్యూటర్

నిన్న మరెవరిదో

రేపు ఇంకెవరిదో అవుతుంది

ఇది నీదేనన్న మాయలో నువ్వు సంతోషపడుతున్నావు

ఆ సంతోషమే అన్ని కష్టాలకు మూలం

మార్పు అనేది కంపెనీలలో శాశ్వతమైన నియమము

బెస్ట్ పెర్ఫార్మర్ అయిన నువ్వు మరో గంటలో వర్స్ట్ పర్ఫార్మర్ కాగలవు

నెంబర్ వన్ అనిపించుకున్న నువ్వే రేపు టార్గెట్ సాధించలేక పోవచ్చు

అందుకే

ఇంక్రిమెంటు లేదని బాధ పడకు

జీతమొచ్చినందుకు సంతోషించు

అప్రైజల్, ఇన్సెంటివ్ వంటివి నీ మనసులోనుంచి తొలగించు

నీ ఆలోచనలనుంచి తొలగించు

నిన్ను నీవు కంపెనీకి అర్పించుకో

అప్పుడు కంపెనీ నీకు గాని, నీవల్ల కంపెనీకి గాని

ఎలాంటి ఆశలు వుండవు


(ఇదం కార్పొరేట్ గీత, చివరి అధ్యాయం, ఇంక్రిమెంట్ల పర్వం సమాప్తం)

(ఒక ఈమైల్ ఆధారంగా కార్పొరేట్ కాశీ మజిలీ కథలకోసం తయారు చేసినదిది..)

గాంధీగిరి - గాంధీ సిద్ధాంతాలు

ఆఫీసులో నా క్యూబికల్ సాఫ్ట్‌బోర్డ్ పైన ధ్యాన ముద్రలో వున్న గాంధీ బొమ్మ ఒకటి వుంది.

నిన్న ఒక అమ్మాయి ఏదో పని గురించి నా దగ్గరకు వచ్చి ఆ బొమ్మ చూసి "మీకు గాంధి అంటే ఇష్టమా?" అని అడిగింది.

"గాంధీ మొత్తం కాదు.. గాంధీలో కొన్ని విషయాలు మాత్రమే ఇష్టం" అన్నాను.

ఆ అమ్మాయి చిత్రంగా చూసి "ఏమిటవి" అంది.

"చాలా వున్నాయి ముఖ్యంగా మొండితనం" అన్నాను. ఏమనుకుందో ఇంకా ఆ విషయం పై చర్చ కొనసాగించలేదు.

***

లగే రహో మున్నా భాయి (తెలుగులో శంకర్ దాదా జిందాబాద్) చూశారుగా. అందులో గాంధీగిరి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం ఎదుటివాడు ఒక చెంపమీద కొడితే మరొ చెంప చూపించాలి, ఎదుటివాడు ఉమ్మేస్తే అతని ఎదురుగానే అది తుడవాలి, లంచం కోసం వేధించే వుద్యోగి ముందు నిలబడి నిలువు దొపిడీ ఇవ్వాలి..!! ఇలాగే ఇంకా ఎన్నో. చిత్రం గమనించారో లేదో ఇక్కడ గాంధిగిరి పాటించేవాడు నిస్సహాయుడు. ఎదుటివాడి కన్నా మనం బలవంతులమైతే (లేదా బలవంతులం అని అనుకున్నా సరే) వెంటనే తిరగబడతాం. ఎదుటివాడు మనకన్నా బలవంతుడైతే మనం ఏం చెయ్యలేం. అప్పుడే గాంధీగిరి పనిచేస్తుంది.

సినిమాలో గుర్తుందా - కిళ్ళీ నములుతూ వుమ్మేసే అతను చాలా బలవంతుడుగా వుంటాడు.. ఆ కిళ్ళీ మరకలు తుడిచేవాడు సన్నగా బలహీనంగా వుంటాడు. అలా కాకుండా వుమ్మేసేవాడు సన్నగా వుండి ఆ ఇంటి ఓనరు కండలు తిరిగివుంటే..?? వెంటనే చొక్కా పట్టుకుంటాడు. కాబట్టి గాంధిగిరి అసహాయులకి, బలహీనులకి బాగా వుపయోగపడే ఆయుధం. బలహీనులు బలవంతులను ఎదిరించే ఆయుధం తయారు చెయ్యడం గొప్ప విషయం. ఇది ఒక కారణం గాంధి ఫోటో నా సాఫ్ట్ బోర్డ్ పైన పెట్టుకోడానికి.

***

ఏదో తప్పు చేశాడని తండ్రి కొడుకుని కొడతాడు. ఇక్కడ తండ్రి బలవంతుడు కొడుకు నిస్సహాయుడు. వెంటనే కొడుకు నేను అన్నం తినను ఫో అని అలిగి కూర్చుంటాడు. చాలా సహజమైన దైనందిన విషయం ఇది. ఇదే విషయం గాంధీ చేతిలో సత్యాగ్రహమైంది. "నేను చెప్పినది జరిగే దాకా నేను అన్నం తినను" అని మొండికెయ్యడమే కదా సత్యాగ్రహం.
అలాంటప్పుడు సామాన్యంగా ఏ తండ్రి అయినా మూడు రకాలుగా వ్యవహరిస్తాడు -

మొదటిది: "తినకు నాకేం నష్టం? ఎంతసేపు అలా వుంటావో నేనూ చూస్తాను." అనడం. ఇది ఎక్కువ సేపు నిలవదు. మిగిలిన రెండు మార్గాలలో ఎదో ఒకటి చెయ్యక తప్పదు.

రెండొవది: అన్నం పళ్ళెంలో పెట్టి వాడి ముందు పడేసి "తిను.. ఎందుకు తినవో నేనూ చూస్తా.. ఈ కర్ర ఇరిగిపోతుందివేళ.." అంటూ చావబాదటం. ఇలాంటి ప్రయత్నమే బ్రిటీషు చెయ్యబోయి (లాఠీలతో సత్యగ్రహులను కొట్టడం) అది పని చెయ్యదని నిరూపించారు.

ఇక మూడొవది: "మా నాయన కదూ.. మా తండ్రివి కదూ. పోనీ నువ్వడిగిన సైకిల్ కాదుగాని కొంచెం చిన్నది కొనిస్తాలే" అంటూ బేరానికి దిగడం. ఈ బేర సారాల్లో ఆ పిల్లాడు తనకు కావల్సినవి సాధించుకోవచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ సాధించుకోవచ్చు.. లేదా కావల్సినదానికన్నా తక్కువ సంపాదించుకోవచ్చు

(అసలిదంతా మానేసి "నువ్వు అన్నం తినే వరకు నేను తినను" అని రివర్స్ సత్యాగ్రహం చెయ్యడం ఇంకో పద్ధతి. అంటే - "నాయనా నీ సత్యాగ్రహం పైన నేను ప్రయోగించే సామ దాన భేద దండోపాయలు పని చెయ్యవు. కాబట్టి ఇప్పుడు నేను నిస్సహాయుణ్ణి. అందుకే సత్యాగ్రహం" అని అంగీకరించడమే)

మొత్తం మీద చెప్పేదేమిటంటే బలహీనుల మరో ఆయుధం సత్యాగ్రహం..!

***

ఇక మూడొవది - అహింస.

ఇందాక చెప్పినట్లు బలహినులకి, నిస్సహాయులకి బాగా పనికి వచ్చే సాధనం నిరసన, సత్యాగ్రహం, గాంధిగిరి..!! మరి ఈ బలముండటం, బలంలేకపోవటం అనేవి గిరిగీసినట్లుగా వుండవు. స్థాన, సమయాదుల బట్టి బలవంతులు బలహీనులు కావచ్చు, బలహీనులు బలవంతులు కావచ్చు. శంకర్‌దాదా సినిమాలో నిజానికి చిరంజీవి శత్రువు కన్నా బలవంతుడే కదా..!! అయినా ఒక సంధర్భంలో తను నిస్సహాయుడై గాంధీమార్గం పడతాడు..!! అలా గాంధీగిరిలో పడ్డా కథానాయుకుడికి (తన బలం గురించి తెలిసీ) శత్రువుని కొట్టకుండా వుండటం గొప్ప పరీక్ష. అందునా ఎదుటివాడు కొట్టినా మనం కొట్టకుండా వుండాలంటే అందుకు ఎంతో మనఃశక్తి కావాలి. ఎవరు కొట్టినా తిట్టినా నేను తిరగబడను అని అనుకోవడమే అహింస.

బలవంతుడైనా, బలహీనుడైనా ఇలా తిరగబడకుండా, శత్రువు పెట్టే కష్టాల్ని భరించి వుండాలంటే చాలా కష్టం. దానికి కావాల్సింది మనసిక బలం, స్థిత ప్రజ్ఞత లాంటివాటికన్నా ముఖ్యమైనది మొండితనం. అవును మొండితనం..!!

అ మొండితనమే శక్తినిస్తుంది. బలాన్నిస్తుంది. ఏమి జరిగినా నేను ఇలాగే వుంటాను అని చెప్పడం (చిరంజీవి చేతులుకట్టుకోని ప్రతినాయకుడి ఇంటి ముందు నిలబడటం) మొండితనం కాక ఇంకేమిటి..!!

మొండికెయ్యడం అనే విషయం ఒక సిద్ధాంతంగా మారటం ఆశ్చర్యమే కదా..!!

***

అయితే ఈ సిద్ధాంతాన్ని, ఈ ఆయుధాలని ఎప్పుడు వాడాలి అనేదానికి మార్గనిర్దేశ్యం చేసేది సత్యం. ఈ సత్యమే గాంధీ సిద్ధాంతాలకి ఆయువు పట్టు. ఇది లేకపోతే అన్యాయమైన కోరికలు తీర్చుకోడానికి ఈ ఆయుధాల వాడకం జరుగుతుంది. అలా జరకుండా ధర్మ మైన కోరికల కోసం వాడాలంటే అందులో సత్య వున్నది లేనిది బేరిజు వేసుకోవాలి. ఆ సత్యమే గాంధిగిరీ చెయ్యాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది.

***

ఆఖరుగా ఒక మాట - ఒకోసారి మనకి న్యాయమైనది, ధర్మమైనది మరొకరి న్యాయం కాకపోవచ్చు. కాబట్టి గాంధీ గాంధీగిరి ఆయుధాలు వాడిన సంధర్భాలన్నీ అందరికీ న్యాయమైనవి అనిపించక పోవచ్చు. గాడ్సేకి అనిపించలేదు. నాకు కూడా గాంధీ సత్యగ్రహం చేసిన కొన్ని సంధర్భాలు న్యాయమైనవి కావు అనిపించింది. అంతమాత్రాన ఆయన తయారు చేసిన సిద్ధాంతాల విలువ మాత్రం నా దృష్టిలో తగ్గలేదు.

అందుకే గాంధీ అంటే నాకు ఇష్టం అని చెప్పలేదు.. గాంధీలో కొన్ని విషయాలే ఇష్టం అని చెప్పాను. ఆ నచ్చిన విషయాలు నాకు గుర్తుచెయ్యడానికి ఆయన ఫొటో అక్కడ పెట్టాను.

***

ఇంత వివరంగా చెప్పాలి - నేను గాంధీ ఫొటో నా సాఫ్ట్ బోర్డ్ మీద ఎందుకు పెట్టుకున్నానో చెప్పాలంటే.. అంత తీరిక ఆ అమ్మాయికీ లేదు.. చెప్పే తిరిక నాకు లేకపోయింది. అందుకే ఇక్కడ రాసుకున్నాను

మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!

రాజుకాయ - దోసకాయ - తులసి - వాము

నాకు పదేళ్ళ వయసున్నప్పుడు ఒకసారి మా పెదనాన్న ఒక పద్యం చెప్పాడు. గజేంద్రమోక్షం గురించిన ఆ పద్యం ఇదిగో -

ఎంతదయో దాసులపై
పంతంబున మకరి పట్టి బాధింపంగా శ్రీ
కాంతుడు చక్రం పంపెను
దంతావళి రాజుకాయ దత్తాత్రేయా

నాలుగుసార్లు అదే పద్యం చెప్పాడేమో ఆ పద్యం నా నోటికొచ్చేసింది. కాని చాలా రోజులదాకా ఆఖరి పంక్తిలో వున్న రాజుకాయ ఏమిటో అర్థమయ్యేదికాదు. మామిడికాయ, అరటికాయ లాగా ఇది కూడా ఏదో కాయ కాబోలని సరిపెట్టుకున్నాను. ఈ మధ్యే మళ్ళీ ఆ పద్యం గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. దంతావళి (దంతములు కల - ఏనుగుల) రాజు - కాయ (కాపాడను) అని అర్థమని మీకిప్పటికే అర్థమయ్యే వుంటుంది.

ఆ తరువాత అదే పెదనాన్న ఈ పద్యానికి పేరడీ పద్యం కూడా చెప్పాడు -

ఎంతదయో దోసకాయలపై
పంతంబున చెక్కుతీసి భాగింపంగా శ్రీ
కాంతుడు కారం పంపెను
దంతాలకు చేటు వచ్చే దప్పిక తీరన్.


కవిగారి చెమత్కారం కాకపోతే శ్రీకాంతుడి కారం పంపటమేమిటి..? అది రాజుకాయ నుంచి దోసకాయ దాకా కథ.

***

ఇదిలావుంటే చిలకమర్తివారి గణపతి గుర్తున్నాడుగా.. సదరు గణపతి "శ్రీ రఘురామ" పద్యానికి చెప్పిన వివరణ గుర్తుందా -

"శ్రీరఘురామ చారు తులసీ దళ" - శ్రీరాముడు ఒకసారి చారు కావాలనుకున్నాడట.. ఆ వూరిలో (ఏదీ అయోధ్యా నగరంలో...హతవిథీ) కర్వేపాకు దొరకటం దుర్లభం కావటంతో తులసీ దళములను ప్రత్యామ్నాయంగా వాడారుట. అట్టి చారు తాగడంతో శ్రీరాముడికి "సమక్షమాది శృంగార గుణాలు" కలిగి, అన్నిలోకాలను జయించే "శౌర్య రమాలలాముడై", "దాశరధి కరుణాపయోనిధియై " వెలుగొందాడట.

ఇలాంటిదే మా నాయనమ్మ ఒక పద్యం చెప్పేది -

వామే భూమి సుత, పురస్చ హనుమాన్
పస్చాత్ లక్ష్మణహ సుగ్రీవో జాంబవాన్...


ఇలా సాగుతుందీ పద్యం (తరువాత పంక్తులు గుర్తులేవు..!)

ఈ పద్యానికి చాలాకాలం నేను నమ్మిన అర్థం ఏమిటంటే (మా నాయనమ్మ చెప్పిందే) -

ఒకసారి శ్రీరాముడికి కడుపులొ నొప్పివచ్చిందట. "సీతా..! కాస్త "వాము" తెచ్చిపెట్టవే" అన్నాట్ట శ్రీరాముడు. సీత - "నేను పోలేను ప్రభు కిందే కూర్చొని హనుమంతుడున్నాడుగా" అన్నది. హనుమంతుడు లక్ష్మణుడి పేరుచెప్పి తప్పుకున్నాడట, లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి అడగచ్చుగా అన్నాడు... అక్కడినుంచి జాంబవంతుడు, భరతాదులు ఇలా అందరూ ఒకరంటే ఒకరనుకున్నారు కాని రాములవారికి వాముతెచ్చేవాడే లేకపోయారట.

ఒకరోజు ఏదో పుస్తకంలో ఆ పద్యం చదువుతూవుంటే ఆ అర్థం సరికాదేమో అనిపించింది. అప్పుడు వెలిగింది - వామే భూమిసుత అంటే ఎడమవైపు (వామహస్తం అంటే తెలుసుగా..!) సీతాదేవి వుంది, కాళ్ళదగ్గర హనుమంతుడు - అంటే ఈ పద్యం శ్రీరామపట్టాభిషేకం గ్రూప్ ఫొటో వర్ణనన్నమాట. వామ వైపు కాస్తా వామైపోయిన విధం గుర్తొస్తే ఇప్పటికి నవ్వొస్తుంటుంది.

ఇది తులసి - వాముల కథ.

ఈ ఫోటోకి కామెంట్ వ్రాయండి




చూశారా ఈ చిత్రం..!! ఇందోర్ ఏర్‌పోర్ట్‌లో కనపడిన ఈ చిత్రాన్ని కెమెరాలో ఇలా బంధించాను..!!

దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోందో కామెంటుతారు కదూ..!!

"దిల్‌వాలోం కా షహర్ దిల్లీ" అనబడు ఢిల్లీ కబుర్లు

"అయితే డిల్లీలో వుంటున్నావన్నమాట..!! ఏమిటి ఢిల్లీ సంగతులు..??"



"అమ్మమ్మా.. ఢిల్లీ అనకూడదటండీ దిల్లీ అనాలట.. దిల్ వాలోంకా షహర్ దిల్లీ"



"అదేమిటయ్యా ఢిల్లీ మన దేశ రాజధాని అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా"



"నిజమే.. బాంగ్లోర్, కలకట్టా, బాంబే, మదరాసు అనే వూర్ల గురించి కూడా చదివే వుంటారు"



"అవును అయితే?"



"ఇప్పుడవి బెంగుళూరూ, కోల్‌కత్తా, ముంబై, చెన్నై కాలేదు.. అలాగే ఇదీనూ.."



"ఏమిటి పేరు మార్చేస్తున్నారేమిటి?"



"మారుద్దామనే అనుకుంటున్నారు.."



"సరే అలాగే మారనీ.. దిల్లీ అనే అందాం.."



"అమ్మమ్మా.. అలా మీరు తీర్మానిచ్చేస్తే ఎలా? దిల్లీ అనే పేరు అచ్చి రాదని సంఖ్యా శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలా చేస్తే రాజధానిలో అశాంతి పెరిగి కల్లోలాలు అధికమౌతాయట.."



"అక్కడికేదో తక్కువున్నట్లు.. ఢిల్లీలో క్రైంరేటు ఎక్కువైందని.. మన టీవీ చానల్లో "నేరాలు ఘోరాలు" "అర్థరాత్రి అకృత్యాలు" లాంటి సీరియల్ వాళ్ళంతా ఢిల్లీలోనే మకాం పెట్టారటగా.."



"నిజమేననుకోండి.. అవి ఇంకా ఎక్కువౌతాయని భయపెడుతున్నారు.."



"మరి ఎలా?"



"ఏముంది.. దిల్లీ పేరులో నాలుగు ఎల్(L) అక్షరాలు పెట్టమనో.. మూడు ఐ(I)లు వచ్చేట్లు పెట్టమనో అదే సంఖ్యా శాస్త్ర నిపుణులు చెప్తారు.. అందాకా ఢిల్లీ అనో కొత్త ఢిల్లీ అనో అనుకోవడమే.."



"బాగా చెప్పావ్.. అసలీ గోల లేకుండా పూర్వ నామం హస్తినాపురం వుండనే వుందిగా.."



"గట్టిగా అనకండి.. మళ్ళీ ఇదొక కొత్త గోల కాగలదు."



***



"అయితే డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ నేరాల విషయమై ఏం చేస్తున్నట్లు"



"తల పట్టుకు కూర్చున్నట్లు"



"అదికాదబ్బాయ్.. అవి తగ్గించడానికి ఏమి చెస్తున్నట్లు అని"



"అంతకన్నా పెద్ద సమస్య నెత్తిన వుంటే దీని సంగతేమి చూస్తుంది"



"ఏమిటి పవర్ కాపాడుకోవడమా?"



"కాదు పవర్ కట్ లేకుండా కాపాడుకోవడం"



"అంటే"



"అంటే విద్యుత్ అంతరాయాలు తగ్గించడం"



"ఏమిటి రాజధానిలో పవర్ కట్టా?"



"అది మాత్రం అడగకండి.. నాకు ఏడుపొస్తుంది"



"అదేం?"



"మొన్న రాత్రి ఐదు గంటలు కరెంటు లేదు"



"హమ్మయ్యో.. మరెలా?"



"ఏముంది.. మేలుకోని బాల్కనీలో కూర్చోని లైన్ మేన్ నుంచి పవర్ మినిష్టర్ వరకూ అందరినీ తిట్టుకుంటూ.. పిల్లలకి పుస్తకాలతో విసనకర్రలతో విసురుకుంటూ తూగడమే.."



"అయ్యయ్యో.. ఎందుకలా"



"డిల్లీకి అవసరమైనంత కరెంటు వుత్పత్తి కావటంలేదు.. కాదు కాదు.. వుత్పత్తి అవుతున్న విద్యుత్తు సరిపోవడంలేదు"



"ఎందుకలాగ?"



"అందరూ కూలర్లు, ఏసీలు రాత్రింబవళ్ళు నడుపుతుంటే ఎలా సరిపోతుంది?"



"ఎందుకలా నడుపుతున్నారు?"



"ఎండలండీ ఎండలు.. అవి సామాన్యమైన ఎండలా.. నిప్పులు చెరుగుతుంటే.."



"మరి కూలర్ కొన్నావా?"



"కొందామనుకున్నా.. వర్షాకాలం వస్తే అది పనికిరాదు.. వర్షాలలో గాలిలో తేమ ఎక్కువ కాబట్టి కూలర్ కన్నా ఏ.సీ. వుండటమే మంచిది.. చలి కాలంలో హీటర్ అవసరమౌతుంది.."



"అంత చలా"



"చలా అది.. మంచు ముక్కలు చెరుగుతుంది.."



"మరి ఏ.సీ. కొన్నావా?"



"లేదు.. కరెంటు లేనప్పుడు ఏ.సీ. కొని మాత్రం ఏం ప్రయోజనం?"



"మరేం చేశావు?"



"పెళ్ళాం పిల్లల్ని పుట్టింటికి పంపించి.. వుద్యోగం పేరుతో వూళ్ళు తిరుగుతున్నా.."



"బాగానేవుంది"




***



"ఇంతకీ డిల్లీలో ఎక్కడుంటున్నావేమిటి?"



"ద్వారక"



"నువ్వు మరీనోయ్.. ద్వారక వున్నది గుజరాతులో కదూ"



"కాదు మాష్టారు.. "అదిగో ద్వారక ఆలమందలవిగో"..అని చెప్పిన ద్వారక కాదిది..డిల్లీ లోనే ఒక ప్రాంతం"



"ఓహో.. బాగు బాగు.. శ్రీకృష్ణుడు ఢిల్లీ పక్కనే వున్న మథురని వదిలి పెట్టి ద్వారకకు వెళ్తే మళ్ళీ ద్వారకను ఢిల్లీ పక్కనే చేర్చారన్నమాట..!! అవునూ శ్రీకృష్ణుడు మథురని వదిలిపెట్టింది అక్కడి యూపీ, బీహారు జనాన్ని తట్టుకోలేకేనటగా.."



"మహాప్రభూ.. లేని పోని గొడవలు రేపకండి.. ఇక్కడ ఢిల్లీలో యూపీ బీహారోళ్ళు చాలామంది వున్నారు"



"అవునులే అక్కడ రాజ్ థాకరే లేడుగా..!! వీళ్ళంతా ఏం చేస్తుంటారేమిటి?"



"అన్ని పనులు చేసేవారూ వున్నారు..రోడ్డు సైడు బండ్లు పెట్టుకోని చాట్ అమ్ముకునేవాళ్ళు, రిక్షా నడిపేవారు ఎక్కువ బీహార్ యూపీయులే.."



"ఏమిటి ఇంకా అక్కడా రిక్షాలున్నాయటోయ్.."



"వున్నాయి.. తొక్కుడు రిక్షాలు.. మనలాగా ఇక్కడ బేషజాలకు పోయి ఆటోలోనే పోతానని ఎవ్వరూ అనరు.. ఎంతటివాళ్ళైనా దర్జాగా రిక్షా ఎక్కి వూరేగింపుగా వెళ్తారు.."



"మరి టాక్సీలు, ఆటోలు గట్రా లేవా?"



"లేకనేం? అవి నడిపేది ఎక్కువ పంజాబీయులు"



"మరి తెలుగువాళ్ళు లేరా?"



"తెలుగువాళ్ళు లేకుండానా.. నేను లేనూ.. నాలాగే ఇంకా చాలామంది.."



"వున్నారు సర్లే.. వాళ్ళేంచేస్తారని?"



"ఎవడి వుద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు.. "



"బాగానే వుంది.. మరి ఎప్పుడైనా కలుస్తుంటారా?"



"ఇండియా గేటు దగ్గర ఆంధ్రాభవన్ వుంది.. అక్కడి క్యాంటీనులో అచ్చ తెలుగు భోజనం, ఏపీ భవన్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.. అలాగే కరోల్ బాగ్ ప్రాంతంలో సదరన్ ట్రావెల్స్ వారి అమరావతి హోటల్లో కూడా మాంచి తెలుగు భోజనం దొరుకుతుంది.. అక్కడే తెలుగు సూపర్‌మార్కెట్టు వుంది.. అన్ని ప్రముఖ వార్తాపత్రికలకు డిల్లీ ఎడిషన్ వుంది.. వార పత్రికలు కూడా దొరుకుతాయి.."



"భలే బాగుందే... మరైతే మన బ్లాగుల ప్రచారం ఇక్కడ కూడా చెయ్యొచ్చుగా?"



"చేద్దామండీ.. ఇప్పుడేగా వచ్చింది.."





***

రాజధాని నగరంలో... మెట్రో అందాలతో


ఇందు మూలముగా యావన్మంది బ్లాగరు మహాశయులకు తెలియజేయునది ఏమనగా.. ఒక చిన్న విరామము తరువాత నా బ్లాగుల ప్రస్థానాన్ని రాజధాని నగరం డిల్లీ నుంచి పునఃప్రారంభిస్తున్నానహో..!!

డిల్లీ నగరం గురించిన విశేషాలు.. ఇంకా నేను చూసి వచ్చిన కొత్త ప్రదేశాల సంగతులు... ఈ విరామంలో రాసి పెట్టుకున్న కొన్ని కథలు అన్నీ ఒక్కొక్కటే వినిపిస్తాను.. అందాకా డిల్లీ మెట్రో రైలు అందాలను చూడండి...!!








తాతలు ఆడిన ఆటలు: దాడి

దాడి ఆట తాతలే కాదు మనలాంటి మనుమలు/మనుమరాండ్రు కూడా ఆడే వుంటారు...!! అయితే నేను చెప్పబోయేది మరో రకం దాడి గురించి. తెలియని వారి సౌలభ్యం కోసం మనం ఆడిన ఆట:


ఇందులో ఇద్దరు ఆటగాళ్ళు వుంటారు. ఒకరు ఇంటూ గుర్తులు పెట్టాలి ఒకరు సున్నాలు చుట్టాలి. ముందు ఒకరు ఇంటూ పెట్టగానే రెండొవవారికి సున్నా చుట్టే అవకాశం వస్తుంది.. తరువాత మళ్ళీ ఇంటూ. అడ్డంగాగాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే గుర్తు ఎవరైతే వ్రాయగలుగుతారో వారే గెలిచినట్టు. ఇది చాలా సులభమైన ఆట. ఒక పది సార్లు ఆడితే అందులో వున్న కిటుకు అర్థమౌతుంది. ఇక అక్కడి నుంచి ప్రతి ఆట డ్రాగా ముగుస్తుంది.

మన తాతలు ఆడిన దాడి అట్లా కాదు. అది చూడటానికి ఇలా వుంటుంది:


ఇద్దరు ఆటగాళ్ళకి తొమ్మిది తొమ్మిది చొప్పున చింత పిక్కలో/గింజలో/రాళ్ళో ఇవ్వబడతాయి. (అయితే ఒక చింత పిక్కలు తీసుకుంటే ఒకరు గవ్వలు తీసుకోవాలి.. ఏ పావు ఎవరిదో తెలిసేట్టు). ఆట పైన చెప్పిన "చిన్న దాడి"లాగానే వుంటుంది. పైన బొమ్మలో ఎర్ర రంగు సున్నాలలో ఒకరి తరువాత ఒకరు తమ పావుల్ని పెట్టాలి. అడ్డంగాకాని, నిలువుగా కాని, క్రాస్‌గా కాని మూడూ ఒకే రకం పావులు వస్తే వారికి ఒక పాయంటు వచ్చినట్లు.

అసలు గమ్మత్తంతా ఇక్కడే వుంది.. ఆ గెలిచిన వారు అవతలి వారి పావుని ఒకదాన్ని తీసేసుకోవాలి. ఇలా ఆడుతూ ఆడుతూ తొమ్మిది పావులు పేర్చడం అయ్యాక పావులకి కదలిక వస్తుంది. ఒక కూడలి నుంచి మరో కూడలికి కదలొచ్చు. మళ్ళీ మూడూ ఒక వరుసలోకి చేరగానే అవతలి వాడి పావుని తీసుకోవచ్చు..!

ఈ ఆట పటం కూడా బండలమీద ఆడి ఆడి.. పావుల్ని జరిపి జరిపి.. అనేక రచ్చబండలమీద ఎవరో చెక్కినట్లు నిలిచిపోయి కనపడుతుంది.

ఈ ఆట కూడా ప్రయత్నించి చూడండేం..!!

తాతలు ఆడిన ఆటలు: వామన గుంతలు

వామన గుంతలు అనే ఆట ఒకటుందని ఎంతమందికి తెలుసు చేతులెత్తండి..!! ఫర్లేదే చాలా మంది ఈ ఆట గురించి విన్నారన్నమాట. సరే అయితే ఈ ఆట ఎలా ఆడతారో చూడండి:


ఆడేవారు: ఇద్దరు


చూసేవారు: అక్కడ పట్టినంతమంది


కావాల్సినవి: 146 చింత పిక్కలు (అంటే ఏమిటి అని అడగకండి - మళ్ళీ చెప్తా - ఆపద్ధర్మానికి రాళ్ళు ఏరుకోండి) లేదా ఏవైనా గింజలు వాడండి డబ్బున్న మారాజులైతే రత్నాలు, మణులు వగైరాలు వాడచ్చు. వామన గుంతలు అనబడు ఒక పరికరం. అడ్డంగా ఏడు గుంతలతో రెండు వరసలుగా వుంటుంది. ఇదుగో ఇలా..

ఇలాంటి పరికరం లేకపోతే నేల మీద ఇలా గీసుకోనైనా ఆడచ్చు..!!

ఆట మొదలు పెడదామా?
ముందు కొన్ని నియమాలు:
1. తొండి చెయ్యకూడదు. ఏది చూపించు నీ జేబులో ముందే చింత పిక్కలు వుంచుకోలేదు కదా? (చింత పిక్కలు అంటే ఏమిటి అని అడిగేవారు రాళ్ళని చదువుకోండి)
2. ఆట మధ్యలో గుంతల్లో చింత పిక్కలు లేదా రాళ్ళు లెక్కపెట్టుకోవడాలు లేవు.
ఆట మొదలు:
మధ్యలో వున్న ఒక్క గుంత మినహాయించి మిగిలిన అన్ని గుంతల్లో రెండు వైపులా 12 చొప్పున పిక్కలు వేయండి. మధ్యలో మాత్రం రెండు పిక్కలే వెయ్యాలి. (6X12X2 + 2X2 = 146).
ఇప్పుడు ఎవరు ఆట మొదలు పెడతారో వాళ్ళు, తమ వైపు మధ్య గుంత కాకుండా వేరే ఏదైనా గుంతలో పిక్కలు తీసుకోని అపసవ్య దిశగా (anticlock) ఒక్కొక్క గుంతలో ఒక్కొక్క పిక్క వేసుకుంటూ వెళ్ళాలి. తనవైపు చివరి గుంత తరువాత అవతలి వైపు గుంతల్లో కూడా అలాగే వేసుకుంటూ రావాలి. ఈ క్రింద చూపిన పటంలో ఎర్ర బాణం వున్న దగ్గర మొదలు పెడితే నీలం రంగు బాణం దిశగా సాగుతూ నల్ల రంగు బాణం దగ్గర ఆగుతాం అన్నమాట.
ఇలా ఎక్కడ చేతిలో పిక్కలు అయిపోతాయో ఆ గుంత పక్క గుంతలో పిక్కలు తీసుకోని మళ్ళీ అదే విధంగ తిప్పుతూ రావాలి. మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకోవడామే...!! ఇందాక చెప్పిన వుదాహరణలో అలాగే మూడు రౌండ్లు ఆడితే కింద చూపించినట్లు ఎర్ర బాణం దగ్గర ఆగుతాం. పక్కనే వున్న ఖాళీ గుంతలో చెయ్యిపెట్టి (దీన్నే నాకడమంటారు.. కాబట్టి ఆ గుంతని నాకి) దాని అవతలి గుంతలో పిక్కలు తీసేసుకోవాలి (అంటే కింద పచ్చ రంగు బాణం చూపించే గుంతలొ ఒక్క పిక్క అన్నమాట..). అది ఒక రౌండ్ అయ్యేసరికి మీరు సంపాదించిన ఆస్థి.
(ఆ.లో అ.: ఏ గుంతతో మొదలు పెడితే అత్యధిక పిక్కలు తీసుకోవచ్చో కొంచెం అనుభవం మీద తెలుస్తుంది. ఇందాక ఉదాహరణాలో చూడండి చుట్టూ 15 పిక్కలున్న గుంతలు వున్నా ఒక్క పిక్కే దక్కింది.)
ఇప్పుడు అవతలి వారికి అవకాశం. అవతలి తన వైపు వున్న ఏదైనా గుంతలో పిక్కలు తీసుకోని ఇందాకటి మాదిరిగానే వేసుకుంటూ, తిరిగి తిరిగి ఒక చోట నాకి పక్క గుంతలో పిక్కలు తీసుకుంటారు. ఎవరికి వచ్చిన పిక్కలు వారికే అన్నమాట.
ఒకోసారి చివరి పిక్క వేసిన తరువాత రెండు గుంతలు వరుస ఖాళీలు తగుల్తాయి. అప్పుడు నాకినా ప్రయోజనం లేదన్నమాట. మీ ఆట అక్కడ ఆగిపోయినట్లే. అవతలి వారికి అవకాశం.
ఒకోసారి చివరి పిక్క వేసిన తరువాత దాని పక్కన గుంతలో ఆరు పిక్కలు వుంటే మీరు ఆ ఆరు పిక్కలు తీసేసుకోవచ్చు. అయితే మీ ఆట ఆగిపోతుంది. అవతలి వారికి అవకాశం.
ఇలా ఆడగా ఆడగా అన్ని పిక్కలు అయిపోయి మొదటి ఇన్నింగ్స్ ముగుస్తుంది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టబోయే ముందు ఎవరి దగ్గర ఎన్ని పిక్కలున్నాయో లెక్కబెట్టుకోవాలి. ఎవరి దగ్గర తక్కువ వుంటే అవతలి వ్యక్తి కూడా అన్నే తీసి కలుపుతాడు. (అచ్చం మన క్యారమ్స్‌లో లాగా). మళ్ళీ మధ్యలో రెండు రెండు వెయ్యడం.. పన్నెండు పన్నెండు లెక్కన వేసుకుంటూ వెళ్ళడం. అప్పుడు చివర్లో వున్న గుంతలు మిగిలిపోతాయి. అవి ఆటలోనించి తొలగించబడతాయి (కింద చూడుడూ). ఇక మిగిలిన ఆట అంతా మామూలే. పిక్కలు తీసుకోవడం.. పంచడం.. నాకడం.. వగైరా.
(ఆ.లో అ.: ఏ గుంతలో ఎన్ని పిక్కలున్నాయి అనే విషయం ఎప్పటికప్పుడు లెక్క వేసుకోగలిగితే ఆట ఇట్టే గెలవచ్చు. అందుకే లెక్కపెట్టుకోడాలు లేవని ముందే చెప్పింది.. మనసులోనే లెక్కేసుకోవాలి. ఏంటి కష్టమా? అదే పేకాటైతే ఒక్క రౌండు అవ్వగానే ముక్కలన్నీ చెప్తావా? మరదే తాతలు ఆడిన ఆటలంటే..!! దీనికీ తెలివితేటలు, లెక్కలు వేయగలిగిన నేర్పు చాలా అవసరం)
ఈ ఆటకి దగ్గరగా వున్న గేం ఇక్కడ ఆడి చూడండి
మరో ఆట గురించి మరోసారి..!!

తాతలు ఆడిన ఆటలు: పులి జూదం

ఈ మధ్య ఏదో సందర్భంలో పూర్వపు ఆటల గురించి చర్చకు వచ్చినప్పుడు, చాలా ఆటలు మనం మర్చిపోయామేమో అని అనుమానం వచ్చింది. ఆ ఆలోచనే ఈ టపాలకు మూలం. ఇలాంటి ఆటలు గుర్తు చేసుకోవడానికి కొంత కారణం లేకపోలేదు...

1. ఇలాంటి ఆటలు మన పూర్వికులు ఆడారు.. కాబట్టి ఇవి మన చరిత్ర, సంస్కృతిలో భాగం. ఇలాంటివి మనం ఇప్పుడు ఆడకపోయినా ఫర్వాలేదు కనీసం తెలుసుకోవడంలో ఒక ఆనందం వుంటుంది.

2. ఈ ఆటలలో ప్రత్యేకత ఏమిటంటే ఇలాంటి ఆటలకి ప్రత్యేకమైన పరికరాలు అరుదుగా అవసరమౌతాయి. కాలాంతరంలో కొన్ని పరికరాలు (వామన గుంతలు లాంటివి) పుట్టుకొచ్చినా అవి లేకపోయినా ఆడేందుకు అనుకూలంగా వుంటాయి. కాబట్టి, తెలుసుకున్నవాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు ఆడతారని ఆశ.

3. ఈ ఆటల్ని గమనిస్తే, ఇందులో వస్తువులు, ఆటకు మూలమైన విషయం అప్పటి సామాజిక, వ్యవహారిక విషయాలకు సంబంధించే వుంటాయి. పులి జూదం చూడండి అది ఎక్కువగా గొడ్లు/మేకలు కాసుకునేవాళ్ళు ఏ బండమీదో కూర్చొని ఆడుకునేవాళ్ళు. వాళ్ళ ధ్యాసంతా ఆ మేకలు, వాటిని కొట్టేందుకు వచ్చే పులులమీద వుండటంతో ఆటలో వస్తువు కూడా అదే అయ్యిందనిపిస్తుంది. అంతే కాదు ఆ పులులని మేకలన్నీ కలిసి కట్టడి చేసి గెలవాలని ఒక చిత్రమైన ఆశ కూడా ఆటలో అంతర్భాగమైంది.

4. ఇక ఇప్పుడు పల్లెలనించి పట్టణాలకి, అక్కడి నుంచి విదేశాలకి వలసెళ్ళిన మనలాంటి వారి పిల్లలు ఇలాంటి ఆటలు తెలుసుకునేందుకు, ఆడుకునేందుకు అవకాశమే లేకుండా పోయింది. మన బ్లాగ్మిత్రులలో సాఫ్ట్‌వేర్ నిపుణులు ఈ టపాలు చదివి ఇలాంటి ఆటలని కంప్యూటర్‌లో ఆడేందుకు వీలుగా తయారు చేస్తారేమోనని ఒక కోరిక...

వుపోద్ఘాతం పక్కన పెట్టి అసలు విషయం చెప్తాను - ఈ రోజు ఆట పులి జూదం.

ఆడేవారు: ఇద్దరు

కావాల్సినవి: పులులుగా నాలుగు రాళ్ళు (కొంచెం పెద్దవి), మేకలుగా 15 రాళ్ళు (చిన్నవి), కింద చూపినట్లు పులిజూదం పటం, ఆడటానికి కొంచెం నేర్పు.




(ఆటలో అరటిపండు: ఇక్కడ చూపిన పటం కాకుండా ఇంకా రెండు మూడు రకాలుగా కూడా గీయవచ్చు. ఆ పటం బట్టి మేకల సంఖ్య మారుతుంటుంది. పులులు మాత్రం ఎప్పుడూ నాలుగే.)

ఆడే విధానం:

ఇక్కడ పటంలో వున్నది ఒక కొండ అన్నమాట. కొండెక్కే భాగ్యం ఎప్పుడూ పులిదే. అందుకని ముందుగా నాలుగు పులులను ఇలా పేర్చాలి.


ఇవి వేటకి వచ్చినవికదా ఎప్పుడూ కలిసే బయలుదేరుతాయి. ఇక మేకలు కాసే ఆటగాడు ఒక్కొక్క మేకని ఒక్కొక్క కూడలిలో పెడతాడు. (ఆ లో అ: కూడలంటే మన కూడలి కాదు. రెండు లేదా అంత కన్నా ఎక్కువ గీతలు/దారులు కలిసే ప్రదేశమన్నమాట.) ఒక మేక పెట్టగానే, పులి కి కదిలేందుకు అవకాశం వస్తుంది. పులి ఎటు వైపైనా, గీత వెంబడే కదిలి తరువాతి కూడలి చేరాలి. మళ్ళీ మేక పెట్టేందుకు అవకాశం. ఇలా సాగుతూ వుంటుంది.

పులికి దగ్గరలో ఏదైనా కూడలిలో మేక వుంటే, పులి ఆ మేక మీద నుంచి దూకి ఆ మేకను తినేందుకు అవకాశం వస్తుంది. అంటే పులి-మేక-ఖాళి వుంటే పులి ఖాళిలోకి దూకి మేకను మింగేస్తుంది. ఆ మేకను తీసి పక్కన పెట్టాలి. పులి ఒకటి కంటే ఎక్కువ మేకలమీద నుంచి దూకలేదు. పులి పులి మీదనుంచి దూకలేదు.

మేకలు అన్నీ పేర్చిన తరువాత మేకలకు కదిలేందుకు అవకాశం వస్తుంది. ఇవి కూడా పులుల మాదిరిగానే కదులుతాయి. అయితే దూకడాలు వుండవు. మేకలు కదులుతూ పులికి కదిలేందుకు అవకాశం లేకుండా చేస్తే (పులులు కట్టడి అయిపోయినట్లు) అప్పుడు మేకలు గెలిచినట్లు. మేకలనన్నిటిని పులులు మింగేస్తే పులులు గెలిచినట్లు.

(ఆ.లో అ.: మేకలు పెడుతుండగానే పులులని తెలివిగా వూరిస్తూ, ఒకటి అరా మేకల్ని కావాలనే బలిపెడుతూ పులుల్ని మూలల్లో ఇరికించేసి చేతిలో మేకలుండగానే గెలిచేస్తారు కొంతమంది. ఒకోసారి కింద చూపినట్లు ఒకటే చోట మేకల్ని కిందకి పైకి జరుపుతూ, అక్కడికేదో ఆ మేక తన మరదలైనట్లు సరసమాడుతూ పులుల్ని విసిగించేసి వోడించేస్తారు కొందరు.)


ఏది ఏమైనా తెలివిగా ఆడాల్సిన ఆట. ఈ ఆటని పల్లెటూర్లలో ఇప్పటికీ ఎంతగా ఆడతారంటే ఏ రాములవారి గుడి అరుగు మీదో, రచ్చబండ మీదో రాళ్ళను జరిపి జరిపి గాట్లు పడిపోయి ఈ పులి జూదం పటం కనిపిస్తుంటుంది. నేను చూపించినది తమిళనాడులో అక్కడికి దగ్గరలో వున్న ప్రాంతాలలో ఆడే ఆట పటం. మరి కొన్ని ప్రాంతాలలో పటం ఇలాగ వుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఆడి చూడండి..!!

సినిమా టైటిల్ పజిల్ - సమాధానాలు

పజిల్ అంటూ పెట్టినందుకు తప్పో కరెక్టో ఏదో ఒక సమాధానం వ్రాసిన మిత్రులకు నెనర్లు.. ఏమి రాయనివారికీ నెనర్లు..!!

అచ్చులతో ఇచ్చిన పజిల్ చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నాను.. జీడిపప్పు వరూధిని, జ్యోతి గార్లు మూడు సరైన జవాబులు, నీలాంచలగారు రెండు సరైన జవాబులు, చివరికి చైతన్యగారు తొమ్మిది సరైన జవాబులతో పాల్గొన్నారు.

ఇది బొమ్మ





ఇవి జవాబులు:

అ: అరుంధతి
ఆ: ఆకాశమంత
ఇ: కొంచెం 'ఇ'ష్టం కొంచెం కష్టం
ఈ: అ.ఆ.ఇ.ఈ
ఉ: ఉత్సాహంగా ఉల్లాసంగా
ఊ: ఒక ఊరిలో
ఎ: ఎవడైతే నాకేంటి
ఏ: ఏక'లవ్'యుడు
ఐ: ఐతే
ఒ: ఒక్క మగాడు
ఓ: ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమికా (ఇది చాలా కష్టం అందుకే హీరోయిన్ కనిపించేట్టు పెట్టాను)
ఔ: ఔను వాళ్ళిద్దరు..
అం: అందరివాడు


మొదటిది సులభంగా ఇచ్చానని (అనుకొని) రెండొవది కొంచెం కష్టంగా ఇవ్వాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో చాలా కష్టంగా ఇచ్చానని వచ్చిన జవాబుల బట్టి తెలిసింది.. చైతన్యగారు మాత్రమే ఒక్కటి సరిగా చెప్పారు..

ఇది రెండొవ పజిల్



ఇవి జవాబులు


క: కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కా: ఆవకాయ్ బిర్యాని
కి: పోకిరి
కు: ఆడవారి మాటలకు..
కూ: అప్పు చేసి పప్పు కూడు
కృ: మెంటల్ కృష్ణ
కే: ఎవడైతే నాకేంటి
కై: భూకైలాస్
కో: పెళ్ళైన కొత్తల్లో
కో: అనుకోకుండా ఒక రోజు
కౌ: కౌసలా సుప్రజ రామ
కం: కంచు


అదీ విషయం.. బాగుంటే చెప్పండి మరికొన్ని ప్రయత్నిద్దాం..!!


ఉగాది శుభాకాంక్షలతో


జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్


(దుర్గేశ్వరరావుగారు చేస్తున్న హనుమత్ రక్షా యాగానికి నా ఉడుతా సాయం)




సినిమా టైటిల్ పజిల్ - 2

నిన్న నేనిచ్చిన సినిమా పజిల్ చూసేవుంటారు.. (లేకపోతే ఇక్కడ నొక్కండి)!! ఇదుగో మరో పజిల్:

క్రింద వున్న బొమ్మలో క గుణింతంలో అక్షరాలు వున్నాయి. ప్రతి అక్షరం ఒక్కో సినిమా టైటిల్ నుంచి తీసుకోబడింది. ఆ సినిమా పేరు కనిపెట్టేస్తే చాలు..!!


క్లూ: ఇక్కడున్న అక్షరాలు సినిమా పేరులో మొదటి అక్షరమే కానక్కరలేదు.


ప్రయత్నించండి..!!

(తరువాతి టపాలో రెండింటికి సమాధానం ఇస్తాను..!)


సరికొత్త సినిమా పజిల్..!!

తెలుగువారికి సినిమాకి జన్మ జన్మల బంధం వుందని నా నమ్మకం. సినిమా బాగాలేదంటే 'ఏం బాలేదో తెలుసుకుందామని' సినిమాలకెళ్ళేవాళ్ళు మనకు తెలుసు. 'పాపం అంతంత డబ్బులు పెట్టి సినిమా తీసి అది ఫ్లాపైతే మనలాంటి వారు టికెట్టు కొని చేతనైనంత సాహాయం చెయ్యొద్దూ..?' అంటూ సంజాయిషీ చెప్పుకునేవాళ్ళు మనకి బాగా తెలుసు.


సినిమాకి కథ అవసరం ఎక్కువా? హీరో అవసరం ఎక్కువా? డైరెక్టర్ అవసరం ఎక్కువా? అని చాలా చర్చలు వుంటే వుండచ్చుగాక.. కాని నా దృష్టిలో సినిమాకి అతి ముఖ్యమైంది పోస్టర్.. అందులో టైటిల్. ప్రతి సినిమాకి టైటిల్ ఒక ప్రత్యేకమైన ఫాంట్లో వుంటుంది. నగిషీలు చెక్కినట్లు అవి ఎంత బాగుండేవంటే - స్కూల్ రోజుల్లో వాటి నకళ్ళు గీయడానికే సోషల్ క్లాసులు వినియోగించేవాణ్ణి.

ఇదంతా మాకు తెలుసులేవోయ్ అంటారా? సరే అసలు సంగతి చెప్పేస్తా. విషయమేమిటంటే.. ఇదుగో క్రింద వున్న ఈ పజిల్.


పజిల్ చాలా సులభం.. క్రింద తెలుగు అక్షరమాలలో అచ్చులు వున్నాయి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక సినిమా టైటిల్ నుంచి తీసుకోబడింది. ఆ సినిమా పేర్లు చెప్పుకోండి చూద్దాం...!!