బ్లాగోగులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బ్లాగోగులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఇండోరులో సంక్రాంతి సంబరాలు - తెలుగు బ్లాగుల ప్రచారం


ఆంధ్రరాష్ట్రమంతా జనవరి 14వ తారీఖున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటే ఇక్కడ ఇండోరు (మ.ప్ర.)లో ఒకింత ఆలస్యంగా ఆ సంబరాలు జరిగాయి. సంక్రాంతి లక్ష్మి రైలెక్కి ఇక్కడిదాకా రావాలి కదా మరి. (ఇక్కడ సంక్రాంతికి సెలవు ఇవ్వరు కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అనువైనదిగా భావించారు). నేను ఈ సంబరాలు జరుగుతున్న చోట కారు దిగుతుంటే ముఖద్వారం గుమ్మం దగ్గర "సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ ఇద్దరు గంగెరెద్దులవాళ్ళ బొమ్మలు స్వాగతం పలికాయి. వెంటనే ఈ బొమ్మ ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను - అది నా బ్లాగులో నేను పెట్టుకున్న సంక్రాంతి శుభాకాంక్షలు బొమ్మ.

అప్పుడు గుర్తొచ్చింది ఈ కర్యక్రమం నిర్వహిస్తున్న ప్రసాద్‌గారికి, శ్రీధర్‌గారికి నేను వచ్చే విషయాన్ని మైల్ చేస్తూ, అందులో తెలుగు బ్లాగుల గురించి వివరంగా వ్రాశాను. అవకాశం వుంటే ఇండోరులో తెలుగువారికి తెలుగు బ్లాగులు పరిచయం చేస్తానని అభ్యర్ధించాను. "ఆ రకంగా నా బ్లాగులు చూసేవుంటారు" అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. లోపలికి వెళ్ళాక నలుగురితో పరిచయమైంది. నా పేరు చెప్పగానే చాలామంది మీరు ఫలానా బ్లాగు నడుపుతారు కదూ అంటూ పలకరించారు. అప్పుడు తెలిసింది నేను పంపించిన మైలు ప్రసాద్‌గారి తెలుగు మిత్రులకి ఫర్వార్డ్ అయ్యిందని.

కార్యక్రమం మొదలు కావటానికి మరికొంత సమయం పట్టేట్టుండటంతో నాగార్జున ఫర్టిలైజర్స్ నుంచి వచ్చిన మిత్రులు ధనంజయ్‌రెడ్డిగారు, కిరణ్‌గారు కలిసి ఆ పరిసరాల్లో తిరిగాము. ఇంతకీ ఇది జరిగిందెక్కడో చెప్పలేదుకదూ - ఇండోరుకి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి సహజ ప్రకృతిలో అద్భుతంగా వుందా ప్రాంతం. పూర్తిగా సెక్యూరిటీ కనుసన్నల్లో వుండే ఆ ప్రాంతంలో సైంటిస్ట్‌లు ఇతర సిబ్బంది వుండే క్వార్టర్స్, పిల్లల స్కూలు దాటి రీసర్చ్ సెంటర్ వెళ్తుంటే ఓక్క పెద్ద సహజ కోనేరు ఆహ్లాదంగా కనిపించింది. దిట్టమైన అడవిని తలపిస్తూ రోడ్డుకు ఇరువైపులా చెట్లు. అంతలో మాకు పదడుగుల దూరంలో ఒక పదిదాకా నెమళ్ళు దర్జాగా ఎదో ఫామిలీ మొత్తం మార్నిగ్‌షోకి బయలుదేరినట్టు వరసగా రోడ్డు దాటుతూ కనిపించాయి. అంత బాగుందో అలా చూస్తుంటే.. ప్రకృతిని తనపాటికి వదిలేసి మనం కేవలం ప్రేక్షులమైతే ఇంకెన్నో అధ్భుతాలు ఆవిష్కారమౌతాయేమో అనిపించి...!! నిజంగా అక్కడి వుంటున్నవారు సహజ ప్రకృతిని ఏమీ చెయ్యకుండా అందులో కలిసిపోయి జీవిస్తున్నారు... ఎంత అదృష్టం. ఎలా అనుకుంటూ మేము కార్యక్రమం జరుపుకుంటున్న వెల్ఫేర్ సెంటర్ దగ్గరకి చేరుకున్నాం.
వెంటనే టిఫిన్ల మీద పడ్డాము. "వుప్మా చేసినట్టున్నారండీ.." అని నేనంటే -
"పోహా తప్ప ఏది పెట్టినా ఫర్లేదండీ.." అంటూ ఒక బ్యాచిలరు మిత్రుడు ఆనందంగా ప్లేటందుకున్నాడు. (ఇక్కడ ఇండోరులో వుదయం దొరికే టిఫిన్ పోహ, జిలేబి మాత్రమే). మేము అలా టిఫిన్లు కానిచ్చి లోపలికి వెళ్ళి చూసే సరికి బొమ్మల కొలువు సిద్ధంగా వుంది. సాంప్రదాయాన్ని పాటిస్తూ మామిడి తోరణాలు, గడపలకి ఇరువైపులా అరటి మొలకలు అలంకరణలో సైతం చరకు గడలు, పతంగులు, బంతి పువ్వులు కనిపించి సంక్రాంతి సంబరాలకి అచ్చ తెలుగు అందాలద్దాయి.

ఆ తరువాత చిన్న పిల్లలకి ఆటల పోటీలు ఆడవారికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమం నిర్వహిస్తున్న సెంటర్ వాకిట్లో పోటీ నిర్వహించడంతో మరో అరగంటలో సంక్రాంతి లక్ష్మి రంగులద్దుకొని మరీ మా ముంగిట్లోలోకి వచ్చింది. పోటీలో పాల్గొన్న పెద్దలే కాక పోటీలేకపోయినా కొంతమంది చిన్న పిల్లలుకూడా ముగ్గులేసి రంగులద్ది మురిసిపోయారు. ఒక పక్క శాస్త్రిగారు తదితరుల ఆధ్వర్యంలో హిందీ వంటవాళ్ళు పులిహోర, కొత్తిమీర కారం, మామిడికాయ పప్పు లాంటి తెలుగు వంటకాలు చేస్తూ, నేర్చుకుంటున్నారు.

ఇంతలో మగవారి కబడ్డీ పోటీలు జరిగాయి. ఆడవారికి మ్యూజికల్ చైర్స్.. ఇంతలో మ్యూజిక్ సరిగా వినపడట్లేదంటూ మహిళల కంప్లైంటు..!! రమేష్‌గారు వెంటనే ఒక స్టీలు పళ్ళెం, గరిట తెచ్చిచారు. ఆ పని నేను తీసుకున్నాను.. బాపు మిస్టర్ పెళ్ళాంలో బుడుగులా.. డండర డండర డండర ఢాం..!! పోనీలే సంక్రాంతి పండక్కి జంగందేవర కూడా వచ్చినట్టైంది అన్నారెవరో సరదాగా..!!

భోజనాల దగ్గరకి వెళ్ళేసరికి పెద్ద క్యూ... ఆవకాయ అయిపోతోంది.... ఇంకో సీసా మళ్ళీ ఖాళి..!! "ఎంతైనా తెలుగువాళ్ళం కదా. అవకాయని బతకనిస్తామటండీ" అంటూ ఫణీంద్రగారు పచ్చడి గిన్నెలో అన్నం వేసి సుబ్బరంగా కలిపేసారు. ఈ ఆలోచన నచ్చి నేను పచ్చడి సీసామీద పడబోయానుగాని అంతలో శాస్త్రిగారు మరో సీసా పట్టుకొచ్చారు. కంది పొడి, నెయ్యి పులిహోర, మామిడికాయ పప్పు, సున్నుండలతో భోజన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తైంది.

ఆ తరువాత తెలుగు పురాణ సాహిత్యంలో క్విజ్.. మచ్చుకు మూడు ప్రశ్నలు -
"సీతాదేవి పుట్టిల్లు ఏది అది ప్రస్తుతం ఎక్కడుంది?"
"పంచ భీములెవరు?"
"సప్త రుషులెవరు..?"

తెలుగు బ్లాగుల ప్రచారం
మధ్యాన్నం టీ వేళకి నేను లాప్‌టాప్ తెరిచాను. ప్రసాద్‌గారి పరిచయంతో ప్రారంభించాము. ప్రసాదుగారు గత వారం రోజులలో నేను పంపిన లంకెలు పట్టుకోని తోటరాముణ్ణి, నా హాస్య దర్బారుని మరో రెండు మూడు బ్లాగుల్ని చుట్టేసారు. లంకెలు, బ్లాగడం, బ్లాగరి వంటి పదాలు అప్పుడే అక్కడ వాడకంలోకి వచ్చేసాయి. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి (తాడేపల్లి గారిని తల్చుకొని) అంతర్జాలము, టైపాటు, త్రిప్పెన గురించి చెప్పాను.

అంతర్జాల అనుసంధానం లేకపోవటంతో ముఖ్యమైన లేఖిని, కూడలి మరికొన్ని సైట్లు ఆఫ్లైన్‌లో భద్రపరుచుకొని వెళ్ళాను. ముందురోజు నేను తయారుచేసుకున్న కరపత్రం పంచి పెట్టాము. "మీ కంప్యూటర్‌కి తెలుగు నేర్పించారా" అంటూ మొదలై - లేఖిని, కూడలి, తెవికి, గూగుల్ గుంపు, పొద్దు, నవతరంగం గురించి క్లుప్తంగా ఆ కరపత్రంలో వివరించాను. అందులో చివరి వాక్యం - "ఈ రోజు జరిగిన సంక్రాంతి సంబరాలు నా బ్లాగు పలక బలపంలో రేపు వస్తుంది చూడండి. "

లేఖినిలో ఇంగ్లీషు తెలుగుగా మారటం చాలామంది ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.. శాస్త్రిగారు వచ్చి తెనాలి రామకృష్ణ చాటువులు దొరుకుతాయా అని అడిగారు.. ఫణీంద్రగారు తెలుగు సాహిత్యం దొరుకుతుందా అన్నారు.. నారాయణగారు పెద్దబాలశిక్ష, పంచతంత్రం గురించి అడిగారు. అవన్నీ అంతర్జాలంలో ఎలా వున్నాయో చెప్తూ అభినవ భువన విజయం గురించి, తెలుగు థీసిస్‌లో పుస్తకాల గురించి, సౌమ్యగారి పుస్తక సమీక్షల గురించి, సాహితీయానం వంటి కవితల బ్లాగుల గురించి, నిడదవోలు మాలతిగారి కథల గురించి వీలైనన్ని విషయాలని క్లుప్తంగా చెప్పాను. కొంతమంది ఆ బ్లాగుల పేర్లు వ్రాసుకోవటం చూసి చాలా సంతోషమనిపించింది.

చాలా మంది ప్రముఖంగా ప్రస్తావించిన విషయం: "మా పిల్లలకి తెలుగు మాట్లాడటం వచ్చు. చదవటం, వ్రాయటం నేర్పడానికి ఏవైనా వెబ్‌సైట్లు/సాఫ్ట్‌వేర్లు వున్నాయా?" ఇలా అడిగిన వారిలో ఎక్కువ శాతం ఎంతో కాలంగా ఇక్కడే స్థిరపడినవారు. సాయంత్రం అతిదిగా వచ్చిన డీ.ఐ.జీ శ్రీనివాస్‌గారు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

సాంస్కృతికం ఆ సాయంత్రం
సాయంత్రం చిన్న పిల్లల ఆటలు పాటలతో ఎంతో వుత్సాహంగా గడిచింది. మరీ చిన్న పిల్లలు ఏమాత్రం బెరుకు లేకుండా చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. ముఖ్యంగా "ముద్దుగారే యశోద" పాటకు పూర్తి క్లాసికల్ ఆహార్యంతో నటిస్తున్న ఇద్దరి పిల్లమధ్యకి మరో చిన్న పిల్లాడు అనుకోకుండా చేరి అడుగులు కలపటంతో పలువురు ఘొల్లుమన్నారు. నాకైతే పడమటి సంధ్యారాగంలో జంధ్యాల తీసిన పాట గుర్తిచ్చింది. అలాగే ముంబై 26/11 మృతులకు శ్రద్దాంజలి నృత్యం చాలా బాగుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్తో సంక్రాంతి శోభను స్టేజిపై ఆవిష్కరించిన తీరు చాలా ఆకట్టుకుంది.

ఆ తర్వాత అతిధులుగా వచ్చిన ఇండోరు డి.ఐ.జీ. శ్రీనివాస్‌గారు (ఈయనది పిఠాపురం, మృదుభాషి, సహృదయుడు), ఆయన సతీమణి శ్రీమతి సుచరితగారు, ఇండోరు తెలుగు విజ్ఞాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామా రావుగారు (రిటర్‌మెంట్ అయ్యిన తరువాతకూడా ఏ మాత్రం వూపు తగ్గని తెలుగు భాషాభిమాని), సీనియర్ సైంటిస్ట్ భాస్కర్‌రావుగారి చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
తమాషా ఏమిటంటే లక్కీ డిప్‌లో నాకు బహుమతి రావటం.. అంత కన్నా లక్కీ ఏమిటంటే ఇంత మంది తెలుగువాళ్ళతో పరిచయం కావటం. అందులో ప్రసాదుగారు, శాస్త్రిగారు, ఫణీంద్రగారు, నారాయణగారులంటి సాహిత్యాభిమానులు దొరకటం..!! డిన్నర్ కానిచ్చి భారంగా ఒకరికొకరం శెలవు పుచ్చుకొని ఇళ్ళు చేరాం.

బ్లాగోగులు: ప్రవాసాంధ్రులు

(ప్రవాసాంధ్రులంటే విదేశాలలో వున్నవారే కాదు స్వదేశంలో వేరే రాష్ట్రాలలో వున్న ఆంధ్రులు కూడా అని గమనించగలరు)

ప్రవాసంలో వున్న ఆంధ్రులు సామాన్యంగా "అదే మా వూర్లో అయితేనా.." అనో "ఎంతైనా మనవాళ్ళు.." అనో అవకాశం వచ్చినప్పుడల్లా అంటారని నా అనుభవం. లక్నోలో వున్న ఒక తెలుగు స్నేహితుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడి ఆంధ్రా భవన్లో భోజనం చేసి, తెలుగు సరుకులు దొరికే షాపుల్లో కావాల్సినవి కొనుక్కోని కానీ తిరిగి వెళ్ళడు. (తెలుగు సరుకులేమిటి అనకండి - క్రేన్ వొక్కపొడి, ప్రియ పచ్చళ్ళు, నెల్లురు సోనా మసూరి, ఎంటీఆర్ గులాబ్‌జాం, బ్రూక్‌బాండ్ కాఫీపొడి, చింతపండు, బియ్యప్పిండి... ఇంకా ఇలాంటివన్నమాట. నేను చూసినంతలో ఇలాంటివి నార్త్ ఇండియాలో ఎక్కడా దొరకవు)

ఇది ఇలా పక్కన పెడితే మరో విషయం - నేను బ్లాగులు వ్రాయటం మొదలెట్టాక కొంతమంది మిత్రులకి లంకెలు పంపించాను. అందులో ప్రవాసాంధ్రులు వున్నారు.. వాళ్ళంతా అన్న మాటల్లో ముఖ్యమైనది, ప్రముఖమైనది ఏమిటంటే - "అబ్బ.. తెలుగు అక్షరాలు చూసి చాలా రోజులైంది.. థాంక్యు."

ఇలాగే ప్రవాసాంధ్రుల్లో తెలుగు మిస్ అయ్యేవాళ్ళు చాలామంది వుంటారని నా అనుమానం. మరీ ప్రత్యేకించి ప్రవాసంలో వున్న మహిళలు (Home makers) ఈ తెలుగుని ఎక్కువగా మిస్ అవుతారని నాకనిపిస్తోంది. ఇందుకు కారణం లేక పోలేదు - అయ్యగార్లు సామాన్యంగా ఆఫిస్ పనుల్లో ఇంగ్లీషు వాడుతుంటారు అది హైదరాబాదైనా, ముంబై అయినా..!! కాబట్టి వాళ్ళకి అంత మార్పు కనపడదు. కానీ ఆడవారికి అట్లాకాదు.. కూరగాయల బండి నించి ఇంట్లో పనిమనిషి దాకా ఏ హిందీలోనో లేకపోతే కూచిపూడి భరతనాట్యం భగిమల్లోనో మాట్లాడాలి.. (ఠక్కున చెప్పండి బూడిద గుమ్మడికాయని ఇంగ్లీషులో ఏమంటారు... పోనీ గిన్న అడుగంటింది గట్టిగా తోము అనేది హిందీలో చెప్పండి...). ఇలాంటి వారికి దగ్గర్లో తెలుగువారు లేరు అనే భావన తప్పకుండా వుంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు నవలలు, వీక్లీ చదివటం అలవాటున్న ఆడవారికి ఈ ప్రవాసం ఒక ప్రహసనం. ఇలాంటివారిని మన బ్లాగ్ పాఠకులుగా చేసుకోవడం చాలా సులభమని నేననుకుంటున్నాను. (అయితే ఈ తెలుగు మిస్సింగ్ భావన ఆడవాళ్ళకు మాత్రమే కాదండోయ్.. ఆడవాళ్ళలో ప్రముఖం అని నా అభిప్రాయం)

మరి ప్రవాసంలో వున్న ఇలాంటివారందరినీ కలిసి మన బ్లాగులగురించి చెప్పే అవకాశం గురించి చెప్తాను -

నేను గమనించినంతలో ఎక్కడ పది పదిహేను కుంటుంబాల మేర తెలుగువాళ్ళున్నా అక్కడ ఒక తెలుగు అసోసియేషన్ లేదా తెలుగు క్లబ్ వుంటుంది. (నాకు తెలిసి - చెన్నై, ముంబై, పునే, అహ్మదాబాదు, భోపాల్, ఇండోర్, ఆనంద్, ఢిల్లీ, లక్నోలలో ఇలాంటి అసోసియేషన్లు వున్నాయి). విదేశాలలో అయితే ఖచ్చితంగా తెలియదుకానీ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో వున్న అసోసియేషన్లలో కొన్ని చోట్ల తరచుగా కలిసినా ఎక్కువ శాతం కార్తీక మాసం, సంక్రాంతి, వుగాది సందర్భాలలో కలుస్తారు. అదే మనకి మంచి అవకాశం...!! మరో పక్షంలో రాబోతున్న సంక్రాంతికి మీరూ మీ ప్రాంతంలో వున్న తెలుగు అసోసియేషన్‌కి వెళ్ళండి. వాళ్ళు జరపబోయే కార్యక్రమాలలో మీరు పలు పంచుకోండి. అక్కడ ఈ-తెలుగు కర పత్రాలు ఇవ్వండి, మన బ్లాగుల విశేషాలు చెప్పండి. ఇప్పుడు యండమూరి రచనలు, వార పత్రికలు ఇంటెర్నెట్లొనే చదవచ్చని చెప్పండి. కొత్త తెలుగు సినిమాలు ఇప్పుడు అంతర్జాలంలొ చూడచ్చని చెప్పండి (ఇది అన్నిటికన్నా పెద్ద పాయింటు - తెలుగువారు సినిమా ఒక విడదీయరాని బంధం కదా). మీ బ్లాగులో మీరు రాసుకున్నదో, మరో బ్లాగర్ రాస్తే మీకు నచ్చినదో తీసుకెళ్ళి చదవండి. ఇంకా వీలైతే లైవ్ డెమాన్‌స్ట్రేషన్ చెయ్యండి, ఆఫ్‌లైన్లో లేఖినిలో తెలుగు అక్షరాలు చూపించండి.

మరో ముఖ్యమైన విషయం - సాధారణంగా కరపత్రంలో చూసి వుత్సాహపడినా ఇంటికెళ్ళిన తరువాత/ఆఫీస్ కి వెళ్ళిన తరువాత (చాలామంది ఆఫీస్‌లోనే అంతర్జాలం చూస్తారు) ఆ విషయం మర్చిపోతారు. గుర్తొచ్చినప్పుడు కరపత్రం ఎక్కడపెట్టారో గుర్తుకురాదు. అందుకే మనం కరపత్రాలతో పాటు మరో చిన్న పనిచేస్తే బాగుంటుంది. అదేమిటంటే ఆ సమావేశాలలో ఒక రిజిస్టరు పెట్టి వచ్చిన ప్రతివారి వివరాలు ముఖ్యంగా మైల్ ఐడీ వ్రాయమని చెప్పండి. ఆ తరువాత వారందరికీ లింకులిస్తూ ఒక వేగు పంపితే సరి. ఆ రోజు జరిగిన తెలుగువారి సమావేశం గురించి ఇంటర్నెట్‌లో మర్నాడు వస్తుందని మీ బ్లాగ్ లంకె ఇవ్వండి. మర్నాడు మీ బ్లాగ్‌లో ఆ విశేషాలు టపాగా వ్రాయండి.

ఈ సంక్రాంతికి నేను ఇండోరులో ఈ పని చెయ్యటానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాను... మీరూ మొదలెట్టండి మరి..!!

ఇదంతా బాగానే వుంది మరి ప్రవాసంలో లేని వాళ్ళం ఏమి చెయ్యాలి అని అడగచ్చు... అలాగే ప్రవాసంలో వున్న వారు కూడా సంవత్సరానికొక పండగ.. ఇంటికెళ్ళాలి అంటున్నారా..?? అయితే వోకే. పండక్కి ఇంటికొచ్చే ప్రవాసాంధ్రులు చాలామందే వుంటారు. మీరూ ఇంటికెళ్ళినప్పుడు ఇలాంటి మిత్రులని తప్పకుండా కలుస్తారుగా..!! వారికి చెప్పండి.. మైల్ ఐడీ తీసుకోండి. వేగు పంపండి..!!

(వేగు విషయం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మొన్నా మధ్య నేను గుంపుకు పంపిన వేగులో చైన్ మైల్ గురించి ప్రస్తావించాను. హై. చర్చలో అది ఏ భాషలో వుండాలి అని ప్రశ్న వచ్చింది. తెలుగులో పంపితే మళ్ళీ డబ్బాలు కనిపిస్తాయేమో అన్నారు. ఈ మధ్య ఒక బ్యాంకు నాకు పంపిన మైల్ చూసి నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం చెప్పదలుచుకున్నది బొమ్మ (image) రూపంలో పెట్టి వేగు పంపలేమా..?? టెక్కునిక్కులు తెలిసినవారెవరైనా వివరించగలరు)

బ్లాగోగులు: తెలుగు బ్లాగర్లకు ఒక రూపం కల్పిద్దాం..!!


మొన్నామధ్య అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా గుంపుకి నేనొక వేగు పంపాను - "తెలుగు బ్లాగుల అభివృద్దికి మనమేమి చెయ్యొచ్చు??" అని. అందులో కొన్ని విషయాలను హై. సమావేశంలోనూ, అంతర్జాల సమావేశంలోనూ చర్చించారు. యోగ్యత అనుసరించి కొన్ని పాటించటం మొదలుపెట్టాము కూడా. చాలా సంతోషం. అందులోని విషయాలనే ఇంకొంచెం వివరంగా చర్చించాలని నా ప్రయత్నం. అందులో లేనివి కూడా కొన్ని సందర్భానుసారంగా ప్రస్తావిస్తాను.

తెలుగు బ్లాగుల ప్రచారోద్యమంలో ఈ-తెలుగు స్టాలు ఒక మైలు రాయి అనిపిస్తోంది నాకు. అక్కడ బ్లాగ్మిత్రులు తీసుకున్న శ్రమ, సమయస్ఫూర్తి (కరపత్రాలనించి స్టాలుకి, స్టాలు నుంచి స్టేజికి, చివరికి ఆ పుస్తక ప్రదర్శన సైటు మనమే తయారు చేసే దాకా) ఎంతో అభినందనీయం. అక్కడ నేను లేకపోతినే అంటూ చాలా మంది బ్లాగర్లు ఇప్పటికే అన్నారు. నేను అనలేదు... అనను కూడా... ఎందుకంటే నేనక్కడలేకపోయినా అందులో భాగస్వామినే. మా నాన్నగారు నాకు ఫోన్ చేసి "టీవీలో చూపిస్తున్నారు... ఎవరో తెలుగు బ్లాగర్లట అంతా కుర్రాళ్ళే (పద్మనాభంగారు కనపడలేదనుకుంటా.. కనపడ్డా ఆయన వుత్సాహంలో కుర్రాడేగా..!!) తెలుగుకోసం ఎంత పనిచేస్తున్నార్రా.." అని అంటే నేను "అవును నేను కూడా అందులో భాగమే... హైదరాబాదులో లేను కానీ లేకపోతే నేనూ అక్కడే వుండేవాడిని" అని చెప్పుకొచ్చా. విషయమేమిటంటే... నన్ను నేను అక్కడ శ్రీధర్‌లోనూ, శిరీష్‌లోనూ, లక్ష్మిలోనూ, కశ్యప్‌లోనూ, పద్మనాభంగారిలోనూ చూసుకున్నాను.

ఈ సమావేశం టపాలలో ఒక చిత్రం జరిగింది (వుద్దేశ్యపూర్వకమో కాదో కానీ...) ఈ-తెలుగు సమావేశంలో తీసిన (చాయా) చిత్రాలను బ్లాగుల్లో పెట్టినవారెవ్వరూ - ఇదుగో నిల్చున్నవారు కుడి నుంచి ఎడమకి - అని పేర్లు వ్రాయలేదు. నాకూ తెలుసుకోవాలనిపించలేదు. ఎందుకంటే వారందరిలో నేనూ వున్నాను... అక్కడ నాకు కనపడేది తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేస్తున్న తెలుగు బ్లాగర్లు మాత్రమే. ఎవరో అనవసరం...!!

వీడేమిటి ఇలాగంటున్నాడు అనుకుంటున్నారా?? ఇక్కడ నేను అంటే తెలుగు బ్లాగర్. వ్యక్తిగతంగా నాకు తోటి బ్లాగర్లతో మాట్లాడాలని - దార్లతో దళిత సాహిత్యం, రామరాజుతో గుత్తి గుమ్మడికాయ, భగవాన్‌తో వ్యంగ్య హాస్యం, సౌమ్యతో నేను చదివిన పుస్తకాల గురించి - ఇలాంటివి ఎన్నో. కానీ ఇవన్నీ సత్యప్రసాద్‌గా, అదే తెలుగు బ్లాగర్లమై మనం కలిస్తే మనం మాట్లాడేది బ్లాగాభివృద్ధి, అంతర్జాల తెలుగు వైభవం.. కాదంటారా..??

ఒక్క విషయం గమనించండి ఈ-తెలుగు సమావేశాలలో కృషి చేస్తున్నది శ్రీధరో, భార్గవోకాదు - ఒక తెలుగు బ్లాగర్ మాత్రమే. "నేనక్కడ వుంటే నిశ్చయంగా అక్కడ నిలబడేవాడిని.." - ఈ మాట అనుకోని తెలుగు బ్లాగర్ ఎవరైనా వున్నారా? (వుంటే జోహార్... మీరీ టపా ఇక్కడిదాకా చదవటమే తప్పు. అర్జెంటుగా కంట్రోలు ఎక్స్ కొట్టండి). అంటే వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం కాదా అనకండి.. నేననేది ఇదే అవకాశం మీ వూర్లో వస్తే మీరు కృషి చెయ్యరా అని? (చేస్తారా.. అయితే నా తరువాతి టపా తప్పకుండా చదవండి). మరో చిత్రం చూసారా - ఇప్పటిదాకా మనం చాలామంది బ్లాగరలను ముఖాముఖీ చూసిందిలేదు. అయినా ఏదైన విషయం వస్తే కత్తి మహేష్ అయితే ఇలా ఆలోచిస్తాడేమో, తాడేపల్లికి తెలిస్తే ఇంకో కొత్త తెలుగు పదం పుట్టిస్తాడు అనుకుంటాం. ముఖాలు తెలియకపోతేనేమి...?? కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే మనందరిలో అంతరాంతరాలలో తెలుగు బ్లాగర్ అనే ఒక సన్నని దారం సామ్యంగా కనపడుతోంది.

ఇప్పుడు అసలు విషయం -

మనమందరం పూలలాగా ఒక దారంతో కలిసిపోయి వున్నాం కదా.. అందరం కలిస్తే ఒక దండ అవుతాముకదా. ఆ దండకి ఇప్పుడు ఒక రూపం ఇవ్వాల్సిన అవసరం వుంది. నేననేది తెలుగు బ్లాగర్స్‌కి ఇప్పుడు ఒక చిహ్నం అవసరం. మనమందరం ఒకటి అని గుర్తుచేస్తూ వుండటానికి, సందర్భం వచ్చినప్పుడు చూసే వాళ్ళందరికి ఒహో వీళ్ళు ఫలానా కదూ అని చెప్పటానికి, ముఖాముఖి కలుసుకోని తెలుగు బ్లాగర్లందరికి ఒక రూపం తీసుకురావటానికి, ఏదైనా అవకాశం చిక్కినప్పుడు (పుస్తక ప్రదర్శనలాగా) దాన్ని బ్యానరు పైనా, బాడ్జీలపైనా వెయ్యటానికి, నాగ ప్రసాద్ లాంటివారు టీ షర్ట్‌పైన వెయ్యటానికి, తెలుగురత్న గ్రంధాలయంలో పెట్టే బ్లాగు ఈ-పుస్తకాలపైన వెయ్యటానికి, ప్రతి బ్లాగరు తన బ్లాగులో పెట్టుకొని బ్లాగు ప్రచారోద్యమంలో పాలు పంచుకోవటానికి, తరచుగా బ్లాగులగురించి వ్రాసే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఆ వ్యాసంలో ప్రచురించటానికి.. ఇంకా ఇలాంటివి ఒక ఇరవై ముప్పై అయినా వ్రాయచ్చు..!!
సరే చిహ్నం కావాలి...!! అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారా..?? చెప్తా అదీ చెప్తా -

అ) తెలుగు బ్లాగర్ల చిహ్నం తయారు చెయ్యమని బ్లాగర్లనే అడగటం/పోటీ పెట్టడం. (ఈ విషయం ఇదివరకే ప్రస్తావనకి వచ్చింది.. మళ్ళి ఒక ఆలోచన పారెయ్యండి). మన దగ్గర భగవాన్, వెంకట్ (వెంకటూన్స్), పృధ్వీరాజు లాంటి మంచి ఆర్టిస్టులు వున్నారు. వారు వేసినా సరే లేదా మరెవరైనా ఔత్సాహికులు వేసినదానికి మెరుగులు దిద్దినా సరే.

ఆ) రెండొవది చాలా సులభమైనది. ఎవరైనా పేరుమోసిన ఆర్టిస్టుని పట్టుకోని బాబ్బాబు మేమిలాగిలాగ తెలుగు బ్లాగర్లం అని చెప్పుకోని బొమ్మ గీయించుకోవడం. దీంట్లో వున్న ఇబ్బంది ఏమిటంటే సదరు ఆర్టిస్టుకి మన సంగతులు వివరంగా తెలియజేయాలి, ఆయనా తెలుసుకోవాలి అది బొమ్మలో రావాలి. రెండొవ సమస్య మన బ్లాగర్లు అలా "బయట"వారు వేస్తే కలుపుకుంటారా లేదా అనేది ప్రశ్న. (ఈ ఆలోచన నచ్చితే బాపూగారితోనే వేయించగలిగితేనే సార్థకత అని నా విశ్వాసం.)

ఇ) మూడొవది మరీ తెలివైనది - పుణ్యం పురుషార్థం ఆలోచన. మనం తెలుగు బ్లాగర్లం ఏదైనా పత్రికలో పోటీ ప్రకటిద్దాం. మాకు చిహ్నం చేసిపెట్టేవారు కావలెను అని. తయారు చేసి సాఫ్ట్/స్కాన్‌డ్ కాపీ పంపించండి, ఎన్నికైన బొమ్మకి పారితోషికం అని. అసలు ఆలోచనేమిటంటే సదరు ఆర్టిస్టుగారు బొమ్మ వెయ్యాలంటే వివరాల కోసం మనం ఇచ్చే లంకెలు పట్టుకొని కూడలి, పొద్దు నించి మొదలెట్టి బ్లాగులు చదివి ఆకళింపు చేసుకొని బొమ్మ గీసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రక్రియలో ఒక వందమంది అయినా "ఆర్టిస్టులు" బ్లాగులు చూస్తారు. (చదువరులు పెరుగుతారు, ఆర్ట్"ఇష్టులు" కాబట్టి మళ్ళీ వస్తారు, లేదా వారి బొమ్మలతో ఒక బ్లాగైనా పెడతారు.)

ఏది ఏమైనా ఇలాంటి చిహ్నం మనం తయారు చేసుకోవటం అవసరం, అత్యవసరం. తరువాతి టపాలో నేను చెప్పే కొన్ని విషయాలు ఇలాంటి చిహ్నంతో చేస్తే బాగుంటుంది. అందుకని యుద్ధప్రాతిపదికన మీ అభిప్రాయం వ్యాఖ్య రూపంలో చెప్పండి..!! (ఎందుకు బ్రదర్ అనవసర ప్రయాస అంటున్నారా సరే అదే చెప్పండి).

బ్లాగోగులు: తెలుగులోనే ఏల బ్లాగవలె?

నిన్నటి నా టపాకి నెటిజెన్‌గారి ప్రశ్న ఇది - తెలుగులోనే ఏల బ్లాగవలె?

చాలా చిన్న ప్రశ్న, కానీ సమాధానం పెద్దది అందుకే టపాగా రాస్తున్నా.

దీనికి రెండు రకాల సమాధానాలు -

అ)వ్రాయటానికి సంబంధించి

అ.అ)మనమందరం మా
తృభాషలోనే ఆలోచిస్తాం. ఇది శాస్త్రీయంగా నిర్ధారితమైన సత్యం. మనం ఆంగ్లమో మరో భాషో మాట్లాడాలన్నా తెలుగులో ఆలోచించుకొని మాటల్లోకి వచ్చేసరికి తర్జుమా చేసుకుంటాం. అలా ఆలోచించటంలో ఒక సౌలభ్యముంది (Comfort). అదే ఆలోచనలను మాతృభాషలో వ్రాయటం సులభం, తర్జుమా చేసి ఆంగ్లంలో వ్రాసేకన్నా. ఈ మాట తెలుగేతర భాష తెలిసిన వారందరూ వొప్పుకుంటారనుకుంటున్నా. తెలుగులో బ్లాగు వ్రాయటానికి ఇదే ప్రాధమిక కారణం అని నేను నమ్ముతున్నాను.

అ.ఆ) తరువాతది - "నాకు తెలిసిన చాలా విషయాలు తెలుగులో చెప్పటం, తెలుగువారితో చదివించడం సులభం". కవిత్వం, పద్యం, సంక్రాంతి ముగ్గులు, బాపు రమణలు, తెలుగు సినిమా, వాలు జడలు, వయ్యారి భామలు, పంచె కట్టులు, పాపిటబిళ్ళలు, పరికిణీలు, బతుకమ్మలు, చిరంజీవి - చంద్రబాబు, నుడికారం, సామెతలు... ఇలాంటివి వేరే భాషలో రాయాలంటే (రాయచ్చు) ఈ పదాలకి అర్థం రాయాటానికే ఒక టపా రాయాలి. (పరికిణీ అంటే ఒక రకం డ్రస్సు అంటే సరిపోతుందా..?? అందులో వున్న అందం, వయ్యారం, ఠక్కున గుర్తొచ్చే తెలుగుతనం గురించి వేరే భాషలో ఎంతవరకు చెప్పగలరు..??)

అ.ఇ) మూడొవది భాషాభిమానం. దీని గురించి నిన్నటి టపాలో కూడా ప్రస్తావించాను.

అ.ఈ) నాకు తెలుగు మాత్రమే తెలుసు. వేరే ఏ భాషపైనా పట్టులేదు

రెండొవది: మళ్ళీ అదే పాయింటు. ఆ)పాఠకులు.

ఇంగ్లీషులో బ్లాగులు మొదలెట్టి తెలుగులోకి వచ్చిన వాళ్ళు మన గుంపులో చాలామందే వున్నారనుకుంటా. నేను కూడా ఒకడిని. (నకిలీ కణికుడి గురించి చెప్పే అమ్మవొడి బ్లాగు మరొక వుదాహరణ). ఇందాక చెప్పినట్టు తెలుగు వారు చదివి అసోసియేట్ (associate)చేసుకోవటం సులభమనే కారణం ఒకటైతే, ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన బ్లాగు అగ్రిగేటర్ల ద్వారా పాఠకులు దొరుకుతారు అనే నమ్మకం మరొకటి.

ఏ రకంగా చూసినా పాఠకులే ప్రాధమికం. అయితే ఈ ప్రశ్న మన ప్రచారోద్యమంలో కొత్త కోణం చూపిస్తుంది. అదేమిటంటే మనం ప్రచారం చేసేటప్పుడు ఏ విషయం పైన ఫోకస్ చెయ్యాలి అన్నది.

తెలుగులో వ్రాయటానికి కారణం పైన చెప్పిన ఫలానా ఫలానా అయితే వాటి గురించే ప్రచారంలో ప్రస్తావించడం అవసరం -

ఉదా:
అమెరికాలో వుండి సంక్రాంతి ముగ్గులు, హరిదాసు పాటలు మిస్స్ అవుతున్నారా?
మీ పిల్లలకి వేమన పద్యాలు రావని బాధపడుతున్నారా?
అయితే నేడే చూడండి తెలుగు బ్లాగులు..!!

(వచ్చే టపాలో: తెలుగు బ్లాగర్లకొక రూపం కల్పిద్దాం)

బ్లాగోగులు: మనకి కావలసింది ఏమిటి?


ఇది ప్రాధమిక ప్రశ్న. తెలుగు బ్లాగుల వ్యాప్తికి కృషి చేద్దామని ఇప్పటికే పలు బ్లాగర్లు అనటం జరిగింది. వ్యాప్తి చెయ్యటమంటే ఏమిటి? బ్లాగులు పెంచాలా? బ్లాగర్లను పెంచాలా? పాఠకులని పెంచాలా?

అందుకే ఈ ప్రశ్న.

మనకి కావలసింది ఏమిటి?

దీనికి నాకు తోచిన జవాబు చెప్పే ముందు మరి కొంచెం లోతైన ప్రశ్న - ఆసలు మనం ఎందుకు బ్లాగుతున్నాం?

నా వరకు చెప్పాలంటే నేను బ్లాగు మొదలు పెట్టకుముందే అచ్చోసిన రచయితని (అనగా అడపాదడపా అచ్చులో నా రచనలు ప్రచురించబడ్డాయి). నేను బ్లాగటం మొదలు పెట్టింది నా దగ్గర వున్న రచనలని కొత్తగా మొదలైన ఒక మాధ్యమం (అంతర్‌జాలంలో) పెట్టడం. అంతే. అయితే వ్రాయటం మొదలెట్టాక అడపదడపా వ్యాఖ్యలు మొదలై తరచుగా రావటం మొదలైయ్యాయి. ఆ ప్రోత్సాహం మరిన్ని (కొత్త) కథలు రాయటానికి స్పూర్తి నిచ్చాయి. ఈ వ్యాఖ్యలు లేకపోతే గతంలో అచ్చైన కథలవరకు ఎక్కించేసి శెలవు పుచ్చుకునేవాణ్ణి. (అసలు నేను వ్రాయటం ఆపేసి అయిదు సంవత్సరాలైంది. మళ్ళీ రాస్తున్నానంటే అది మీ చలవే)

చెప్పొచ్చేదేమిటంటే.. నేను నాకోసమే బ్లాగు రాసుకుంటున్నాను, ఎవరు చదివినా చదవక పోయినా - అనే మాట అసంబద్ధంగా తోస్తుంది నాకు. అలాగైతే ఈ కూడళ్ళు, జల్లెడలూ ఎందుకు చెప్పండి? మీరు రాసుకునేది రాసుకోండి, రెండు మూడు సార్లు చదువుకోండి, మురిసిపోండి. ఇంకొకరు చదవాల్సిన పనిలేదు కాబట్టి ఏ ఆశలు ఆశయాలు లేవు..!!

నేను మాత్రం వొప్పుకోనండి..! ఎవరెన్ని చెప్పినా కళకారుడికి చప్పట్లే సన్మానపు దుప్పట్లు..!! బ్లాగరికి కామెంట్లే సన్మానపు దుప్పట్లు..!!

తనకోసమే వ్రాసుకునే వాళ్ళకి ఈ చర్చతో పనిలేదు. మీరు వ్రాసుకోండి.. అంతర్జాలంలో తెలుగు వెలుగుకి మీరూ ఒక సమిధనిచ్చారని (ఆ వుద్దేశ్యంతో కాకపోయినా) మీకు నెనర్లు. (ఈ విహారిణి కుడిచేతివైపు అన్నిటికంటే పైన ఒక ఇంటూ గుర్తు వుంటుంది అది నొక్కండి).

అలా కాదు నేను రాసేది ఇతరులు చదవటానికే అనే వాళ్ళు చదవటం కొనసాగించవచ్చు.

ఇతరులు చదవటానికి వ్రాసేవాళ్ళు అసలు ఎందుకు వ్రాస్తారా అని ఆలోచిస్తే నాకు తట్టిన సమాధానాలివి -

అ) నా భావాలు నలుగురితో పంచుకోవాలి

ఆ) నా అనుమానాలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎంతమందికి నచ్చుతాయో తెలుసుకోవాలి

ఇ) నేనూ రచయితనే.. ఈ సంగతి స్వాతీ ఆంధ్రభూమి తెలుసుకోలేకపోయాయి... మీరన్నా తెలుసుకోండి (నా లాంటివారు)

ఈ) నాకు తెలిసిన విషయం కొంత మందికైనా వుపయోగపడుతుంది..

ఉ) నా రచన చదివి ఎవరైనా వీరతాళ్ళేస్తే నాకు ఎంత సంబరమో

ఊ) వాడెవడో సత్యప్రసాదట - నేను వాడి కన్నా బాగ రాయగలనని నిరూపించాలి


ఇంకా ఇలాంటివి మరెన్నో వుండచ్చు - అన్నింటిలో సామ్యమైన విషయం ఏమిటంటే - నేను రాసింది చదివేవాళ్ళు కావాలి..!! నేను రాసినదానికి వ్యాఖ్యల రూపంలో అభినందనో, అభిప్రాయమో కావాలి. ఇది జరగాలంటే చదువరులు ఇంకా కావాలి.

బ్లాగర్లలో మరో వర్గం - తెలుగు భాషాభిమానులు. పైన చెప్పిన వర్గంలో భాషాభిమానులు లేరా అనకండి. ఇది ఇంకో రకమైన విభజన (Classification). దాదాపు అందరిలోను భాషాభిమానం వున్నా కొంచెం బలంగా అంటే బ్లాగు మాధ్యమంగా తెలుగు వాడకం పెంచాలనో, అంతర్జాలంలో తెలుగు వాడకం పెంచాలనో, కొండకచో "తెలుగు వాడుక భాషా దోషాలను సమూలంగా ప్రక్షాళన గావించెద" అనే తీవ్ర అభిమానులు వుంటారు. వీరి పుణ్యమే ఈ నాటి తెలుగు వెలుగులు, ఇంకా జరుగుతున్న అంతర్జాల తెలుగు భాషోద్యమ ప్రయత్నాలు. (నేను ఇక్కడకూడా వున్నాను అందుకే ఈ టపా). వీరి ప్రయత్నాలు ఫలించాలంటే అంతర్జాలంలో తెలుగు వెలుగుల గురించి మరింత మంది చదవాలి. వీరికీ చదువరులు మరింతగా కావాలి.

ఇక ఇంకొక విషయం - బ్లాగులు మొదలు పెట్టినవారి స్వగతాలో, సింహావలోకనాలో, లేదా మొదటి టపాలో చదవండి.

అ) నేను ఫలానా ఫలానా వారి బ్లాగు చదవటం మొదలు పెట్టాను. వారిలాగ/వారి కంటే బాగా రాయగలననే నేను మొదలెట్టా

ఆ) ఈనాడులో/ఆంధ్రజ్యోతిలో తెలుగు బ్లాగుల గురించి చదివాను.. నేనూ మెదలెట్టాను

ఇ) గూగులమ్మని ఏ వేమన గురించో పోతన గురించో అడుగుతుంటే తెలుగు పదాలు కనపడ్డాయి.. హై భలేగుందే అని ఒక నొక్కు నొక్కాను... ఆ తరువాత అ) పాయింటు చదువుకోండి.

ఇలాంటి కారణాలు కనిపిస్తాయి. కొంత మంది ఇంతకు ముందే అచ్చోసిన రచయితలు (నా లాంటోళ్ళూ) మినహాయిస్తే ఎక్కువగా బ్లాగులు మొదలెట్టిన వారు ముందు చదివారు, తరువాత మొదలెట్టారు. కాబట్టి మనం ఏం కనిపెట్టాం.. బ్లాగు రాయండి అని ప్రచారం చెయ్యటం కన్నా బ్లాగులు చదవండి అని ప్రచారం చేస్తే చదివిన వారు నెమ్మదిగా వ్రాస్తారు. పరంతూ... (అంటే కాకపోతే) ఇలాగొచ్చినవాళ్ళకి మీరూ వ్రాయండి... వ్రాయటం చాలా వీజీ అని చెప్తుంటే చాలు.

ఇప్పటికిక్కడ ఆపేస్తే మనకి కావల్సింది చదివేవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. పాఠకులే ముఖ్యం..!! రచయితలు కాదు..!! నేటి పాఠకులే రేపటి రచయితలు..!! కాబట్టి అంతర్జాలంలో తెలుగు చదివేవారికోసం వుద్యమిద్దాం..!! (నాకు తోచిన కొన్ని అవిడియాలు తదుపరి టపాలలో)

మొన్నామధ్య మాయాబజార్‌లో ఒక సన్నివేశం పేరడీలో నేను చెప్పదల్చుకుంది అదే. జ్యోతిగారు కరెక్టో అని మార్కులేశారు. మీరేమంటారు? మీరంతా నిరభ్యంతరంగా విభేదించవచ్చు, అనామక వ్యాఖ్యలేసుకోవచ్చు... ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే నేను వ్రాసేది చదివేవారికోసమే... వారి వ్యాఖలకోసమే.


ఆంధ్రజ్యోతిలో పలక బలపం

మొన్న గురువారం (18/12/2008) నవ్యలో ప్రచురించారట... ఎవరో మిత్రుడు వ్యాఖ్యలో రాయబట్టి తెలిసింది... ఆ తరువాతే నాగామృతంలో చదివాను. నెనర్లు.




అరిపిరాల

బ్లాగోగులు: మాయాబజార్

తాన శార్మ: ఏమయ్యా ఇవేనా మీరు చేసిన ఏర్పాట్లు?

చినమయ్య: అం అః ఇం ఇః - నవతరంగం, పొద్దు, ఈ మాట, వైజాగు డైలీ

తాన శర్మ: ఓహో హో ఇవి వెబ్ పత్రికలు

చినమయ్య: కూడలి, జల్లెడ, తెలుగు బ్లాగర్స్...

తందాన శాస్త్రి: ఇవన్నీ అగ్రిగేటర్లు

లంబు: రెండు రెండ్లారు, తోటరాముడు, నవ్వులాట, హాస్య దర్బారు, భగవాన్ కార్టూన్లు, వెంకటూన్లు, వికటకవి

తాన శార్మ: మాకు తెలుసులేవయ్యా ఇవి హాస్య బ్లాగులు

జంబు: సాహితీయానం, సంగతులు, దార్ల, కళాస్పూర్తి, పలకబలపం

తాన శర్మ: ఏవుంది.. సాహిత్యం బ్లాగులు

చినమయ్య: సరే ఇవి చూడండి సాములు - హరిసేవ, నరసింహ, దైవలీలలు

తందాన శాస్త్రి: ఆపు ఆపు.. ఇవి భక్తి బ్లాగులు

లంబు: కలగూర గంప, పర్ణశాల, గడ్డిపూలు...

తాన శర్మ: సర్లేవోయ్ ఇవన్నీ అనుభవాల బ్లాగులు

జంబు: ఇంకా వున్నాయి సాములూ

తాన, తందాన: మాకు తెలుసులేవయ్యా ఇంకా వంటకాల బ్లాగులు, పురాణాల బ్లాగులు, సంగీతాల బ్లాగులు వున్నాయి..!! అసలైనది ఏది కనపడదే?

లంబు జంబు
: ఓ తెలిసింది తెలిసింది

తాన, తందాన
: ఏమిటి తెలిసింది?

లంబు జంబు:
బూతు బ్లాగులు...! బూతు బ్లాగులు..!!

తాన, తందాన: శివ శివ శివ శివా.. అలాంటి లేకపోవటమే కదా తెలుగు బ్లాగుల ప్రత్యేకత

లంబు జంబు
: మరింకేం కావాలి సాములూ ??

తాన, తందాన:
బ్లాగులు చదివేవాళ్ళు.. పాఠకులయ్యా చిన్నమయ్యా.... పాఠకులు, వ్యాఖ్యలు లేకపోతే మా ప్రభువులు ఒక్క టపా అయినా వ్రాయరు తెలిసిందా..!!

(సరదా వూహ రాగానే వ్రాసేశాను... ఇందులో వున్న బ్లాగులు అప్పడు గుర్తుకువచ్చినవి మాత్రమే... వేరే ఏ ప్రాధాన్యతలు లేవు )