బహుళ పంచమి జోత్స్న (హర్రర్ కథ)

“తాతయ్యా కథ చెప్పవూ..” బిలబిలమంటూ చేరారు పిల్లలు. క్యాలండర్ తిరగేస్తున్న వెంకటరామయ్య అది పక్కన పెట్టి కళ్ళజోడు తీస్తూ –

“ఏం కథలురా పొద్దస్తమానం... సెలవలంతా తాతయ్య దగ్గర కథలు చెప్పించుకుంటూ కూర్చుంటే, వచ్చే సంవత్సరం క్లాసు పుస్తకాలు తెచ్చుకున్నారు కదా? వాటినేం చేస్తారు?” అన్నాడు.

“సెలవలు అయిపోయాక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాం... అప్పుడు ఎట్లాగూ స్కూలు, చదువులు తప్పవు... కథలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వింటాం తాతయ్యా?” అంది పెద్ద మనవరాలు స్నిగ్ధ. అవును అవునంటూ మిగిలిన నలుగురు వంత పాడారు.

వెంకటరామయ్య గట్టిగా నిట్టూరుస్తూ – “సరే... ఇంత వరకూ మీరెవరూ వినని, నేను ఎవరికీ చెప్పని కథ ఒకటి చెప్తాను... మీరెవ్వరూ భయపడకూడదు మరి...” అన్నాడు.

“అంటే దయ్యాల కథా తాతయ్యా?” అడిగాడు చిన్నవాడు సాకేత్. ఆయన అవుననట్లు తలవూపాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తల్లి శిరీషని చూసి –

“అమ్మా.. దయ్యాల కథ చెప్తున్నాడు తాతయ్య” అన్నాడు ఉత్సాహంగా.

“అలాంటి కథలు ఎందుకు మామయ్యా? వాడికి అసలే చచ్చేంత భయం.. ఒక్కడే బాత్ రూం కి కూడా వెళ్ళలేడు... ఇప్పుడు ఇలాంటి కథలు విన్నాడంటే ఇంక రాత్రంతా నన్ను వేధిస్తాడు” అంది శిరీష.

“ఇది మామూలు కథ కాదమ్మా... నిజంగా జరిగింది... నలభై ఏళ్ళ క్రితం నా కళ్ళ ఎదురుగా జరిగింది... ఇంత వరకూ నేను ఎవరికీ చెప్పని కథ...” అన్నాడు ఉత్సాహంగా. శిరీష ఆ మాట విని ఆసక్తిగా అక్కడే కుర్చీలో కూర్చుంది.

వెంకటరామయ్య కథ మొదలు పెట్టాడు.

***

నా వయసు ఇరవై లోపు వున్నప్పుడు జరిగిందిది. నేను, మా వూరి కరణం కొడుకు గోపాలయ్య, గుళ్ళో ఆచారి కొడుకు వామనాచారి ముగ్గురం ఒకే ఈడు వాళ్ళం. మా అన్నయ్య వెంకటసుబ్బయ్య కూడా ఒక సంవత్సరం చదువు తప్పడంతో మాతో పాటే చదివేవాడు. మేం నలుగురం కలిసి గుంటూరులో వున్న ఏ.సీ. కాలేజీలో ఒకేసారి బియ్యే చదవటానికి చేరాం.

అప్పట్లో గుంటూరు ఇప్పటిలాగా వుండేది కాదు. ఏ.సీ. కాలేజీకి దగ్గర్లో ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకోని అక్కడ మమ్మల్ని చదివించుకుంటూ వుండాలని మా అమ్మ ఆలోచన. అయితే నాన్న దేవతార్చనకి, నైవేద్యాలకి అమ్మ వూర్లోనే వుండాలని పట్టు పట్టడంతో అమ్మ రావటం సాధ్యపడలేదు. దాంతో వారాలు చేసుకోక తప్పింది కాదు మాకు.

కాలేజీకి దగ్గరగా వున్న బ్రాహ్మణుల ఇళ్ళన్నీ వెతికి, వుండటానికి గది కోసం, వారం వారం భోజనం కోసం అడగటం మొదలుపెట్టాం. ఇల్లు ఇస్తామన్న వాళ్ళందరివి కాలేజికి బాగా దూరంగానో, లేకపోతే నలుగురు వుండటానికి సరిపోని చిన్న చిన్న గదులో కావటం మూలాన వద్దనుకున్నాము. పోనీ వారమన్నా కుదురుతుందా అంటే “నలుగురు పిల్లలకి ఎక్కడ పెట్టగలం నాయనా..? మాకూ పిల్లా జెల్లా వున్నారు... ఏదో ఇద్దరి వరకైతే సర్దుకోవచ్చు..” అన్నారు చాలా మంది. ఈ పరిస్థితిలో ఒక పాత ఇంట్లో మా సమస్యకి పరిష్కారం దొరికింది.

ఆ ఇంట్లో వారం అడగటానికి నేనూ ఆచారి వెళ్ళాము. కొంచెం దట్టంగా చెట్లూ, పుట్టలు వున్న ప్రాంతం. అక్కడ ఒక ఇల్లు వుందని ఏ మాత్రం ఆనవాలు లేకుండా వుంది.

“అంత పాడుబడ్డ ఇంట్లో మనుషులు వుంటారా?” అన్నాను నేను.

“ఇల్లు ఎలా వుంటేనేం... మనకి కావల్సింది సమయానికి ఇంత తినడానికి, పడుకోడానికి ఒక గది... అడిగి చూద్దాం” అన్నాడు ఆచారి. మేం మాటల్లో వుండగానే ఆ ఇంటి ముందు గుమ్మం తెరుచుకోని ఒక ముసలి బ్రాహ్మడు వచ్చాడు.

“ఏమిటి నాయనా?” అన్నాడు పళ్ళులేని నోటితో. ఆయన భుజం మీద జంధ్యం, నుదుటన బొట్టు లేకపోతే ఆ సందర్భంలో అలాంటిని మనిషిని చూసి దడుచుకునేట్టు వున్నాడు.

“వినుకొండ దగ్గర్నుంచి చదువుకోడానికి వచ్చిన బ్రాహ్మలం... వసతి, వారం వెతుక్కుంటున్నాం..” అన్నాను నేను భయం భయంగా. ఆయన సాలోచనగా మా ఇద్దరి వైపు చూసి తృప్తిపడి – “సరే, ఈ పక్కగా వెళ్ళారో.. ఇంటికి వెనక బావి, పక్కన పెంకుటిల్లు వుంది. చూసుకోండి.. ఒకప్పడు మేము వున్న ఇల్లే... ఇది కట్టుకున్నాక అది ఖాళీగా వుంది... నచ్చితే రేపే దిగిపోండి...” అంటూ గడగడా చెప్పేశాడు.

“అద్దే అదీ...” అంటూ నసిగాడు మా ఆచారి.

“అద్దె లేదు ఏమీ లేదు... చదువుకునే పిల్లలు మీరు ఇచ్చేదేమిటీ? మేం తీసుకునేదేమిటి?” అన్నాడాయన. అప్పటిదాకా మా సంభాషణ తలుపు వారగా నిలబడి వుంటున్న ఆయన భార్య ముందుకు వచ్చింది.

“మాకు జరగకనా బాడుగలకి ఇవ్వడం? నలుగురు పిల్లలుంటే మాకు కాస్త తోడు వుంటారని... సామెత చెప్పినట్లు బెస్తల్లో పెద్ద బ్రాహ్మల్లో చిన్న... ఏదన్నా బజారు పని చెప్పినప్పుడు కాదనకుండా చేసిపెట్టండి చాలు... మీ భోజనాలు కూడా మా ఇంట్లోనే” అన్నది ఆమె. ఆ క్షణం మా నెలనాళ్ళ కష్టమంతా తీరినట్లైంది. ఆమెకూ, ఆయనకూ దణ్ణం పెట్టి తిరిగివచ్చాము. ఆ తరువాత ఆ వృద్ధ దంపతులు చెప్పినట్లే ఆ ఇంట్లో దిగి, వారికి చేదోడుగా పనులు చేసిపెడుతూ మా చదువులేవో కానిస్తున్నాం. అంతా సజావుగానే సాగుతోంది.

***

కథ చెప్తున్న వెంకటరామయ్య మధ్యలో ఆపి మంచినీళ్ళు ఇవ్వమని సైగ చేశాడు.

“ఏంటి తాతయ్యా.. దయ్యం కథ అన్నావు? వేరే కథ చెప్తున్నావు?” అంది స్నిగ్ధ మంచినీళ్ళు అందిస్తూ.

“వేరే కథ కదమ్మా... ఏదీ ఇంకా కథలోకి రానిదే..”

“అంటే ఆ ఇంట్లోనే దయ్యముందా?” అడిగాడు వైభవ్.

“కాదురా ఆ ముసలివాళ్ళే దయ్యాలై వుంటారు” అంది ప్రజ్ఞ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన భార్గవ పెద్దాయన వుట్టూ చేరిన పిల్లల్ని, కొంచెం అవతలగా కూర్చున్న శిరీషని చూశాడు.

“ఏంటి నాన్నా? పిల్లల్ని అందర్నీ కూర్చోపెట్టి ఏదో కథ చెప్తున్నట్లున్నారు?” అడిగాడు. వెంకటరామయ్య సమాధానం చెప్పేలోగా మనవడు వైభవ్ అందుకున్నాడు – “అవును మామయ్యా... తాతయ్య దయ్యం కథ చెప్తున్నాడు..” అన్నాడు.

భార్గవ చిన్న నవ్వు నవ్వి అక్కడే కూర్చున్నాడు. వెంకటరామయ్య కథని కొనసాగించాడు.

***

మేము చేరిన దాదాపు పదిహేను రోజులకి, అంటే నాకు బాగా గుర్తు – బహుళ పంచమి రోజు, మా గోపాలయ్య రెండు ఝాముల రాత్రి పూట లేచి బయటికి వెళ్ళాడు. మరో రెండు నిముషాలలో పెద్దగా పొలికేక పెట్టి పడిపోయి పొర్లుతూ ఇంట్లోకి వచ్చి పడ్డాడు.

ఏమైందిరా అంటే పలకడు. గుడ్లు మిటకరిస్తాడు, గుటకలు మింగుతాడు, కానీ ఒక్క మాట కూడా పెగల్లేదు. మంచినీళ్ళు తాగించాము, విసనకర్రతో విసిరాము, అయినా ఫలితం లేదు. మా నలుగురిలో పెద్దవాడు సుబ్బయ్యన్నయ్య బయటికి వెళ్ళి నాలుగువైపులా చూసి ఏమీ లేదని తేల్చాడు.

అయినా సరే గోపాలయ్య భయం మాత్రం పోలేదు. ఆ రాత్రి మొత్తం గసపెడుతూ, అరుస్తూ అట్లే మేలుకోని వున్నాడు. వాడికి తోడుగా మిగతా ముగ్గురం వంతులు వేసుకోని జాగారం చేశాము. తెల్లవారే సరికి వాడికి రక్త విరేచనాలు పట్టుకున్నాయి. మేము కాలేజీకి వెళ్తూ వస్తూ వాడికి సపర్యలు చేస్తూ, ఆయుర్వేదం, ఇంగ్లీషు మందులు అన్నీ ఇప్పింపజూశాం. ఏ మాత్రం గుణం కనిపించకపోగా వాడు మరింత నీరసించడం మొదలుపెట్టాడు. చివరికి ఒకరోజు వామనాచారిని వెంటపంపి వాణ్ణి మా వూరు చేర్చాం.

ఇది జరిగిన కొంతకాలానికి, సరిగ్గా చెప్పాలంటే మళ్ళీ బహుళ పంచమి రాత్రి తరువాత ఉదయాన్నే చూస్తే మేము బహిర్భూమికి వెళ్ళే చోట వామనాచారి పడి వున్నాడు. వాడికి నీళ్ళు చల్లి సపర్యలు చేసి లేపేసరికి తేరుకున్నాడు.
“నాకు కూడా రక్తవిరేచనాలు మొదలయ్యాయిరా” అన్నాడు నీరసంగా. మాకు దిక్కు తోచకుండా అయ్యింది. వీడి విషయం వెళ్ళి ఇంటి యజమానులకి చెప్పాము. ఇంతకు ముందు గోపాలయ్య విషయంలో కూడా పెద్దగా పట్టించుకోని వాళ్ళు, ఇప్పుడు కూడా ఏం లేదన్నట్లు తేల్చేశారు.

“వాడికి ఒకడికి వచ్చింది కదా... అదేదో అంటు వ్యాధి అయ్యుంటుంది... ఇప్పుడు మరొకరికి వచ్చింది.. మందులు ఇప్పించడమే కానీ మేం మాత్రం ఏం చెయ్యగలం చెప్పు నాయనా? పైగా పెద్దవాళ్ళం... ఆ రోగం మాకు గాని అంటుకునేనా.. మాకు కైలాస యాత్రే... అందుకని, ఆ పిల్లాణ్ణి ఇటు వైపు రాకుండా ఇంటి పట్టునే వుండమని చెప్పండి.. మీరు కూడా ఇటు రావడం తగ్గిస్తే మంచిది.” అన్నది ఆమె. అప్పటిదాకా గిన్నెల్లో అన్నం, కూరలు పెట్టిచ్చే ఆమె విస్తరాకుల్లో కట్టి ఇవ్వడం మొదలుపెట్టింది.

ఇది ఇలా వుండగా, ఆచారికి శక్తి మరింత క్షీణించడం మొదలుపెట్టింది. మనిషి నీరసించి పుల్లలా సన్నగా తయారయ్యాడు.

“పోనీ వాణ్ణి తీసుకుపోయి వూర్లో దిగబెట్టి వస్తానురా..” అన్నాడు సుబ్బయ్య అన్నయ్య.

“మీరు ఇద్దరూ పోతే నేను ఒక్కణ్ణే ఇక్కడ వుండలేను అన్నయ్యా..” అన్నాను నేను. ముగ్గురం వెళ్ళడానికి సరిపడా డబ్బులు కూడా చేతిలో లేవు. సరే ఏమైతే అది అయ్యిందని మేమే వాణ్ణి చూసుకుంటూ వున్నాం. దగ్గర దగ్గర మళ్ళీ నెల తరువాత మళ్ళీ బహుళ పంచమి రోజు రానే వచ్చింది. అప్పటికే వామనాచారి స్పృహ లేని విధంగా పడి వున్నాడు. ఇంక వాడు దక్కుతాడో లేదో అన్నట్లు వుంది పరిస్థితి. సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరినైనా సాయం అడగాలన్నా తెలియనితనం. పట్నం వచ్చి కొన్ని నెలలే అయ్యింది, ఇంకా పట్నం పోకడలకి అలవాటుపడని పల్లెటూరి మనుషులం.

ఈ జరిగేదంతా బహుళ పంచమి రోజే జరుగుతోందని అన్నయ్య అనుమానించాడు. అదే విషయం నాతో చెప్పడంతో – “పోనే ఈ రాత్రికి ఏ గుళ్ళోనన్నా పడుకుందామా” అని అడిగాను.

“మరి వామనాచారి సంగతి?” అడిగాడు అన్నయ్య.

ఇద్దరం ఇక తప్పదని ఆ ఇంట్లోనే ఒక మూల చేరి నోటికొచ్చిన దేవుళ్ళని తల్చుకుంటూ కూర్చున్నాం. ఆ రాత్రి మేము అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. ఒక రాత్రప్పుడు ఒళ్ళు తెలియకుండా నిద్రకూడా పోయాము. నిద్రలేచి చూస్తే అంతా మాములుగానే వుంది. ఆచారికి కాస్త నెమ్మదించినట్లు కూడా అనిపించింది. సంతోషంతో ఒకరినొకరం కావలించుకోని కాలకృత్యాలకి బయటపడ్డాం. నేను తిరిగివచ్చేసరికి అన్నయ్య ఒక్కడే ఇంటి గడప మీద కూర్ఛోని మోకాళ్ళలో తలపెట్టుకోని కూర్చోని వున్నాడు. నేను వచ్చానని తెలిసినా తల ఎత్తలేదు. నాకు భయంతో చెమటలు పట్టాయి. నాలుగుసార్లు “అన్నయ్యా... అన్నయ్యా...” అని పిలిస్తే నెమ్మదిగా తల ఎత్తాడు.

“నాకూ మొదలైనాయిరా...” అన్నాడు.

“ఏమిటి అన్నయ్యా?” అన్నాను నేను భయం భయంగా.

“నాకూ ఈ వేళ రక్తం పడిందిరా..” అంటున్నవాడల్లా నా వైపు చూసి “కెవ్వు”న కేక పెట్టాడు. నేను తలదించి చూద్దును కదా నా పంచె, లంగోటా మొత్తం తడిసివున్నాయి – రక్తంతో.

***

వెంకటరామయ్య క్షణం ఆపి అందరి ముఖాల్లోకి చూశాడు. ఆప్పటికే ఆయన కొడుకు భార్గవ, కోడలు శిరీష, కూతురు అపర్ణ, మనవలు మనవరాళ్ళు అంతా నిశబ్దంగా వింటున్నారు.

“ఇదంతా దయ్యం వల్లేనా మమగారూ?” అడిగింది శిరీష.

“ఈ కథ మాకు ఎప్పుడూ చెప్పలేదు మీరు?” అంది అపర్ణ. భార్గవ నవ్వేశాడు.

“ఏంటి అపర్ణా... పిల్లల కోసం నాన్న ఏదో కథ అల్లి చెప్తుంటే...” ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో అడ్డుకున్నాడు వెంకటరామయ్య.

“కట్టుకథ కాదురా... కావాలంటే ఈ సారి మన వూరెళ్ళినప్పుడు కరణంగారి కొడుకు గోపాలయ్య ఎలా చనిపోయాడో కనుక్కో...” అన్నాడు.

“అంటే గోపాలయ్య చనిపోయాడా?” అడిగింది శిరీష.

“అవును... అక్కడ వూర్లో చేరినా వాడి పరిస్థితి ఏమీ బాగుపడలేదు... రక్తం పోతూనే వుంది. చివరికి క్షీణించి క్షీణించి చనిపోయాడు... అయితే వాడి పోవడానికి ఒక్క రోజు ముందు చేసిన పని వల్ల మేము బతికిపోయాం...”

“ఏంటి తాతయ్యా అది?”

“అదేమిటంటే... కరణంగారి అబ్బాయికి బాగాలేదన్న సంగతి తెలుసుకోని మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ వాడి పరిస్థితి చూసి, విషయం అర్థం చేసుకోని, ఎదో మంత్రించిన విభూతి పెట్టారట. దాంతో అప్పటిదాకా మాట పలుకు లేకుండా పడివున్న వాడు కాస్త తేరుకోని, జరిగినదంతా ఆయనకు వివరంగా చెప్పాడు...” చెప్పాడు వెంటరామయ్య.

“దాంతో మీ నాన్నగారు... అంటే మా తాతగారు వచ్చి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి కాపాడాడు.. అంతేగా” అంది అపర్ణ.

“కాదమ్మా... అసలు కథ అప్పుడే మొదలైంది. చెప్తాను వినండి..” అంటూ కొనసాగించాడు.

***

నాన్నగారు మా ఇంటికి వచ్చేసరికి మేము ముగ్గురం మూడు శవల్లాగా పడి వున్నాము. ఇల్లుగలవాళ్ళు మా సంగతి పట్టించుకోవడమే మానేశారు. దాంతో మందులు కాదు కదా కనీసం తిండి పెట్టేవారు కూడా లేక అల్లాడిపోతున్నాము. నాన్నగారు, వామనాచారి తండ్రి సుదర్శనంగారు ఇద్దరూ కలిసే వచ్చారు. వామనాచారి పరిస్థితి చూసి ఆచారిగారి ఒకటే ఏడుపు. నాన్నగారు వచ్చారన్న సంతోషం వున్నా, లేవలేని పరిస్థితి మాది. నాన్నగారు మాత్రం లోపలికి వస్తూనే ఎవరినీ పట్టించుకోకుండా, ఏదో మైకంలో వున్నవాడిలాగా మంత్రాలు చదువుతూ, గట్టిగా వూపిరి పీలుస్తూ గది నాలుగు మూలలు తిరిగారు. చప్పున వచ్చి తనతో తెచ్చుకున్న విభూతి మంత్రించి వామానాచారి నుదుటన పెట్టాడు.

“సుదర్శనంగారు... ఇక ప్రాణ భయం లేదు... ఇక్కడ వున్నదేమిటో తెలుసుకుంటేకాని వీళ్ళ రోగాలకి విరుగుడు దొరకదు... నేను ఇక్కడే వుంటాను... మీరు పిల్లాణ్ణి వూరికి తీసుకెళ్ళి నా కోసం ఎదురుచూడండి. నేను విరుగుడు కనుక్కోని తీసుకొస్తాను..” అంటూ వామనాచారి తండ్రికి పురమాయించాడు. సుదర్శనంగారు ఆయన చెప్పినట్లే వామనాచారిని తీసుకోని బయల్దేరాడు.

ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే వున్నారు నాన్నగారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మాతో సంధ్యావందనం చేయిస్తూ, దానితో పాటే ఆయనతో జింక చర్మంలో చుట్టి తెచ్చుకున్న దేవతాప్రతిమలతో దేవతార్చన, రుద్రాభిషేకాలు ఇలా ఒకటని కాదు, ఎన్నో చేశాడు. మంత్రించిన విభూతి, తీర్థాలు తీసుకోని మాకు కొంచెం తెరిపినిచ్చినట్లైంది. అయినా పూర్తిగా కోలుకోలేదు.

మరో బహుళ పంచమి వచ్చింది. నాన్నగారు ఆ రోజు పూజాధికాలు ఎక్కువ చేశారు. అత్యంత గోప్యమైన ఒక రహస్యాన్ని ఛేదించబోతున్నట్లు ఉత్సాహంతో సిద్ధంగా వున్నారు. ఆ రోజు రాత్రి అవుతూనే ఇంట్లో ఉధృతంగా పూజలు చేశారు. మేము ఇద్దరం ఒకరాత్రి దాకా ఆసక్తిగా చూసి చివరికి అలసిపోయి నిద్రపోయాము. అర్థరాత్రి దాటిన తరువాత నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి అదిరిపోయాను... భయంతో నా గుండె ఆగిపోయిందేమో అనిపించింది. మా నాన్నగారు కళ్ళు మూసుకోని ఏదో మత్రం పఠిస్తున్నారు. ఆయనకి ఎదురుగా కూర్చోని వుంది... ఆ అమ్మాయి..!!

జుట్టు విరబోసుకోని, తెల్లటి చీరలో.. ఆమె... ఆ అమ్మాయి.. నాన్నగారి ఎదురుగా కూర్చోని.. “ఆపరా.. ఆపరా... ఆపు” అంటూ గొణుగుతూనే వుంది.

నేను గట్టిగా అరిచిన అరుపుకి కళ్ళు తెరిచారు నాన్నగారు. ఎదురుగా వున్న ఆమెను చూసి ఉలిక్కిపడి వెనక్కి జరిగారు.

***

కరెంట్ పోయింది.

పిల్లలు కెవ్వుమని అరిచి ఒకచోటికి ముడుచుకున్నారు.

“భయపడకండి... కరెంట్ పోయింది అంతే..” అన్నాడు వెంకటరామయ్య. “అమ్మా... కొవ్వొత్తి వెలిగించి తీసుకొస్తావా?” అన్నాడు శిరీషని చూసి.

శిరీష “అలాగే మామయ్యా” అంటూ లేచి భార్గవ దగ్గరగా వెళ్ళి – “తోడు వస్తావా?” అంది భయంగా. భార్గవ నవ్వుకుంటూ లేచి ఆమెతో వంటింటిలోకి వెళ్ళాడు. శిరిష కొవ్వొత్తితో తిరిగిరాగానే, ఆ వెలుగుతో కొంచెం ధైర్యం కూడగట్టుకోని పెద్దపిల్ల స్నిగ్ధ అడిగింది –

“తాతయ్యా ఆమె ఎవరు? దయ్యమేనా?” అని

వెంకటరామయ్య కొనసాగించాడు – “అవునమ్మా... ఆ పిల్ల దయ్యమే. పేరు జోత్స్న. ఆ ఇల్లుగల ముసలివాళ్ళ కోడలు. కొంతకాలం క్రితం అత్తామామల పోడు పడలేక ఆత్మహత్య చేసుకుందట. ఆ తరువాత మొగుణ్ణి వేధించి చంపింది. అత్తామామల్ని కూడా పీడిస్తుంటే ఆ ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇంట్లోకి మారిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో వుండటానికి వచ్చినవాళ్ళని ఈ విధంగా పీడిస్తోంది...”

“ఇదంతా ఆ దయ్యమే చెప్పిందా” అడిగాడు సాకేత్ ఆశ్చర్యంగా.

“అవునురా... నా కళ్ళ ఎదురుగా జరిగింది... మా నాన్నగారితో స్పష్టంగా మాట్లాడింది... తనని మంత్రబంధం నుంచి వదిలేస్తే నీ పిల్లల్ని నేను వదిలేస్తానని చెప్పింది..” చెప్పాడాయన కళ్ళు పెద్దవి చేస్తూ. ఆ సంఘటన గుర్తుచేసుకున్నందుకే ఆయన కళ్ళలో ఒక భయం కొవ్వొత్తి వెలుగులో కనిపిస్తోంది.

“అంతే కాదు... ఆ అమ్మాయి కనపడ్డ విషయం ఎవరికో చెప్పకూడదనీ, అలా మా నాన్నకి గోపాలయ్య చెప్పడం వల్లే అతని ప్రాణం పోయిందని చెప్పింది. మేము ముగ్గురం మరో అయిదు నిముషాలలో ఆ ఇల్లు ఖాళో చేసి వూరు వచ్చేశాం.. అదీ కథ” చెప్పాడాయన.

బిగుసుకుపోయినట్లు వున్న అందరినీ చూసి – “ఇంక చాలు వెళ్ళి పడుకోండి..” అన్నాడు ఆయన.
అందరూ భయం భయంగా ఒకరినొకరు చూసుకోని తమతమ గదులవైపు కదిలారు. స్నిగ్ధ ఎదో గుర్తుకొచ్చినట్లు ఆగి తాతయ్య వైపు తిరిగి అడిగింది –

“తాతయ్యా... ఆ రోజు జోత్స్నని చూసిన సంగతి ఎవరికైనా చెప్తే చచ్చిపోతారు అని చెప్పావు కదా? మరి ఇప్పుడు మాకు చెప్పేశావే..??” అంది. ఒక్కసారి పిడుగు పడ్డట్లైంది ఆ ఇంట్లో. అంతా విస్మయంగా ఆయన వైపు చూశారు.

నిలబడి వున్న వెంకటరామయ్య భయం భయంగా కుర్చీలో కూలబడ్డాడు. ఇన్నాళ్ళు ఏ కారణంతో ఈ రహస్యాన్ని దాచాడో ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు అంతా చెప్పేశాడు. అప్రయత్నంగా తన చేతిలో వున్న కేలండర్ లో ఆ రోజు తిథి గమనించాడు. ఆ రోజు బహుళ పంచమి.
<***>
(విపుల, ఆగస్ట్ 2014)
Category: