ఒక విజయసారథి (కథ)

భారత సైనికుల తెగింపు చూసి సూర్యుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. సైన్యం ఏ మాత్రం జంకు లేకుండా ముందుకు సాగుతోంది. వాళ్ళలో ఎంతమంది జీవించి వుంటారో తెలియదు, ఎవరెవరు తిరిగి తమ బిడ్డలను చూస్తారో తెలియదు. కానీ, భారతదేశ చరిత్ర వారి పేర్లు చేర్చుకోవడానికి తహతహ లాడుతోందన్న వూహే వాళ్ళని నడిపిస్తోంది.
మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి ఒక మైదానం లాంటి ప్రదేశానికి చేరారు. వారి కమాండర్ మనోహర్‌సింగ్ టెంట్లు వేసుకోని ఆ రాత్రికి అక్కడే వుండాలని ఆర్డర్ వేశాడు. అంతా ఒక్కసారిగా కూలబడిపోయారు. టెంట్స్ వెయ్యడం పూర్తి చేసి తమ తెచ్చుకున్న ఫుడ్‌పేకెట్స్ విప్పదీశారు.


నలుగురు - ఐదుగురుగా కూర్చుని మాట్లాడుకుంటూ.. జోక్స్ వేసుకుంటూ భోజనాలు పూర్తిచేశారు. ఆరు గంటల తరువాత ఎవ్వరూ సిగరెట్స్ కానీ ఏ ఇతర 'వెలుగునిచ్చే' వాటిని వెలిగించకూడదని మనోహర్‌సింగ్ ఆర్డర్. ఆ వెలుతురు శత్రువులకు తమ వునికి తెలియజేస్తుందని అతడీ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో ఆరుకు ముందే అన్ని పనులు కానించుకోని ఏడుగంటలకే అంతా నిద్రకు వుపక్రమించారు.

కానీ, ఆ రాత్రి వారికి నిద్రపోయే అవకాశమే లేకపోయింది. ఆ ప్రాంతంలో ఎలుకలు ఎక్కువగా వుండటంతో అవి రాత్రంతా అటూ - ఇటూ పరిగెడుతూ చప్పుడు చెయ్యసాగాయి. వాటిల్లో సైనికుల్లా మరీ ధైర్యమైనవి జవాన్ల కాళ్ళా మీద నుంచి, చేతులుమీద నుంచి పాకడం మొదలుపెట్టాయి.

మర్నాడు వుదయం అంతా నిద్ర కళ్ళతోనే లేచారు. అందరినోటా ఒకటే మాట - 'ఎలుకలు నిద్రపోనివ్వలేదని..' తమ పనులు పూర్తి కాగానే అంతా ఒకచోట చేరారు. మనోహర్‌సింగ్ వారందరిని వుద్దేశించి చిన్న ప్రసంగం చేశాడు.

"వీర జవానులారా.. మనకి ఇక్కడ్నుంచి ముందుకు కదలవద్దని బేస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. శత్రువులు మనవైపే వస్తున్నారు. ముందు ముందు ఎక్కడా ఇంత అనుకూలమైన ప్లేస్ మనకి దొరకదు. యుద్ధానికి అంతా సిద్ధం కండి. భారతదేశం తన పుత్రుల ధైర్యసాహసాలు చూడాలనుకుంటోంది. మీ భార్యా పిల్ల దగ్గరికి విజయపతాకం తిరిగి వెళ్ళేందుకు అవకాశం వచ్చింది. జై హింద్.." అన్నాడు హిందీలో.

ఆ తరువాత అంతా బంకర్లు సిద్ధం చేసుకోవడంలో వుండిపోయారు. యుద్ధానికి అంతా సిద్ధమౌతూ వుంది. ఆ రాత్రే శత్రువులు అక్కడికి చేరుకోవచ్చని అంచనా వేసుకున్నారు. చాలామంది తమ ఇళ్ళకు యుద్ధం మొదలౌతోందని, తాము విజయంతో తిరిగిరావాలని ప్రార్థనలు చేయమంటూ ఉత్తరాలు రాసారు.

ఆ రోజు రాత్రి ఎవరినీ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశాడు మనోహర్‌సింగ్. అయినా ముందురోజు రాత్రి ఎవరికీ నిద్రలేకపోవటంతో ఒక్కొక్కరే నెమ్మదిగా నిద్రలోకి జారుకోసాగారు. అంతలోనే ఏ ఎలుకో రావటం అరికాళ్ళ మీద గోళ్ళతో గీరడమో, మీదనుంచి దూకడమో చెయ్యడంతో మళ్ళీ నిద్రలేస్తున్నారు. ఆ రోజు రాత్రి కూడా ఎలుకలు వాళ్ళని నిద్రపోనివ్వలేదు. శత్రువులు తెల్లవారినా కూడా అటు వైపు రాలేదు.

మర్నాడు తెల్లవారుతూనే యుద్ధం మొదలైంది. శత్రువుల మీద కాదు.. ! ఎలుకల మీద..! జవానులంతా తమ రైఫిల్స్ వెనక్కి తిప్పి కనపడ్డ ఎలుకనల్లా కొట్టడం మొదలుపెట్టారు. యుద్ధప్రాతిపదిక మీద అంతా వాటి కోసం గాలించారు. అని దొరికినట్లే దొరికి పారిపోసాగాయి. వాళ్ళ దెబ్బలను తప్పుకుంటూ అటూ, ఇటూ తప్పించుకోజూసాయి. అయినా వాటిని వదల్లేదు, జవాన్లు. దాదాపు అన్ని ఎలుకల్ని చంపేసి టెంట్లకి దూరంగ ఒక గుంటలో పడేశారు.

"ఈ రోజు రాత్రికి హాయిగ నిద్రపోవచ్చు..!" అనుకున్నారు. ఎవరు ఎక్కువ ఎలుకల్ని చంపారో లెక్కలేసుకొని వాడికే పరమవీర చక్ర అంటూ సరదాగా నవ్వుకున్నారు.

ఆ రోజు రాత్రి కాళరాత్రిలా వుంది. నక్షత్రానికి, నక్షత్రం కనపడనంత చీకటిగా వుంది. జవాన్లలో దాదాపు సగంపైనా నిద్రపోయారు. మిగిలిన వాళ్ళలో కొంతమంది శత్రువులు వస్తారేమోనని సగం నిద్రేపోతున్నారు. మనోహర్‌సింగ్ అప్పటికీ చాలామందిని తట్టిలేపుతూ అప్రమత్తంగా వుండమంటూ చెప్తున్నాడు.

సరిగ్గా రాత్రి మూడుగంటలకు ఎవరో జవాను సిగరెట్ వెలిగించాడు.. అదీ ఒక చెట్టు చాటునుండి..! కానీ అప్పటికే అది శత్రువుల కంటబడింది. చీకట్లో ఎవరూ లేరని ముందుకు వస్తున్న సైనికులు అ చిన్న వెలుగు చూసి అకడే ఆగిపోయారు. ఒక గంటలో సురక్షితమైన చోట్లలో అంతా సిద్ధమైపోయారు. తెల్లవారక ముందే కాల్పులు మొదలయ్యాయి.

భారత జవాన్లు 'యమపాశం బిగిసుకుందా' అన్నంత భయంతో నిద్రలేచారు. ఎలర్ట్ అయిపోయి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసరికే కొంతమంది నేలకొరిగారు. ఇక మొదలైంది బులెట్ల వర్షం..!

ఒక పోరాటం ఆరంభమైంది. దేశంకోసం ప్రతి సైనికుడు ప్రాణాలను సైతం లెక్క చెయ్యలేదు. మాతృభూమికోసం నేలకొరుగుతున్న వీరులను చూసి భూమి కంపించిపోతోంది. మనోహర్‌సింగ్ సైనికులని ఉత్తేజపరచడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఆ రోజు సాయంత్రానికి భారత జవానులే అత్యధికంగా గాయపడ్డారు.

ఈ లోగా భారత జవాన్ల టెంట్లలో ఒక విచిత్రం జరిగింది. చాలావరకు దుప్పట్లు, బట్టలు ఎలుకలు కొట్టేసాయి. చాలవరకు బట్టలు పేలికలైపోయాయి. పేస్టు, సబ్బు వంటివి, ఫస్ట్ ఎయిడ్ మందులు ఎత్తుకెళ్ళిపోయాయి. అది చూసిన జవాన్లు విస్తుపోయారు. అన్నింటినీ చంపగా మిగిలినవి నాలుగో - అయిదో వుంటాయి.. అవి ఇంత పని చెయ్యగలిగాయంటే నమ్మశక్యంగా అనిపించలేదు జవాన్లకు. ఈ విషయంలో మనోహర్‌సింగ్‌కి కూడా ఎలాంటి మినహాయింపు లేకుండాపోయింది.

యుధంలో రెండు వైపుల సైనికులకి అప్పటికే ఒక విషయం అర్థమైంది. చనిపోగా మిగిలిన వారందరూ రాళ్ళాచాటున, చెట్లచాటున సురక్షితంగా వున్నారు.కాబట్టి అనవసరంగా కాల్పులు జరపడం ఆయుధ బలాన్ని వృధా చెయ్యడమే అనుకున్నారు. దాంతో కాల్పులు చాలా వరకు తగ్గిపోయాయి. శత్రువులు మాత్రం ముందుకు రావడానికే ప్రయత్నిస్తూనే వున్నారు.

ఆ పరిస్థితుల్లో మనోహర్‌సింగ్ ఒక సమావేశం ఏర్పాతు చేశాడు. సైనికులు తగ్గలేదన్న భ్రమ శత్రువులకు కల్పిస్తూ అక్కడక్కడ కొంతమంది జవాన్లను వుంచి, వారినే అటూ, ఇటూ కదులుతూ కల్పులు జరపమని ఆదేశించాడు.
మిగిలిన వారంతా మనోహర్‌సింగ్ టెంట్ వద్దకు చేరారు. అతను ఠీవిగా నిలబడ్డాడు. ఒక పక్క స్ట్రెచర్లమీద చనిపోయిన వీరజవాన్లు వున్నారు. మనోహర్ చేతిలో ఒక చచ్చిన ఎలుక వుంది. అతను చెప్పడం ప్రారంభించాడు -


"వీర జవానులారా.. మీరు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. మాతృభూమి కోసం శ్రమిస్తున్న మీ అందరికీ అభినందనలు. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి ముఖ్యకారణం ఏమిటంటే మనం మన యుద్ధ వ్యూహాన్ని మార్చబోతున్నాం. అది ఎమిటనే ముంది ఒక చిన్న మాట -

"ఈ ఎలక చూడండి.. ఎంత చిన్న జంతువో..! ఇది ఎన్ని డ్రస్సుల్ని, ఎన్ని గుడ్డల్ని కొరికేసిందో.. ఎన్ని సబ్బులు ఎత్తుకెళ్ళిందో.. ఇదంతా ఎందుకు చేసింది..? మనం వచ్చిన మొదటి రెండు రోజులు చెయ్యనిది ఈ రోజు చేసింది. అంటే దానర్థం ఏమిటి..? మనం దీని తోటి జంతువుల్ని చపామన్న కోపం..! కసి..!

"తన ప్రాణలకు తెగించి.. చచ్చినా ఫర్వాలేదనుకొని ఇది మన దుస్తుల్ని పాడు చేసింది. ఎందుకు ? కేవలం తన సహచరుల్ని చంపామన్న పగతో..!

ఇంత చిన్న జంతువులోనే ఇంత పగ వుంటే... మనకెంత వుండాలి.. అదుగో చూడండి మన జవాన్లు.." ఒక్క క్షణం ఆగాడు మనోహర్‌సింగ్. అందరి దృష్టి స్ట్రెచర్లమీద పడింది.

"నిన్నటిదాకా మీతో మాట్లాడుతూ.. మీ తల్లిని, భార్యని, బిడ్డల్ని మర్చిపోయేలా మీతో కలిసిపోయిన స్నేహితులు.. ఇప్పుడు నిర్జీవంగా వున్నారు. ఆ శత్రువులే వీళ్ళను చంపారు.చూడండి..! మీకు పౌరుషం కలగడం లేదా? పగ రగలడం లేదా? పదండి వాళ్ళాని నాశనం చేద్దాం.. సమూలంగా అంతం చేద్దాం..! ఏమంటారు?"

"ఎస్ సార్.." అరిచాయి అన్ని గొంతులు.

దానికి తగ్గట్టుగానే మనం మన వ్యూహాన్ని మారుద్దాం. మనం ఇప్పుడు మూడు గ్రూపులుగా విడిపోదాం. శత్రువులను మూడూ వైపుల నుంచి ముట్టాడి చేద్దాం. గుర్తుంచుకోండి వీలైనంతవరకు వారి ఆయుధా బలాన్ని తగ్గించాలి.. ఈ వీర జవాన్లక్ ఆత్మశాంతినివ్వండి.. పదండి.. వందేమాతరం" అన్నాడు ఆవేశంగా.

"వందేమాతరం" అన్నాయి జవాన్లందరి కంఠాలు. ఒక్కసారి అంతా చచ్చిన ఎలుక వైపు చూసారు. వారిలో పౌరుషం రగులుకుంది. ఆనకట్ట తెగిన వరదనీరులా దూసుకుపోయారు. ప్రతి జవాను ఒక ప్రళయకాళ రుద్రుడయ్యాడు. ఇప్పుడు వారి ధ్యేయం ఒక్కటే. అదే శత్రువినాశనం. ప్రాణాలకు తెగించారు.. గాయపడ్డా ఆగడంలేదు. వారి తెగింపుకు శత్రువులు వెనకడుగు వేసారు. ఆ రోజు సాయంత్రానికి త్రివర్ణ పతాకం వినువీధుల్లో గర్వంగా తలయెత్తింది.

***

నెలలు గడిచాయి..! కమాండర్ మనోహర్‌సింగ్‌కు గ్యాలంటరీ అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు సాయంత్రం జరిగిన అభినందన సభలో మనోహర్‌సింగ్ ప్రసంగించాడు -

"ఇది మన విజయం... భారతదేశ విజయం.. ఈ విజయానికి నిజమైన సారధి నేను కాదు... మీకు చెప్పినా నమ్మరు కానీ ఈ గెలుపుకి నిజమైన కారణం ఒక చచ్చిన ఎలుక. అవును చచ్చిన ఎలుక.." అంటూ జరిగింది చెబుతుంటే అంతా సభ్రమంగా వినసాగారు.

(విద్యుల్లత, సెప్టెంబరు 1995)
Category: